విజయ్ ర్యాలీలో 33 మంది మృతి.. ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, రజనీకాంత్, కమల్ దిగ్రాంతి
తమిళనాడులోని కరూర్లో సినీ నటుడు, తమిళగ వెట్రీ కజగం (TVK) అధినేత దళపతి విజయ్ నిర్వహించిన ర్యాలీలో తీవ్ర విషాదం నెలకొన్నది. ఈ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో కడపటి సమాచారం అందేసరికి 33 మంది మరణించినట్టు సమాచారం. అధికారికంగా తమిళనాడు ప్రభుత్వం ధృవీకరించాల్సి ఉంది. అయితే దుర్ఘటన పట్ల ప్రధాని నరేంద్రమోదీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ సంతాపం తెలియజేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
కరూర్లో నిర్వహించే ర్యాలీకి విజయ్ సుమారుగా 3 గంటలకుపైగా ఆలస్యంగా వచ్చారు. ఆయన ర్యాలీలో ప్రసంగించే సభ వద్దకు రాగానే ఆయనను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు దూసుకొచ్చారు. దాంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆయన ప్రసంగిస్తూ.. పరిస్థితిని గమనించి పోలీసులను కట్టడి చేయాలని ఆందోళన కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది. కానీ పరిస్థితి చేజారి పోవడం.. జనం మధ్య తొక్కిసలాట చోటు చేసుకోవడంతో చాలా మంది స్పృహ కోల్పోయారు. 16 మంది మహిళలు, 6 గురు పిల్లలు, 9 మంది పురుషులు మరణించారని ప్రాథమిక సమాచారం. మరికొంత మంది తీవ్రంగా గాయపడటంతో వారిని హాస్పిటల్కు తరలించారు. అయితే గాయపడిన వారికి సరైన సహాయం అందించాలని పోలీసులను విజయ్ అభ్యర్థించడం కనిపించింది. అయితే మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తున్నది.

విజయ్ ర్యాలీలో జరిగిన దుర్ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. కరూర్ విషాద సంఘటన దురదృష్టకరం. ఈ వార్త తెలియగానే దిగ్బ్రాంతికి గురయ్యాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఇలాంటి విషాద సమయంలో వారికి మనోస్థైర్యం అందించాలి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని మోడీ ట్విట్టర్లో సంతాపం వ్యక్తం చేశారు.
కరూర్ ర్యాలీలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరం
తమిళనాడు రాష్ట్రం కరూర్ లో నటుడు, టివికే పార్టీ అధ్యక్షులు శ్రీ విజయ్ చేపట్టిన ర్యాలీలో తొక్కిసలాట దురదృష్టకరం. ప్రాథమిక సమాచారం మేరకు ఈ దుర్ఘటనలో 33 మంది మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉండటం ఆవేదన కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో వేడుకొన్నాడు.
కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన వార్త నా గుండెను బరువెక్కించింది. తీవ్రమైన విషాదంలో మునిగిపోయాను. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అని రజనీకాంత్ ట్వీట్ చేశారు.
కరూర్ తొక్కిసలాట దుర్ఘటన వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ విషాద వార్తతో నా మనసు మూగబోయింది. అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే వార్త నన్ను తీవ్రంగా బాధించింది. బాధితులకు సరైన,మెరుగైన చికిత్స అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి మనవి చేసుకొంటున్నాను. బాధితులకు ప్రభుత్వం అండగా నిలువాలని కోరుతున్నాను అని కమల్ హాసన్ సంతాపంలో తెలిపారు.
ఈ దుర్ఘటన జరిగిన సమాచారం తెలియగానే.. తమిళనాడు ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రి ఎం సుబ్రమణియన్ హుటాహుటిన కరూర్కు వెళ్లారు. ఈ ఘటనపై కరూర్ జిల్లా కలెక్టర్ వీ సెంథిల్ బాలాజీని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల కోసం ఫిల్మీబీట్ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











