సినీ ఎన్నికల్లో ఉద్రిక్తత: విశాల్ను చంపేస్తామంటూ...
హైదరాబాద్: తమిళ సినీ నటుల అసోసియేషన్ ‘నడిగర్ సంఘం' ఎన్నికలు ఈ నెల 18న జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల నేపథ్యంలో నటీనటులంతా రెండు వర్గాలుగా విడిపోయారు. ప్రస్తుత అధ్యక్షుడు, ఎమ్మెల్యే శరత్ కుమార్ నేపత్వంలో ఓ వర్గం...... నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ ప్రధాన కార్యదర్శికి నిలబెట్టి మరో వర్గం ఈ ఎన్నికల్లో హోరా హోరీగా తలపడుతున్నాయి.
ఇప్పటికే ఇరువర్గాలు విమర్శలు, ప్రతి విమర్శలతో నడిగర్ సంఘం ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కించారు. తాజాగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. విశాల్ ను హతమారుస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆయన మేనేజర్ మురుగరాజ్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. బెదిరింపులు వచ్చిన ఫోన్ నంబర్ల వివరాలను పోలీసులకు అందించారు. విశాల్ ఇల్లు, కార్యాలయం వద్ద భద్రత పెంచారు. ఇటీవల జరిగిన ఎగ్జిట్ పోల్స్లో నాజర్-విశాల్ నేతృత్వంలోని వర్గానికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తేలిసింది.
ఒకరిపై ఒకరు కేసులు...
ఇటీవల శరత్ కుమార్ విశాల్ మీద పరువు నష్టం దావా వేసారు. ఎన్నికల తేదీ వెలువడిన నాటి నుంచి విశాల్ తనపై అవినీతి, అక్రమాలు అంటూ అనేక ఆరోపణలలో పరువునష్టం కలిగించాడని ఆరోపిస్తూ శరత్కుమార్ శుక్రవారం ఎగ్మూరు కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ సమాచారం అందుకున్న విశాల్ తీవ్రంగా స్పందిస్తూ తాను కూడా త్వరలో శరత్కుమార్పై కేసును పెడతానని ప్రకటించారు.

వ్యక్తిగత విమర్శలు...
ఇరువర్గాల మధ్య విమర్శలు సాధారణ స్థాయి నుండి వ్యక్తి గత విమర్శలు చేసుకునే వరకు వెళ్లడంతో ఎన్నికల ప్రచారం ఉద్రిక్తతకు దారితీస్తోంది. విశాల్ వర్గానికి మద్దతు ఇస్తుండటంతో కమల్ హాసన్ పై ఇటీవల శరత్ కుమార్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. చేసిన మేలును మరచిన కృతఘ్నుడని శరత్ కుమార్ కమల్ హాసన్ ను దుయ్యబట్టారు. ఆయన నటించిన 'విశ్వరూపం' విడుదల సమయంలో సమస్యలు వస్తే, తాను దగ్గరుండి సాయం చేశానని గుర్తు చేసిన ఆయన, 'ఉత్తమ విలన్' విడుదల సమయంలో తన భార్య రాధిక ఆయనకు ఎంతో అండగా నిలిచిందని తెలిపారు. తనకు తమిళనాట 'నడిగర సంఘం' నుంచి ఎలాంటి సాయమూ అందలేదని కమల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తమతో పోటీలో ఉన్న జట్టుకు మద్దతిచ్చేలా కమల్ మాట్లాడారని, ఇది కృతజ్ఞతా హీనమని అన్నారు.
రెండు రోజుల క్రితం శరత్ కుమార్ వర్గం తరఫున ఎన్నికల్లో నిలిచిన యువ కథానాయకుడు శింబు విశాల్ మీద తనదైన శైలిలో తీవ్ర విమర్శలు గుప్పించాడు. తమిళ నటుల్లో చీలికలు తెచ్చేందుకు విశాల్ ప్రయత్నాలు చేస్తున్నాడని దుయ్యబట్టాడు. నిన్నకాక మొన్న వచ్చిన బచ్చా విశాల్ అని.. శరత్ కుమార్ లాంటి సీనియర్ని విమర్శించడానికి అతడికి అర్హత లేదన్నాడు. నడిగర్ సంఘం విషయంలో ఇబ్బందులేమైనా ఉంటే చర్చించుకోవాలని.. అలా కాకుండా వీధిలో పడి గొడవ చేయడం విశాల్ నీచమైన బుద్ధికి నిదర్శనమని శింబు వ్యాఖ్యానించాడు.
తమ వర్గానికి చెందిన సీనియర్ నటుడు రాధా రవి విశాల్ను ''కుక్క'' అనడం తప్పేనని.. అయితే విశాల్ నిజానికి ''నక్క''లాగా విశాల్ కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడని శింబు ధ్వజమెత్తాడు. కాగా, ఇటీవల ఓ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ నిర్వహించిన సర్వేలో విశాల్ జట్టు 64 శాతం ఓట్లతో విజయం సాధించవచ్చని వెల్లడి కావడం గమనార్హం.
సామరస్య ధోరణిలో రాజీకి సిద్ధమంటూ శరత్కుమార్ జట్టు చేసిన ప్రకటనను విశాల్ జట్టు స్వీకరించలేదు. పోటీకి వెళ్లడం ఖాయమని తేల్చేశారు. రాజకీయ ఎన్నికలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఒకే కుటుంబంలోని సభ్యులు రెండు జట్లుగా విడిపోయారు. రెండు రోజుల క్రితం శరత్కుమార్ జట్టు నిర్వహించిన మీడియా సమావేశంలో నటుడు భాగ్యరాజ్ పాల్గొనగా, ఆయన కుమారుడు శంతను.. విశాల్ జట్టుకు చేరాడు. అలాగే దివంగత విలక్షణ నటుడు ఎస్ఎస్ రాజేంద్రన్ కుమారులు రాజేంద్రకుమార్, కలైవాసన్ శుక్రవారం సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలోనే సవాళ్లు విసురుకున్నారు.


Click it and Unblock the Notifications











