ఎమ్మెల్యేను, ఎంపీని ప్రశ్నించగలరా? రైతుబిడ్డను నిలదీస్తారా? హీరో శివాజీ ఫైర్
బిగ్బాస్ తెలుగు 7 విజేత పల్లవి ప్రశాంత్పై సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న నెటిజన్లపై నటుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ శివాజీ ఘాటుగా స్పందించారు. రైతులను ఆదుకొంటానని చెప్పి మాట తప్పాడు అంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోలర్స్పై నిప్పులు చెరిగారు. రైతు బిడ్డను టార్గెట్ చేస్తూ ప్రతాపం చూపిస్తున్నారని మండిపడ్డారు. పల్లవి ప్రశాంత్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న శివాజీ మాట్లాడుతూ..
రైతుల గోసను, కష్టాలకు అండగా నిలబడి పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ కలను నెరవేర్చుకొన్నాడు. బిగ్బాస్ ఇంటిలో గాయాలను లెక్క చేయకుండా, కంటెస్టెంట్ల నుంచి మానసికంగా దాడిని తప్పించుకొని ధైర్యంగా నిలబడ్డాడు. అలాంటి రైతు బిడ్డను సోషల్ మీడియాలో అది చేయలేదు. ఇది చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు ప్రశాంత్ గురించి మీకు తెలుసా? అతడు చేసే పనులు గురించి తెలియకుండా ఎలా ప్రశ్నిస్తారు అని శివాజీ ఫైర్ అయ్యాడు.

ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయిని పట్టుకొని ప్రశ్నిస్తున్నారు. అదే మీకు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి.. వాటిని నెరవర్చని రాజకీయ నేతలను ప్రశ్నించగలరా? ఎన్నికల సమయంలో ఎన్నో చేస్తామని ఆశ చూపి తప్పించే వారిని నిలదీయగలరా? ఓ రైతు బిడ్డను టార్గెట్ చేస్తూ మీరు చేసే పని బాగాలేదు అని శివాజీ అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
పల్లవి ప్రశాంత్ గ్రామంలో పిల్లల కోసం చేపట్టిన వెల్ఫేర్ కార్యక్రమాన్ని శివాజీ ప్రశంసించారు. ప్రశాంత్ చేసే ప్రతీ పని ముందుగా నాకు చెబుతాడు. తనకు ఎంతో చేయాలని ఉంది. కానీ బిగ్ బాస్ నుంచి రావాల్సిన డబ్బులు అందకపోవడం వల్ల తాను అనుకొన్న పనులు, చేయాల్సిన పనులు చేయలేకపోతున్నాడు అని శివాజీ చెప్పారు.

బిగ్బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొన్న వెంటనే డబ్బులు ఇవ్వరు. విడుతల వారీగా వాళ్లు రెమ్యునరేషన్ ఇస్తుంటారు. నాలుగు నెలలు ప్రశాంత్ ఎలాంటి పనిచేయకుండా, ఎలాంటి ఆదాయం లేకుండా బిగ్బాస్లో ఉన్నాడు. వాడికి ఆర్థిక అవసరాలు, కుటుంబ బాధ్యతలు ఉంటాయి. అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకే పూర్తిగా డబ్బులు వచ్చిన తర్వాత తాను ఇచ్చిన హామీలు నెరవేరుస్తాడు అని శివాజీ చెప్పాడు.


Click it and Unblock the Notifications











