తండ్రిపై వస్తున్న రూమర్లపై స్పందించిన ఎస్పీ చరణ్
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణవార్త తెలుగువారిని తీవ్ర విషాదంలోకి నెట్టి వేసింది. నలబై రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న ఎస్పీబి ఎలాగైనా తిరిగివస్తారు అన్న ఆకాంక్ష జోరువానలో ఉప్పులా కరిగిపోయింది. వేల పాటలకు ప్రాణం పోసిన ఆ గాన గంధర్వుడు ఊపిరి ఆగిపోయిందన్న వార్త సంగీత ప్రపంచాన్ని శోకంసంద్రంలోకి నెట్టివేసింది.
బాలు మరణం తర్వాత సోషల్ మీడియాలో ఆయన ఆసుపత్రి బిల్లు పై ఒక వార్త వైరల్ అయ్యింది. ఎస్పీ బాలు చనిపోయిన తర్వాత బిల్లుపై వివాదం జరిగిందని అందులో రాసుకొచ్చారు. బాలు చికిత్సకు దాదాపు 3 కోట్ల బిల్లును ఎంజీఎం ఆస్పత్రి వేసిందని.. తమిళనాడుప్రభుత్వాన్ని ఆశ్రయించగా ఆ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని ,ఆ తర్వాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసినట్లు ప్రచారం జరిగింది.బ్యాలెన్స్ అమౌంట్ ను ఉపరాష్ట్రపతి వెంకయ్య కూతురు చెల్లించిందని అప్పుడు మృతదేహాన్ని అప్పగించారని సోషల్ మీడియాలో చర్చ జరిగింది.

తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న చరణ్ ను ఈ వార్త మరింత కలతకు గురిచేసింది. ఎస్పీచరణ్ లైవ్ ద్వారా ఆ వార్తలను ఖండించారు.సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త అబద్ధమని చరణ్ తెలిపారు.
త్వరలోనే ఎంజీఎం ఆస్పత్రి వైద్యులతో కలిసి బాలు చికిత్స వివరాలు, బిల్లులు బయటపెడుతామని విలేఖరుల సమావేశంలో చెబుతామని చరణ్ క్లారిటీ ఇచ్చారు.తన తండ్రికి చికిత్సనందించిన ఎంజీఎం ఆస్పత్రిపై విష ప్రచారం చేయడం సరికాదని ఎస్పీ చరణ్ ఆవేదన వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











