ఆమెను నమ్మితే నిండా ముంచేసింది.. ఆ దెబ్బకు జీవితం మారిపోయింది..
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న నటుడు ప్రసాద్ బెహరా (Prasad Behara). ఒక్క లైన్ పంచ్ డైలాగ్స్తో నవ్వులు పూయించే ప్రసాద్... తన ప్రత్యేక కామెడీ టైమింగ్తో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. 'కమిటీ కుర్రోళ్ళు' సినిమాతో వెండితెరపై కూడా తన సత్తా చాటిన ఆయన, ఎక్కడ కనిపించినా ఎంటర్టైన్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. ప్రస్తుతం ఆయన 'పాపం ప్రతాప్' అనే కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రసాద్కు సంబంధించిన ఓ పాత ఇంటర్వ్యూ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆయన తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒక షాకింగ్ ఘటనను బయటపెట్టారు. ఇంతకీ ఏం జరిగిందంటే?
నటుడు ప్రసాద్ బెహరా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాలను బయటపెట్టి అందరినీ షాక్కు గురి చేశారు. సాధారణంగా తన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్స్తో నవ్వించే ప్రసాద్... ఈసారి మాత్రం తన జీవితంలోని నమ్మక ద్రోహాల గురించి మాట్లాడి ఎమోషనల్ అయ్యారు. విడాకుల తర్వాత తీవ్ర ఒంటరితనాన్ని ఎదుర్కొన్న రోజుల గురించి ఆయన వెల్లడించారు. ఆ సమయంలో తన జీవితంలోకి వచ్చిన ఒక పనిమనిషిని కుటుంబ సభ్యురాలిలా చూసుకున్నానని తెలిపారు. ఆమె అడిగింది రూ.3,000 జీతం అయినా, తాను రూ.6,000 ఇచ్చానని, అంతేకాకుండా ప్రతి వారం మటన్, సినిమా టికెట్లు, నెలవారీ సరుకులు వంటి అవసరాలన్నీ తానే చూసుకున్నానని చెప్పారు.

'ఆమెను పనిమనిషిగా కాకుండా అక్కలా భావించాను' అని చెప్పిన ప్రసాద్... ఆమెతో మాట్లాడటం ద్వారా తన ఒంటరితనాన్ని తగ్గించుకున్నానని గుర్తుచేసుకున్నారు. అయితే ఈ విశ్వాసానికి ప్రతిఫలం మాత్రం తీవ్ర నిరాశగా మారిందని ఆయన అన్నారు. తన ఇంట్లో ఉన్న ఖరీదైన గడియారాలు ఒక్కొక్కటిగా మాయం కావడం మొదలైందని, చివరకు సుమారు రూ.90,000 విలువైన యాపిల్ వాచ్ కూడా కనిపించకుండా పోయిందని తెలిపారు. ఒకరోజు సెక్యూరిటీ బజర్ మోగడంతో ఆ పనిమనిషి దగ్గరే ఆ వాచ్ ఉండటం బయటపడిందని వెల్లడించారు. దాదాపు లక్షన్నర విలువైన వాచీలు పోయాయని చెప్పిన ప్రసాద్.. ఆమె ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా మాట్లాడటం తనను మరింత బాధపెట్టిందని అన్నారు.
ఈ ఘటన తర్వాత ఆమె కుటుంబ సభ్యులు క్షమాపణలు కోరినా, తాను తిరిగి ఆమెను పనిలోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. "నేను నమ్మిన వాళ్లే ఇలా మోసం చేయడం.. నాలో మనుషుల మీద ఉన్న నమ్మకాన్ని పూర్తిగా కూల్చేసింది" అంటూ తన మనస్థితిని వివరించారు. ఇదే కాకుండా తన మాజీ భాగస్వామితో జరిగిన మరో సంఘటన కూడా తనను మార్చేసిందని ప్రసాద్ తెలిపారు. ఒకసారి తన దగ్గర కేవలం రూ.250 మాత్రమే ఉన్న సమయంలో, ఆమె కోసం రూ.180తో నూడిల్స్ కొనిచ్చానని... కానీ ఆమె అవి తినకుండా పారేసి, డబ్బులు అడిగిన సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని గుర్తుచేసుకున్నారు. "ఆ రోజు నాకు నిజంగా మనుషుల విలువ అర్థమైంది" అని అన్నారు.
ఈ అనుభవాలన్నీ కలిసి తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా మార్చేశాయని ప్రసాద్ వెల్లడించారు. 'ఇప్పుడు ఎవరైనా ప్రేమగా మాట్లాడినా నమ్మలేను... ఎవరైనా ఏదైనా తీసుకువస్తే కూడా సందేహమే వస్తుంది' అంటూ ఎమోషనల్ అయ్యారు. డబ్బు విషయంలో కూడా తన దృక్పథం మారిందని ఆయన పేర్కొన్నారు. 'ఇప్పుడున్నదాన్ని ఆస్వాదిస్తాను... పొదుపు కన్నా జీవితం ఎంజాయ్ చేయడమే ముఖ్యం' అని చెబుతూ, ఇన్సూరెన్స్ మినహా మిగతా డబ్బును తనకు నచ్చిన విధంగా ఖర్చు చేస్తున్నానని తెలిపారు. లగ్జరీలపై ఆసక్తి లేకపోయినా, అవసరమైన వాటిని నిరభ్యంతరంగా ఖర్చు చేస్తానని చెప్పారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications



