తెలివి చూపిస్తున్నారా.. జాగ్రత్త, విశాల్పై కోర్టు ఆగ్రహం.. లైకాతో అసలు వివాదమేంటీ..?
అచ్చ తెలుగు కుర్రాడైన విశాల్.. కోలీవుడ్ అగ్ర నటుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. విషయం ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడటం ఆయన స్టైల్. ఈ క్రమంలో ఆయన కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు కూడా. సినిమాలకు మించి కాంట్రవర్సీలు, ఎవరికీ తలవంచని తత్వమే విశాల్ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. తెలుగువాడైన విశాల్.. తమిళనాట జయకేతనం ఎగురవేస్తూ ఉండటం కొంతమంది స్థానికులకు కంటగింపుగా మారింది. ఆయనను అడ్డుకోవాలని పలుమార్లు ప్రయత్నించి విఫలమయ్యారు.
విశాల్ మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ముందడుగు వేశారు. దక్షిణ భారత చలన చిత్ర నటీనటుల అసోసియేషన్ (నడిగర్ సంఘం)లో చోటు చేసుకున్న లొసుగులను ఎత్తి చూపుతూ.. విశాల్ ఆయన వర్గీయులు పోటీ చేసి విజయం సాధించారు. ఆ సమయంలో విశాల్ చేసిన విమర్శలతో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తట్టుకోలేకపోయింది. ఈ పరిణామాలతో విశాల్ను కౌన్సిల్ నుంచి బహిష్కరించింది. అయినప్పటికీ 2017లో జరిగిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేసి ప్రెసిడెంట్గా విజయం సాధించారు.

కానీ విశాల్ను పలువురు కోలీవుడ్ సినీ పెద్దలు టార్గెట్ చేస్తూనే ఉన్నారన్న అపవాదు ఉంది. తనతో కలిసి పనిచేసే వారు ఖచ్చితంగా నిర్మాతల మండలి అనుమతి తీసుకోవాలంటూ పలు కండీషన్లు పెట్టడంపై విశాల్ కొద్దిరోజుల క్రితం ఫైర్ అయ్యారు. తనను సినిమాలు చేయకుండా ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. ఒకవేళ తనను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే నిర్మాతలమని చెప్పుకునే కొందరు ఎప్పటికీ సినిమాలు తీయలేరని విశాల్ వార్నింగ్ ఇచ్చారు.
ఇదే సమయంలో విశాల్కు , ప్రముఖ నిర్మాణ సంస్థ లైకాకు మధ్య ఓ వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఇది న్యాయస్థానం వరకు వెళ్లింది. ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా విశాల్కు మద్రాస్ హైకోర్ట్ చురకలంటించింది. లైకాతో ఒప్పందం గురించి తనకు తెలియదని, కేవలం తాను ఓ వైట్ పేపర్పై సంతకం చేశానని చెప్పడంతో .. న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీ పేపర్పై సంతకం చేశారా.. తెలివిని ప్రదర్శిస్తున్నారా, ఇదేమీ సినిమా షూటింగ్ కాదని .. జాగ్రత్తగా సమాధానాలు చెప్పాలని ఆదేశించారు. విశాల్ ఆన్సర్ ఇవ్వకుండా మౌనంగా ఉండటంతో ఔను అనో, కాదనో చెప్పాలని న్యాయమూర్తి మరోసారి అసహనం వ్యక్తం చేశారు. దీంతో తాను లైకా వద్ద రుణం తీసుకున్నట్లు అంగీకరించగా.. విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు.
అసలు వివాదంలోకి వెళితే.. లైకా ప్రొడక్షన్స్- విశాల్ మధ్య పందెం కోడి 2కి సంబంధించి డబ్బు విషయంలో విభేదాలు చోటు చేసుకున్నాయి. సినిమా తీస్తానని తమ వద్ద విశాల్ రూ.21.29 కోట్లు అప్పుగా తీసుకున్నారని.. బాకీ తీర్చాలని ఎన్నిసార్లు అడిగినా చెల్లించలేదని ఆరోపిస్తూ 2022లో లైకా అధినేత మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం లైకా ప్రొడక్షన్స్కు రూ.15 కోట్లు చెల్లించాలని, తన ఆస్తి వివరాలు సమర్పించాలని.. అప్పటి వరకు నటించిన సినిమాలు ఏ ఫ్లాట్ఫాంలోనూ విడుదల చేయకూడదని విశాల్కు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించారని తమకు డిపాజిట్ చేయకుండానే సినిమాలు రిలీజ్ చేస్తున్నారని కోర్టు ధిక్కరణ పిటిషన్ ఫైల్ చేసింది. అయితే దీనికి సంబంధించిన ఆధారాలను లైకా యాజమాన్యం సమర్పించలేకపోయింది. నాటి నుంచి విచారణ వాయిదా పడుతూ, తిరిగి జరుగుతూ వస్తోంది.


Click it and Unblock the Notifications











