Don't Miss!
- Finance Jhunjhunwala News: కంపెనీలో 5 లక్షల షేర్లు కొన్న జున్జున్వాలా.. నష్టాల మార్కెట్లోనూ స్టాక్ ర్యాలీ..
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
1000 మందికి రజనీకాంత్ ఆశ్రయం
చెన్నై: వరద బాధితుల కోసం పది కోట్లు విరాళం ఇచ్చిన రజనీకాంత్ మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. చెన్నైలో పారిశుద్ధ్య పనులు పూర్తయ్యే వరకు తనకు చెందిన రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఉండవచ్చని ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ తెలిపారు. వరద వల్ల చెన్నై చెత్త నగరంగా మారింది. చెత్త తొలగించడానికి బయటి వూళ్ల నుంచి అధిక సంఖ్యలో పారిశుద్ధ్య కార్మికులను చెన్నైకి రప్పించారు.
ఇలా మక్కల్, సేలం, ధర్మపురి సహా 11 జిల్లాలకు చెందిన సుమారు వెయ్యి మంది వచ్చారు. బస చేయడానికి స్థలం లేక ఇబ్బందిపడ్డారు. సమాచారం తెలిసిన రజనీకాంత్ తనకు చెందిన రాఘవేంద్ర కల్యాణ మండపంలో వారికి బస ఏర్పాటు చేశారు. ఇక్కడ పనులు పూర్తయ్యే వరకు ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపారు.
మరో ప్రక్క వరద బాధిత నటులకు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (ఫెఫ్సీ) సహాయ సామగ్రి అందించింది. ఇటీవల కురిసిన భారీవర్షాలకు ఫెఫ్సీకి చెందిన వారు కూడా నష్టపోయారు. వేళచ్చేరి, పోరూరు, వలసరవాక్కం, విజయరాఘవపురం, రాణి అన్నానగర్, సాలిగ్రామం, వడపళని వంటి ప్రాంతాల్లోని సినీ నటులు వరదలో చిక్కుకున్నారు.
సినిమా, బుల్లితెర ధారావాహిక చిత్రీకరణలు లేకపోవడంతో వారికి జీవనాధారం దెబ్బతింది. వారికి సాయం చేయడానికి ఫెఫ్సీ చర్యలు చేపట్టింది. తమిళ సినిమా నిర్మాతల సంఘం, దక్షిణ భారత చలనచిత్ర వర్తక సభ, దక్షిణ భారత నటుల సంఘం, సంగీత దర్శకులు ఇళయరాజా, ఏ.ఆర్.రెహ్మాన్, హారీస్ జయరాజ్, ఇమాన్ తదితరుల ద్వారా సహాయ సామగ్రి సేకరించి తొలి విడతగా 5 వేల మందికి మంగళవారం అందించింది.
బియ్యం, కంది పప్పు, పంచదార, గోధుమ పిండి, వంట నూనె, ధోవతి, చీర, దుప్పటి, కండువా తదితర సామగ్రిని సంగీత దర్శకుడు ఇళయరాజా చేతులమీదుగా పంపిణీ చేసింది. వడపళనిలోని సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెఫ్సీ అధ్యక్షుడు శివ, తమిళ సినిమా నిర్మాతల సంఘం అధ్యక్షుడు ఎస్.థాణు, దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, సంగీత దర్శకులు ఎస్.ఏ.రాజ్కుమార్, కాస్ట్యూమ్ నిపుణులు సాయి తదితరులు పాల్గొన్నారు.