ప్రభుత్వాలకు, సినీ కార్మికులకు అండగా.. అజిత్ భారీ విరాళం
కరోనా మహమ్మారిని ఎదురించేందుకు ప్రపంచ దేశాలు శాయశక్తుల పోరాడుతున్నాయి. ఈ వైరస్ దెబ్బకు మానవాళి మనుగడకే సంకటం ఏర్పడింది. కరోనా దెబ్బకు అగ్రరాజ్యమే అతలాకుతలైపోతోంది. అమెరికాలో లక్షల మందికి కరోనా సోకగా.. వేలల్లో జనాలు ప్రాణాలను కోల్పోయారు. మనదేశంలో రోజురోజుకూ పరిస్థితి విషమించిపోతోంది. ఇప్పటికే నాలుగు వేల మందికి పైగా కరోనా బారిన పడగా.. వంద మందికిపైగా ప్రాణాలను విడిచారు.
ఇలాంటి విపత్కర సమయాల్లో ప్రభుత్వాలకు అండగా నిలిచేందుకు హీరోలు ముందుకు వచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆర్థిక సాయాన్ని ప్రకటించి అండగా నిలబడుతున్నారు. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హీరోలంతా తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల హీరోలు కరోనాపై పోరాడేందుకు తమ మద్దతును తెలుపుతున్నారు.

ఈ క్రమంలో షూటింగ్లు లేక ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను కూడా ఆదుకుంటున్నారు. తాజాగా తమిళ మాస్ హీరో అజిత్ కుమార్ భారీ విరాళాన్ని ప్రకటించాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రూ. 50 లక్షల చొప్పున కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించగా.. సినీ కార్మికుల కోసం దక్షిణ భారత నటీనటుల సంఘం (ఫెఫ్సీ)కి రూ. 25 లక్షలు అందజేశాడు. ఈ మేరకు అజిత్పై సోషల్ మీడియాలో ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











