వైయస్ జగన్ అరెస్టుతో ఇరుక్కున్న హీరో
మూడు రోజుల క్రితం జరిగిన వైయస్ జగన్ ఆరెస్ట్ రాష్ట్రంలో ఎంత సంచలనం క్రియేట్ చేసిందో తెలిసిందే. ఆ సమయంలో జగన్ అభిమానులు చాలా చోట్ల రోడ్లు పైకి వచ్చి అరెస్టు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. ఈ సమయంలో కొందరు ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడ్డ వారిలో తమిళ హీరో జీవా ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా తన బ్లాగ్ లో రాసుకొచ్చారు. తన తిరుపతి టూర్ ఈ చేదు అనుభవంతో ముగిసింది అన్నారు.
తమళ డబ్బింగ్ చిత్రం రంగం తో పరిచయమైన జీవా ...కుటుంబ సమేతంగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవటానికి వచ్చారు. ఆ రోజే సిబీఐ విచారణ మూడవ రోజు. అయితే మన రాష్ట్ర్రంలో రాజకీయాలు సంగతి సరిగ్గా తెలియని జీవా ఆ సాయింత్రం దైవ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం పెట్టుకున్నారు. అప్పుడు కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని సిబిఐ అధికారులు అరెస్టు చేసారనే వార్త వచ్చింది. దాంతో రెచ్చిపోయిన జగన్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎక్కడికక్కడ రోడ్లపై రాకపోకలను అడ్డుకున్నారు.
ఆ క్రమంలో హీరో జీవా ప్రయాణిస్తున్న కారు వరదయ్యపాళెం వద్ద ట్రాఫిక్లో చిక్కుకుంది. పోలీసులు అతికష్టమ్మీద ట్రాఫిక్ క్లియర్ చేసి జీవాకు దారి చూపించారు. కానీ కారు 20 మీటర్ల దూరం ప్రయాణించిందో లేదో మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. అయితే ఈసారి కారు ఉన్న ప్రాంతం సూళ్లూరుపేట పరిధిలోది కావటంతో తమకు సంబంధం లేదని సదరు పోలీసులు చేతులెత్తేశారు. దాంతో అనుకున్న సమయానికన్నా చాలా ఆలస్యంగా జీవా చెన్నయ్ చేరుకున్నాడు. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఒక బ్లాగ్లో రాసుకొచ్చాడు. అంతేగాక దానికి సంబంధించిన ఒక ఫోటో కూడా పోస్ట్ చేశాడు.
ఇక జీవా నటించిన తమిళ డబ్బింగ్ సినిమా 'రంగం'తెలుగులో బాగా ఆడింది. అందులో హీరో జీవా ఫోటో జర్నలిస్టు పాత్రలో రాజకీయ రంగాన్ని ప్రక్షాళన చేయటానికి నడుం బిగిస్తాడు. ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ పరిస్థితులకనుగుణంగా ఎత్తులు, పైఎత్తులు వేసి విజయం సాధిస్తాడు. అత్యంత ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా నడచిన ఆ సినిమాకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అయితే ఫోటో జర్నలిస్టు పాత్రలో రాణించిన జీవాకు మన రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి అంతగా తెలిసినట్లు లేదని,అందుకే ఇరుక్కుపోయాడని మీడీయాలో కామెంట్ చేయటం గమనార్హం.


Click it and Unblock the Notifications











