కమల్ హాసన్ ‘విశ్వరూపం’వివాదం... సీఎం వద్దకు!
చెన్నై: కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'విశ్వరూపం'. ఎన్నో అంచనాలతో కమల్ రూపొందించిన ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో డిస్ట్రిబ్యూషన్ మార్కెట్ కాక పోవడంతో...కమల్ హాసన్ సరికొత్త ఆలోచనతో రంగంలోకి దిగారు. దీంతో సినిమా కాస్త వివాదంలో ఇరుక్కుంది. వివాదం చివరకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వద్ద తేల్చుకునే దిశగా సాగుతోంది.
వివరాల్లోకి వెళితే..
డిస్ట్రిబ్యూషన్ ద్వారా తన ఆశించిన డబ్బులు రాక పోవడంతో కమల్ హాసన్ కొన్ని రోజులుగా సినిమా విడుదల వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సరికొత్త ఆలోచన చేసిన ఆయన ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్లకు అమ్మడంతో పాటు.... ఓ ప్రముఖ డిటిహెచ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని నేరుగా టీవీల్లో కూడా సినిమాను విడుదల చేయాలని, తద్వారా తను అనుకున్న మొత్తం రాబాట్టాలని ప్లాన్ చేసారు.
అయితే కమల్ హాసన్ నిర్ణయంపై తమిళనాడు థియేటర్ల యజమానులు ఆగ్రహంగా ఉన్నారు. దీని వల్ల తాము నష్టాల పాలవుతామని, థియేటర్లతో పాటు టీవీల్లో సినిమాను ఒకేసారి విడుదల చేస్తే..... థియేటర్లకు వచ్చి సిసిమా చూసే వారు ఉండరని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే కమల్ హాసన్ వాదన వేరేలా ఉంది. టీవీల్లో విడుదల చేయడం వల్ల అది ఓ ట్రైలర్లా పని చేస్తుందని.... సినిమాను పెద్ద తెరపై థియేటర్లో చూసేలా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుందని వాదిస్తున్నారు. అయతే కమల్ వాదనతో థియేటర్ల యజమానులు ఏకీభవించడం లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వద్ద విషయం పరిష్కరించుకునే థియేటర్ల ఓనర్ల సంఘం ప్రయత్నిస్తోంది.


Click it and Unblock the Notifications












