తంగలాన్, కంగువ సినిమాలకు కోర్టు షాక్.. డెడ్లైన్ దాటితే అంటూ సూర్య, విక్రమ్కు హెచ్చరిక
పాన్ ఇండియా ట్రెండ్లో తాము వెనుకబడిపోయామని తమిళ తంబీలు తెగ ఫీలైపోతున్నారు. ఒకప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్పై డబ్బింగ్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్గా, భారీ ప్రాజెక్ట్లకు కేరాఫ్గా నిలిచిన తమ ఇండస్ట్రీ ఇప్పుడు ఇలా కావటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. చివరికి తమ కంటే ఎన్నో రెట్లు చిన్నదైన కన్నడ సినిమా కూడా పాన్ ఇండియా మార్కెట్లో సత్తా చాటుతుండటం వారిని కలవరపాటుకు గురిచేస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పొన్నియన్ సెల్వన్, భారతీయుడు -2 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లాపడ్డాయి. దీంతో తంగలాన్, కంగువాలపై కోలీవుడ్ ఇండస్ట్రీ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నారు హీరో సూర్య. కమర్షియల్ చిత్రాలతో పాటు ఎక్స్పెరిమెంట్స్కు ఆయన ముందుంటారు. ఈ క్రమంలోనే ఆయన కంగువా చేస్తున్నారు. ఈ మూవీకి శివ దర్శకత్వం వహిస్తుండగా.. దిశాపటానీ హీరోయిన్గా నటిస్తున్నారు, రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక మరో సినిమా తంగలాన్. విలక్షణ నటుడిగా, ప్రయోగాలకు మారు పేరుగా నిలిచే చియాన్ విక్రమ్ కూడా హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. ఈసారి మాత్రం ఎట్టి పరిస్ధితుల్లో ఓ బ్లాక్బస్టర్ని తన ఖాతాలో వేసుకుని కసిగా ముందుకెళ్తున్నాడు. అదే తంగలాన్. పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. విక్రమ్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తుండగా.. డేనియల్ విలన్గా యాక్ట్ చేస్తున్నారు.

అయితే తంగలాన్, కంగువాలకు ఇప్పుడు కొత్త చిక్కొచ్చిపడింది. మద్రాస్ హైకోర్టు ఈ రెండు సినిమాలకు గట్టి షాకిచ్చింది.. ఈ మూవీస్ విడుదల కావాలంటే రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన కేఈ జ్ఞాన్వేల్ వ్యాపారవేత్త అయిన అర్జున్ లాల్ సుందర్ దాస్ నుంచి రూ.12.85 కోట్లు రుణం తీసుకున్నారు. ఓ సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడంతో రూ.2.5 కోట్లు మాత్రమే చెల్లించారని.. మిగిలిన రూ.10.85 కోట్లు మాత్రం బకాయి పడ్డారు. అర్జున్ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులు జ్ఞాన్వేల్పై హైకోర్టులో కేసు వేశారు.
దీనిపై స్పందించిన జ్ఞాన్వేల్ రాజా .. అర్జున్ లాల్ గతంలో తాను నిర్మించిన మూడు తమిళ సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులకు గాను రూ.12.85 కోట్లను ఇచ్చారని.. అంతే తప్పించి ఎలాంటి డబ్బు ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఒక జిరాక్స్ను మాత్రమే కోర్టుకు సమర్పించారని.. 2015 వరదల్లో ఒరిజినల్ రికార్డు ధ్వంసమైందని తెలిపారు. అయితే స్టూడియో గ్రీన్ కార్యాలయం అప్పట్పలో రెండవ అంతస్తులో ఉందని, ఆ కార్యాలయానికి సంబంధించిన ఫైళ్లు వరదలో నాశనం కాలేదని తేలింది.
దీంతో జ్ఞాన్వేల్ రాజా బకాయి ఉన్న రూ.10.25 కోట్లను రూ.18 శాతం వార్షిక వడ్డీతో తమకు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని అర్జున్ కుటుంబం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది. ఈ పిటిషన్ను సోమవారం జస్టిస్ జీ జయచంద్రన్, సీవీ కార్తీకేయన్లతో కూడిన డివిజన్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. అర్జున్ కుటుంబసభ్యుల తరపు న్యాయవాది చేసిన వాదనలతో ఏకీభవించిన కోర్ట్.. తంగలాన్ చిత్రం విడుదలకు ముందు రూ.కోటిని కోర్టులో డిపాజిట్ చేయాలని.. అలాగే కంగువ చిత్ర విడుదలకు ముందు కూడా మరో రూ.కోటి డిపాజిట్ చేయాలని ఆదేశించింది.


Click it and Unblock the Notifications











