ఆ హీరోను ఓటు వేయడానికి అనుమతించడం... అధికారుల కొంపముంచింది!
తమిళనాడులో లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం తమిళ స్టార్ శివకార్తికేయన్ ఓటు విషయంలో వివాదం రేగింది. ఓటరు లిస్టులో అతడి పేరు లేక పోయినా స్పెషల్ పర్మీషన్ ఇచ్చి ఓటు వేయించడమే ఇందుకు కారణం.
ఓటరు లిస్టులో ఓటు లేక పోయినా అతడిని ఓటు వేయడానికి అనుమతించిన పోలింగ్ బూత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి సత్యబ్రతా సాహూ ఆదేశాలు జారీ చేశారు. 'ఎవరినైనా సరే ఓటరు లిస్టులో ఓటు ఉంటేనే ఓటు వేయడానికి అర్హులు. లిస్టులో పేరు లేకుండా అనుమతించడం పెద్ద తప్పు. ఇది పోలింగ్ బూత్ సిబ్బంది తప్పిదమే.' అని సాహూ మీడియాకు తెలిపారు.

భార్య పేరు ఉంది కానీ...
శివకార్తికేయన్ తన ఓటు హక్కును వలసరవాక్కంలోని గుడ్ షెఫెర్డ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో వినియోగించుకున్నారు. ఓటరు లిస్టులో అతడి భార్య పేరు ఉన్నప్పటికీ అతడి పేరు మిస్సయింది. అయినప్పటికీ అధికారులు ఓటు వేసేందుకు అనుమతించారు.

మీడియాకు చెప్పడంతో పెద్దదైన వివాదం
ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం శివకార్తికేయన్ మీడియాతో మాట్లాడుతూ.. తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చారని తెలిపారు. ఓటు వేసినట్లు తెలుపుతూ ఇంక్ గుర్తు ఉన్న తన వేలు చూపిస్తూ సోషల్ మీడియాలో ఫోటో కూడా పోస్ట్ చేశారు. ‘ఓటింగ్ అనేది నీ రైట్.. దాని కోసం ఫైట్ చేయాలి' అంటూ కామెంట్ చేశారు.

మరో నటుడు విషయంలో కూడా..
శివకార్తికేయన్ మాత్రమే కాదు.. ఇదే విధంగా మరొక నటుడు శ్రీకాంత్ కూడా లిస్టులో తన పేరు లేకపోయినప్పటికీ ఓటు వేసేందుకు అధికారులు అనుమతించారు. సాలిగ్రామంలోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. అయితే ఈ విషయమై అధికారులపై చర్యలు తీసుకున్నారా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదు.

పాపం వీరిని అనుమతించలేదు
అయితే రమేష్ ఖన్నా, రోబో శంకర్ లాంటి తమిళ సినీ నటులను మాత్రం లిస్టులో పేరు లేని కారణంగా అధికారులు ఓటు వేయడానికి అనుమతించలేదు. లోక్ సభ 2019 ఎన్నికలు రెండవ దశలో భాగంగా తమిళనాడుతో సహా 11 రాష్టాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో ఏప్రిల్ 18న పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











