అవెంజర్స్-ది ఎండ్గేమ్ ఎఫెక్ట్: రజనీ 2.0 చైనా రిలీజ్ వాయిదా!
రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఇండియన్ బిగ్ బడ్జెట్ మూవీ 2.0. గతేడాది ఇండియాలో విడుదలైన ఈ చిత్రం తాజాగా చైనాలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. చైనా థియేట్రకల్ రైట్స్ ఆ దేశంలోనే అతిపెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ హెచ్.వై.మీడియా సొంతం చేసుకుంది.
చైనాలో ఈ చిత్రాన్ని దాదాపు 56,000 స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో 47,000 3డి స్క్రీన్లు కావడం విశేషం. మే 2న విడుదల చేసేందుకు గతంలో ప్లాన్ చేశారు. అయితే అవెంజర్స్-ది ఎండ్ గేమ్ చైనాలో సంచలన వసూళ్లు సాధిస్తుండటంతో ఈ వారం ఇతర సినిమాల విడుదలను నిలిపివేశారు. 2.0 మే లేదా జూన్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

చైనాలో భారీ ఎత్తున విడుదలవుతున్న రజనీకాంత్ మూవీ ఇది. సూపర్ స్టార్ సినిమాలకు జపాన్, మలేషియా, ఇతర దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. చైనాలో ఆ పరిస్థితి లేదు. అయితే 2.0 రిలీజ్ తర్వాత ఆయన సినిమాల మార్కెట్ అక్కడ పెరుగుతుందని భావిస్తున్నారు.
ఇటీవల కాలంలో ఇండియన్ సినిమాలకు చైనా అతిపెద్ద మార్కెట్గా మారింది. అమీర్ ఖాన్ సినిమాలకు భారీ డిమాండ్ ఉంది. దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రాలు వందల కోట్లు వసూలు చేశాయి. బాహుబలితో పాటు పలు బాలీవుడ్ చిత్రాలు అక్కడ విడుదలయ్యాయి.
ఇప్పటి వరకు చైనాలో విడుదలైన భారతీయ సినిమాల్లో దంగల్ (రూ. 736 కోట్లు), అంధాదున్ (రూ. 303 కోట్లు), బజరంగీ భాయిజాన్(రూ. 295 కోట్లు), హిందీ మీడియం (రూ. 218 కోట్లు) రాబట్టింది. ఈ నేపథ్యంలో త్వరలో విడుదల కాబోయే 2.0 చిత్రం కూడా మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











