డబుల్ గేమ్ లో మీడియా కెమరాలకు చిక్కిపోయిన సూపర్ స్టార్...!
అటు కరుణానిధితోనూ, ఇటు జయలలితతోనూ ఎలక్షన్ల టైం లో సమాన దూరాన్ని పాటించే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు చిక్కుల్లో పడిపోయారు. బుధవారం నాడు జరిగిన ఎన్నికలలో రెండాకుల గుర్తుకి (జయలలిత పార్టీ అన్నా డి.ఎం.కె. గుర్తు) ఒటేస్తూ, మీడియా కెమెరాలకు దొరికిపోయిన రజనీ ఇప్పుడు ఆ వివాదంలోంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తున్నాడు. ఎలక్ట్రానిక్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించి, రజనీ ఓటేస్తున్న వైనాన్ని కెమెరాలలో బంధించాయి. ఆ విజువల్స్ ను టీవీ చానల్స్ తెగ చూపించాయి. దానికి తోడు కరుణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజనీ వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వచ్చాయి. దాంతో కరుణానిధి రజనీ పట్ల అలిగారని తెలిసింది.
ఈ నేపథ్యంలో కరుణానిధి కథ సమకూర్చిన 'పొన్నార్ శంకర్" చిత్రం ప్రీమియర్ షో నిన్న జరిగింది. దీనికి విచ్చేసిన కరుణకు రజనీ ఈ విషయంపై వివరణ ఇస్తూ, తను ఓటింగ్ చేసిన వైనాన్ని మీడియా వక్రీకరించి చూపిందని చెప్పారట. అయితే కరుణ మాత్రం అంతా విని, ఏమీ మాట్లాడలేదని తెలిసింది. కరుణ తనయుడు స్టాలిన్, మనవడు దయానిధి మారన్ లు కూడా రజనీతో అంటీముట్టనట్టుగా వ్యవహరించారట. ఏమైనా, ఇన్నాళ్ళూ రాజకీయాల్లో అందరికంటే తాను రెండాకులు ఎక్కువే చదివానని రజనీ ఫీలయ్యేవాడనీ, ఇప్పుడు ఆ 'రెండాకుల" మధ్యే నలిగిపోయాడనీ అంటున్నారు!


Click it and Unblock the Notifications











