జయం రవి విడాకుల కేసులో ట్విస్ట్.. నెలకు 40 లక్షలు ఇస్తేనే.. షాకిచ్చిన ఆర్తి రవి
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకులు, సింగర్ కేనీషా ఫ్రాన్సిస్తో ఎఫైర్ రకరకాల మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై రోజుకొకరు మాట్లాడుతూ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు. దీంతో ఎవరి మాట నిజమో? ఎవరి వెర్షన్ నమ్మాలో తెలియక సినీ జనాలు, ప్రేక్షకులు చోద్యం చూస్తున్నారు. ఎఫైర్, విడాకులను దాటి జయం రవి ఇష్యూ ఏటేటో తిరుగుతోంది. తాజాగా జయం రవికి ఆయన భార్య ఆర్తి రవి షాకిచ్చారు ఈ వివరాల్లోకి వెళితే..
జయం రవిపై ఆర్తి ఆరోపణలు
కేనీషా ఫ్రాన్సిస్తో జయం రవి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో ఆ వెంటనే ఆర్తి రవి సీన్లోకి వచ్చారు. 18 ఏళ్లు తనతో కాపురం చేసిన వ్యక్తి ఇలా చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు ఏం జరిగినా తన బిడ్డల కోసం మౌనంగా భరించానని .. భర్తగా, తండ్రిగా జయం రవి తన బాధ్యతల నుంచి తప్పించుకుని తిరుగుతున్నారని ఆర్తి రవి ఆరోపించారు. తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉండగానే రవి మరో అమ్మాయితో తన బంధాన్ని బయటపెట్టారని ఆమె మండిపడ్డారు.

కేనీషాతో పరిచయం వల్లే
అయితే మానసికంగా, శారీరకంగా తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని జయం రవి ఓ నాలుగు పేజీల లేఖను సోషల్ మీడియాలో వదిలారు. తన తల్లిదండ్రులను కూడా కలవడానికి వీల్లేకుండా పోయిందని ఆర్తితో చివరి వరకు కలిసి ఉండటానికే తాను ప్రయత్నించానని రవి పేర్కొన్నారు. కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని, కేనీషాతో పరిచయం తర్వాతే ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని తెలిపారు.
అల్లుడిపై సుజాత ఆరోపణలు
వివాదం ముదురుతున్న దశలో జయం రవి అత్తగారు, ఆర్తి రవి తల్లి సుజాత విజయ్ కుమార్ తన అల్లుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జయం రవిని తాను అల్లుడిలా కాకుండా కొడుకులా చూసుకున్నానని, ఆయన వల్లే తాను సినిమాల నిర్మాణం దిశగా అడుగులు వేశానని చెప్పారు. ఇందుకోసం దాదాపు రూ.100 కోట్లు అప్పులు చేసి అడంగ మరు, భూమి, సైరన్ చిత్రాలు నిర్మించానని సుజాత పేర్కొన్నారు.
మూడో వ్యక్తి వల్లే విడాకులు
ఆ వెంటనే ఆర్తి రవి మరోసారి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. జయం రవితో తాను విడిపోవడానికి డబ్బు, అధికారం కారణం కాదని మూడో వ్యక్తి వల్లే తమ జీవితంలో కలతలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ విషయమై తాను ఏదో ఊహించి చెప్పడం లేదని, నా వద్ద ఆధారాలున్నాయని ఆర్తి రవి తెలిపారు. పరోక్షంగా సింగర్ కేనీషా కారణంగానే జయం రవితో విడిపోయానని ఆర్తి రవి హింట్ ఇచ్చినట్లు అయ్యింది. ఇలా వీరి వ్యవహారం రోజుకోక మలుపు తిరుగుతున్న వేళ ఆర్తి రవి షాకిచ్చారు.
భరణంగా నెలకు రూ.40 లక్షలు
విడాకుల కేసు నేపథ్యంలో జయం రవి, ఆర్తి రవిలు మే 21న చెన్నై ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. దీనిపై విచారించిన న్యాయస్థానం రాజీ కోసం కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించింది. అయితే ఆర్తితో ఇకపై కలిసి జీవించే ఉద్దేశం లేదని రవి తేల్చి చెప్పడంతో, రవికి విడాకులు మంజూరు చేయాలని అతని టీమ్ న్యాయస్థానాన్ని కోరింది. ఇదే సమయంలో రవి తనకు విడాకులు ఇస్తుండటంతో నెలకు రూ.40 లక్షలను భరణం కింద ఇప్పించాలని ఆర్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన చెన్నై ఫ్యామిలీ కోర్ట్.. ఈ కేసు విచారణను జూన్ 12కి వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారగా.. ఆర్తి పిటిషన్పై జయం రవి ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











