కష్టాల్లో ధనుష్.. రాయన్ హీరోకు నిర్మాత మండలి రెడ్ కార్డ్!
తమిళ సూపర్ స్టార్ ధనుష్ కష్టాల్లో పడినట్టు కనిపిస్తున్నది. తమిళ సినిమా పరిశ్రమలో ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, నిర్మాణ వ్యయం పెరిగిపోవడం.. నిర్మాతకు తడిసి మోపెడు అవుతున్న విషయాలపై తమిళ నిర్మాతల మండలి తీవ్రంగా పరిగణిస్తుంది. ఇటీవలే హీరో విశాల్కు షాకిచ్చిన మండలి.. తాజాగా ధనుష్పై కూడా కొరడా ఝుళిపించింది. ఈ వివాదానికి కారణాలేమిటనే వివరాల్లోకి వెళితే..
తమిళ సినిమా పరిశ్రమ పురోగతికి అడ్డుపడుతున్న హీరోల తీరుపై నిర్మాతల మండలి కన్నెర్ర జేసింది. ఈ క్రమంలో థ్రీ థెండాల్ ఫిల్మ్స్ అనే సినీ నిర్మాణ సంస్థ మండలికి ధనుష్పై ఫిర్యాదు చేసింది. ధనుష్ గతేడాది మా వద్ద అడ్వాన్స్ తీసుకొన్నాడు. కానీ సినిమా షూటింగ్కు డేట్స్ కేటాయించడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నది.

అయితే ధనుష్తో డేట్స్ గురించి చర్చలు జరపాలని సూచిస్తూ.. ఇంకా ఎవరి వద్దనైనా ఆయన అడ్వాన్సులు తీసుకొంటే వారు తమకు వివరాలు వెల్లడించాలని నిర్మాత మండలికి సూచించింది. ధనుష్తో సినిమాలు చేయడానికి చేసిన చెల్లింపుల వివరాలు కూడా తమకు వెల్లడించాలని తెలిపింది.
నిర్మాతల ఫిర్యాదు మేరకు ధనుష్కు రెడ్ కార్డు రిలీజ్ చేసి హెచ్చరికలు జారీ చేసింది. అలాగే తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ.. విశాల్కు కూడా నోటీసులు జారీ చేసింది.

హీరోలు, హీరోయిన్ల రెమ్యునరేషన్లు, అడ్వాన్సుల వివాదం నేపథ్యంలో ఆగస్టు 16వ తేదీ వరకు కొత్త సినిమాల షూటింగులను వాయిదా వేసింది. దాంతో ఈ వివాదం సరికొత్త మలుపు తిరిగిందనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఆగస్టు 15వ తేదీ తర్వాత కొత్త సినిమాల షూటింగులు స్టార్ట్ చేయవద్దు. పాత సినిమాల షూటింగులు అక్టోబర్ 31వ తేదీ వరకు పూర్తి చేయాలి అని నిర్మాతల మండలి అల్టిమేటం ఇచ్చింది.
అయితే నిర్మాతల మండలి జారీ చేసిన నోటీసులకు విశాల్ ఘాటుగా స్పందించాడు. నన్ను సినిమాలు తీయకుండా ఆపేస్తే.. నిర్మాతల మండలి ఉంటుందా? అని సవాల్ విసిరాడు. అయితే నిర్మాతల మండలి నిర్ణయంతో ధనుష్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.


Click it and Unblock the Notifications











