Operation Sindoor: అంతు చూసేంత వరకు ఆపోద్దు.. ఆపరేషన్ సింధూర్పై రజనీకాంత్
జమ్ము కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రభుత్వం ప్రతీకార చర్యను చేపట్టింది. పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలోని పలు ప్రాంతాల్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం వైమానిక దాడులు చేపట్టింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలు మూకుమ్మడిగా దాడి చేయడంతో పాక్ ఉగ్రవాద బృందాలు బెంబేలెత్తుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి 1.44 గంటల ప్రాంతంలో పాక్ సరిహద్దులోని 9 ప్రాంతాలపై భారత సేనలు మెరుపుదాడులు చేశాయి. ఈ క్రమంలో ఈ దాడులపై సినీ ప్రముఖులు, భారతీయ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రముఖుల స్పందన వివరాల్లోకి వెళితే..
ఆపరేషన్ సింధూర్ పేరుతో పహల్గాం బాధితులకు ఊరట కలిగించేందుకు, ఆ ఉగ్రదాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చేలా భారత సైన్యం దాడులు చేపట్టింది. బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టామని భారత ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అన్ని వర్గాలు హర్షం ప్రకటించడమే కాకుండా మద్దతుగా నిలుస్తున్నాయి.

పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు నిర్వహించడంపై భారతీయ సినిమా పరిశ్రమ స్పందించింది. చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రజనీకాంత్, హను రాఘవపూడి తదితరులు సోషల్ మీడియా వేదికగా తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ట్వీట్ వైరల్ అయింది.
ఆపరేషన్ సింధూర్ గురించి రజనీకాంత్ ట్వీట్ చేస్తూ.. సైనిక యోధులు యుద్దం మొదలు పెట్టారు. ఉగ్రవాదుల అంతు చూసే వరకు ఈ మిషన్ను ఆపోద్దు. భారత్లో అలజడి సృష్టించడానికి ప్రయత్నించే ఉగ్రవాదులను ఏరి పారేసేంత వరకు ఈ దాడులు కొనసాగాల్సిందే. దేశం యావత్తు మీకు అండగా నిలబడుతుంది అని రజనీకాంత్ ట్వీట్లో పేర్కొన్నారు. తన ట్వీట్ను ప్రధాని కార్యాలయం, హోమ్ మినిస్టర్ ట్యాగ్ చేసి.. ఆపరేషన్ సింధూర్.. జై హింద్ అంటూ ట్వీట్ను ముగించారు.
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ముఖ్ తాజా పరిస్థితిపై స్పందించారు. పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తున్న భారత సైన్యానికి అండగా నిలిచారు. జై హింద్ కి భారత సేన. భారత్ మాతా కీ జై.. ఆపరేషన్ సింధూర్ అంటూ ట్వీట్ చేశాడు.
తమిళ సూపర్ స్టార్, టీవీకే పార్టీ అధినేత విజయ్ సోషల్ మీడియాలో స్పందించారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత సైన్యాన్ని అభినందించారు. సెక్యూరిటీ ఆపరేషన్స్ చేపట్టిన భారత సైన్యానికి నా రాయల్ సెల్యూట్ అని విజయ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్ గురించి సూపర్ స్టార్ మమ్ముట్టి ట్వీట్ చేశారు. రియల్ హీరోలకు నా సెల్యూట్. దేశ సమగ్రత ప్రశ్నించే సమయం ఎప్పుడు వచ్చినా ఇండియన్ ఆర్మీ దానికి సమాధానం సరైన రీతిలో ఇస్తుంది. దేశ ప్రజల సంరక్షణ బాధ్యతను భుజానికి ఎత్తుకొని ఓ ఆశను కలిగించింది. మీరు దేశానికి గర్వంగా నిలిచారు. జై హింద్ అని భారత ఆర్మీపై ఆయన ప్రశంసలు గుప్పించారు.
సింధూరాన్ని కేవలం మన సంప్రదాయం కోసం పెట్టుకోం. కానీ దానిని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారంగా చూపుతాం. మనకు ఎవరైనా సవాల్ విసిరితే అంతకంటే బలంగా, భయం లేకుండా ఎదురొడ్డి నిలుస్తాం. ధైర్య సహసాలు ప్రదర్శిస్తున్న ఆర్మీ, నేవి, ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్ సేనకు నా సెల్యూట్. మీ గుండె ధైర్యం మాకు గర్వ కారణమౌతుంది. జై హింద్ అంటూ మోహన్ లాల్ ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











