అవి కారణాలు కావు : విక్రమ్
చెన్నై : వరస ప్లాపులు వచ్చినా విక్రమ్ కి ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఈ జాతీయ ఉత్తమనటుడు చిత్రం అంటే వైవిద్యం అనే పేరు రావటంతో కొద్దిగా తేడా వచ్చినా ఆయన సినిమాలు రిజెక్టు చేసేస్తున్నారు. ఇప్పటికీ విక్రమ్ ఎన్ని సినిమాలు చేసినా ప్రేక్షకులు ఆయన్నుంచి 'అపరిచితుడు', 'పితామగన్' వంటి పాత్రల్నే ఎదురు చూస్తున్నారని చెప్పాలి. విక్రమ్ కూడా అందుకు తగ్గట్టు వైవిధ్యం దిశగా పయనిస్తున్నాడు. అయితే ఇటీవల ఆయన వేస్తున్న అడుగులన్నీ పరాజయం వద్దే ఆగుతున్నాయి. ప్రతి చిత్రానికీ కనీసం ఏడాది నుంచి రెండేళ్ల పాటు నిరీక్షిస్తున్నాడు. అదంతా మంచి పాత్రలు రావాలనే ఉద్దేశంతోనే అంటున్నాడు విక్రమ్.
ఈ విషయమై విక్రమ్ మాట్లాడుతూ.... తమిళంలో చాలా అవకాశాలు వస్తున్నాయి. అన్నింటిలోనూ నటించాలనే ఉద్దేశం లేదు. వైవిధ్యంగా అనిపిస్తేనే అంగీకరిస్తా. 'రావణన్'తో హిందీ పరిశ్రమలో గుర్తింపు వచ్చింది. అక్కడ్నుంచి కూడా నటించమని అడుగుతున్నారు. అలాంటిదే 'డేవిడ్' కూడా. బాలీవుడ్ చాలా పెద్దది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను సొంతం చేసుకున్న పరిశ్రమ. నేను హిందీలో నటించేందుకు.. ఇవి కారణాలు కావు. 'డేవిడ్'లో ఎప్పుడూ పోషించని పాత్ర కనిపించింది. అందుకే పచ్చజెండా ఉపా. పూర్తిస్థాయిలో నా నటన పండాలని సినిమాకి ఏడాది, రెండేళ్లపాటు కాల్షీట్ ఇస్తా. అదంతా అభిమానులు, ప్రేక్షకుల కోసమేనని చెప్పాడు.
ప్రస్తుతం విక్రమ్...ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్నారు. ఆస్కార్ రవిచంద్రన్ అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న ఐ చిత్రం ఒలింపిక్ క్రీడల నేపథ్యంలో సాగుతుందనే సమాచారం. ఈ నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకుని శంకర్ ఐ చిత్రాన్ని ఓ రేంజిలో తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఒక సాధారణ యువకుడైన విక్రమ్ ఒలింపిక్లో బంగారు పతకం ఎలా సాధించారనేది ఐ చిత్ర కథ అని వినపడుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎమిజాక్సన్ హీరోయిన్గా నటిస్తున్నారు. విక్రమ్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'అపరిచితుడు' విడుదలై ఇప్పటికి దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది. చాలా విరామం తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా కాబట్టి 'ఐ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేస్తారు. త్రీ ఇడియట్స్ రీమేక్ చేసిన శంకర్ ఆ చిత్రం వర్కవుట్ కాకపోవటంతో ఈ సారి మళ్లీ తన రూట్ లోకే వెళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీగా రూపొందే ఈ చిత్రం ఇప్పటివరకూ ఇండియన్ తెరపై ఎవరూ టచ్ చేయని సబ్జెక్టుతో నిండి ఉంటుందని చెప్తున్నారు. యాక్షన్,ఎంటర్టైనర్ తో మాస్ మసాలాగా ఉంటూనే సామాజిక సందేశంతో తయారు చేసిన ఈ స్క్రిప్టు దక్షిణాది భాషలకే కాక హిందీ వారిని సైతం అలరించేలా ప్లాన్ చేస్తున్నారు. సంగీతం: ఏఆర్ రెహమాన్. ఛాయాగ్రహణం: పి.సి.శ్రీరాం.


Click it and Unblock the Notifications











