నా గుండె ముక్కలైంది.. వివేక్ మృతితో రజినీకాంత్ తీవ్ర దిగ్బ్రాంతి!
తమిళ నటుడు వివేక్ మృతితో సూపర్స్టార్ రజనీకాంత్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. తనతో ఉన్న అనుబంధాన్ని, అనుభూతులను ఆయన నెమరు వేసుకొన్నారు. తన తోటి నటుడు ఈ లోకాన్ని వీడారనే వార్తను జీర్ణించుకోలేకపోయారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రజినీకాంత్ భావోద్వేగంతో కూడిన సందేశాన్ని పోస్టు చేశారు.
చిన్న కలైవవానర్, సామాజిక కార్యకర్త, నా సహచర నటుడు వివేక్ మరణవార్త వినగానే నా గుండె ముక్కలైంది. శివాజీ సినిమా కోసం కలిసి పనిచేసిన ఆ రోజులను ఎప్పటికీ మరిచిపోలేను. మహా విషాదంలో కూరుకుపోయిన ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని తన సంతాప ప్రకటనలో వెల్లడించారు.

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వం వహించిన శివాజీ చిత్రంలో రజనీకాంత్, వివేక్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం అంటే ఏప్రిల్ 17వ తేదీ ఉదయం గుండెపోటుకు గురికావడంతో ఆయనను చెన్నైలోని సిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. ఈ నేపథ్యంలో అత్యంత నిపుణులైన వైద్య బృందం చికిత్స అందిస్తుండగా శనివారం ఉదయం తుదిశ్వాస విడిచి భారతీయ సినీ లోకాన్ని విషాదంలో ముంచెత్తారు.
వివేక్ మరణ వార్తతో దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ వర్గాలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీతోపాటు జాతీయ నాయకులు, బాలీవుడ్, టాలీవుడ్ ఇతర సినీ వర్గాల ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. వివేక్ లేని లోటు పూడ్చటం అసాధ్యం అంటూ తమ సంతాప ప్రకటనల్లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











