'విశ్వరూపం' చూసిన హైకోర్టు జడ్జి... విచారణ
చెన్నై: పలు వివాదాల్లో చిక్కుకొని తమిళనాడులో విడుదలకు నోచుకోని 'విశ్వరూపం' చిత్రాన్ని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి చూసారు. శనివారం మధ్యాహ్నం చెన్నై నగరంలోని వడపళని ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేటు ల్యాబ్లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి జస్టిస్ వెంకట్రామన్, తమిళనాడు ప్రభుత్వ న్యాయవాది నవనీతకృష్ణన్, కమల్ హాసన్ తరఫు న్యాయవాది పీఎస్ రామన్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముస్లిమ్ సంఘాల ప్రతినిధులతోపాటు పలువురు వీక్షించారు. సినిమా చూసిన తర్వాత న్యాయమూర్తి ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించలేదు. 28న మద్రాసు హైకోర్టులో ఈ అంశం విచారణకు రానుంది.
విశ్వరూపం చిత్ర కథానాయకుడు, దర్శకుడు కమల్ హాసన్కి మద్దతుగా ప్రముఖ నటుడు రజనీకాంత్ స్పందించిన సంగతి విదితమే. ఇప్పుడు రజనీ బాటలోనే మరి కొందరు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. నటులు అజిత్, పార్తిబన్, దర్శకులు భారతిరాజా, అమీర్ తదితరులు కమల్కు మద్దతుగా ప్రకటనలు జారీ చేశారు.
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ''విశ్వరూపం చూశాను. ఈ సినిమా ఎందుకు వివాదాస్పదం అయిందో నా అనుభవంలో నాకు అర్థం కాలేదు. ఇందులో ఏ మతాన్నిగానీ, వర్గాన్నిగానీ కించపరిచే సంఘటనలు, సంభాషణలు లేవు'' అన్నారాయన. 'విశ్వరూపం' చిత్ర ప్రదర్శనపై మలేసియా దేశంలోనూ నిషేధం విధించారు. తమిళ భాషలోని సినిమా ఆ దేశంలో శుక్రవారం విడుదలైంది. అయితే ఆ దేశ హోమ్ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ప్రదర్శనలు నిలిపి వేశారు.


Click it and Unblock the Notifications











