Ajith Kumar: స్టార్ హీరో అజిత్ ఇంట్లో పెను విషాదం.. వెకేషన్లో ఉండగానే దుర్ఘటన
తమిళ సినీ పరిశ్రమకు చెందిన హీరోనే అయినా దక్షిణాదితో పాటు నార్త్లోనూ ప్రభావాన్ని చూపిస్తూ స్టార్ హీరోగా వెలుగొందుతోన్నాడు థలా అజిత్ కుమార్. కెరీర్ ఆరంభంలోనే విలక్షణమైన నటన.. విభిన్నమైన శైలి.. పక్కా కమర్షియల్ సినిమాలతో స్టార్డమ్ను అందుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గత సంక్రాంతికి 'తునివు' అనే చిత్రంతో వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అజిత్ కుమార్ ఇంట్లో పెను విషాదం చోటు చేసుకుంది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తండ్రి పీ సుబ్రమణ్యం (84) శుక్రవారం ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజులుగా ఆక్టోజెనేరియన్ అనే వ్యాధితో పాటు వయసు మీద పడడంతో వృద్దాప్యానికి సంబంధించిన కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా.. వైద్యులు చికిత్సను అందించారు. ఈ క్రమంలోనే మరోసారి ఆయన ఆరోగ్యం క్షిణించింది. దీంతో ఈరోజు ఉదయం ఆయన చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు.

పీ సుబ్రమణ్యం మరణ వార్తను తెలుసుకున్న సినీ ప్రముఖులు, అజిత్ కుమార్ అభిమానులు సంతాపం తెలుపుతున్నారు. అలాగే, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. అజిత్ కుమార్ తన భార్య షాలినీ, పిల్లలతో కలిసి ఇటీవలే ఫారెన్ వెకేషన్కు వెళ్లాడు. అక్కడ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తోన్నాడు. ఇలాంటి సమయంలోనే ఆయన కుటుంబంలో ఈ దుర్ఘటన జరిగింది. దీంతో అజిత్ వెంటనే స్వదేశానికి పయణమైనట్లు తెలిసింది. వాళ్లు చేరుకోగానే ఆయన అంత్యక్రియలు చెన్నైలోని బీసెంట్ నగర్లో ఉన్న శ్మశాన వాటికలో జరగనున్నట్లు తెలుస్తోంది.
పీ సుబ్రమణ్యం కేరళలోని పాలక్కాడ్కు చెందిన మలయాళీ కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత ఆయన తమిళనాడుకు వలస వచ్చేశారు. అనంతరం మోహినీ అనే ఆమెను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు అజిత్ కుమార్తో పాటు అనూప్ కుమార్, అనిల్ కుమార్లు జన్మించారు.


Click it and Unblock the Notifications











