ప్రముఖ నటుడు కన్నుమూత.. ఫేమస్ చేసిన అలవాటే ప్రాణం తీసిందా!
సినీ రంగంలో విషాదకర సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వెండితెరపై సందడి చేస్తున్న నటీనటులతో పాటు తెర వెనుక పని చేస్తున్న ఎంతో మంది టెక్నీషియన్లు, దర్శక నిర్మాతలు ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు బిజిలి రమేష్ మరణించారు. దీంతో కోలీవుడ్లో విషాదఛాయలు అలముకున్నాయి.
యూట్యూబ్లో ప్రాంక్ వీడియోలు చేస్తూ ఫేమస్ అవడంతో పాటు సినీ రంగంలో ఎన్నో అవకాశాలను అందుకున్న బిజిలి రమేష్ గత రాత్రి కన్నుమూశారు. వాస్తవానికి ఆయన చాలా కాలంగా పక్షవాతంతో మంచం మీదే ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి రమేష్ ఆరోగ్యం మరింతగా క్షిణించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే సమయంలోనే ఆయన కన్నుమూశారు. బిజిలి రమేష్ మరణ వార్తను కొందరు ప్రముఖులు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశారు.

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు బిజిలి రమేష్ మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో విషాద పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన మరణంపై అభిమానులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అలాగే, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో బిజిలి రమేష్ మరణంపై పోస్టులు చేస్తున్నారు.
బిజిలీ రమేష్ బ్లాక్షీప్ యూట్యూబ్ ఛానెల్లో ప్రాంక్ వీడియోలతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలోనే హిప్హాఫ్ ఆది నటించిన 'నట్బే సబ్' సినిమాతో నటుడిగా ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఆ తర్వాత జ్యోతిక నటించిన 'పొన్మగల్ వండాల్', అమలాపాల్ నటించిన 'అడై', జయం రవి నటించిన 'కోమలి', యాషిక ఆనంద్ నటించిన 'జోంబీ' వంటి చిత్రాలలో చిన్న పాత్రలు పోషించాడు. ఇలా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.

మద్యం సేవించి వీడియోలు చేస్తూ ఫేమస్ అయిన బిజిలీ రమేష్.. అదే అలవాటు కారణంగా పక్షవాతానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఈ తమిళ నటుడు ఇటీవలే ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. దీంతో ఏదైతే అతడిని ఫేమస్ చేసిందో అదే ఇప్పుడు ప్రాణాలు తీసిందని చాలా మంది చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











