అంబానీ ఫ్యామిలీని పోషించేది నేనే.. నన్ను పెళ్లికి పిలవరా.. మాజీ సీఎం మనవరాలు సంచలన వ్యాఖ్యలు
కెరీర్ తొలినాళ్లలో సీరియల్స్లో నటించి సినిమాల్లో అవకాశాలు అందుకుని స్టార్లుగా వెలుగొందిన వారెందరో. ఈ ట్రెండ్ నేటికీ కొనసాగుతూనే ఉంది. అలా బుల్లితెరను వీక్షించే వారికి పరిచయం అక్కర్లేని పేరు జ్యోతిరెడ్డి. ఎన్నో సీరియల్స్లో విభిన్న పాత్రలు పోషించి ఆడియన్స్కు దగ్గరైంది. ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లలో నటించి జ్యోతి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు మూడు దశాబ్ధాలకు పైగా నటిగా రాణిస్తూ అలరిస్తున్నారు.
అయితే జ్యోతి చాలా పెద్ద కుటుంబం నుంచి వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భవనం వెంకట్రామిరెడ్డికి స్వయానా ఆమె మనవరాలు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను చదువులో గోల్డ్ మెడలిస్ట్ అని.. తన కుటుంబమంటే తనకు ఎంతో ఇష్టమని జ్యోతి పేర్కొన్నారు. అది ఎంతలా అంటే తల్లిదండ్రులు.. భర్త, పిల్లల పేర్లను చేతిపై పచ్చబొట్లు వేయించుకున్నారు. డిగ్రీ, ఎంఏ, ఎంఫిల్ పట్టాలు పొందిన జ్యోతిరెడ్డి.. వరుసగా మూడుసార్లు గోల్డ్ మెడల్ సాధించారు.

ఉన్నత విద్యావంతురాలు కావడంతో జ్యోతిరెడ్డి ఉద్యోగం చేయాలని అనుకున్నారట. కానీ కొందరు డైరెక్టర్లు తమ సినిమాల్లో నటించాల్సిందిగా వారి పీఏలను ఇంటికి పంపించేవారని.. కానీ తనకు ఇష్టం ఉండేది కాదట. అయితే వాళ్ల అమ్మగారు సర్దిచెప్పడంతో జ్యోతిరెడ్డి యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చారట. షూటింగ్ స్పాట్లో ఉన్నంత వరకు నవ్వుతూ, నవ్విస్తూ అందరితో సరదాగా ఉంటానని.. ఒకసారి ఇంట్లోకి అడుగుపెట్టాక ఎవరితోనూ టచ్లో ఉండనని జ్యోతి పేర్కొన్నారు. ఎండమావులు, కార్తీక దీపం, రాధకు నీవే ప్రాణం, ప్రేమ ఎంత మధురం, మధురానగరిలో వంటి సీరియల్స్ ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి.
ఇదిలావుండగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ల వివాహం ఇటీవల బాంద్రా - కుర్లా కాంప్లెక్స్లోని జియో ఇంటర్నేషనల్ సెంటర్లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. దేశ, విదేశాలకు చెందిన సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ జనరేషన్లోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా అనంత్ అంబానీ పెళ్లిని అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఈ పెళ్లికి అక్షరాలా రూ.5 వేల కోట్లు వెచ్చించారట. వివాహానికి హాజరైన అత్యంత సన్నిహితులకు అనంత్ అంబానీ రూ.2 కోట్లు విలువైన వాచీలను బహుమతిగా ఇచ్చారు. వీటిని ధరించి బాలీవుడ్ స్టార్స్ ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఈ నేపథ్యంలో అంబానీ పెళ్లిపై కీలకవ్యాఖ్యలు చేశారు జ్యోతిరెడ్డి. ఈ గ్రాండ్ మ్యారేజీకి తనను పిలవకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు జ్యోతిరెడ్డి తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పెట్టారు. ఎవరో తనకు మెసేజ్ పెట్టారని, అందులో అంబానీ తమను పెళ్లికి పిలవలేదని మీకు కడుపు మంట అని.. కానీ నాకు అలాంటివేవి లేవు , అయితే ఆ మెసేజ్ చూశాక నాకో డౌట్ వచ్చింది. నిజానికి 2018 నుంచి నేను జియో వాడుతున్నానని, ప్రపంచం మొత్తాన్ని అంబానీ పెళ్లికి పిలిచారు కదా.. ఇన్నేళ్లుగా మనం పోషిస్తున్న జియోకి మనం చుట్టాలు కాకుండా పోయామా, ఎందుకు మనల్ని పిలవలేదు.. సరే చాలా మంది కళాకారులను వారు పోషించారు ''.
'' మీకు అందుకే కడుపు మంట అని ఎవరో మెసేజ్ పెట్టారు. అయినా ఎవరి డబ్బులతో ఎవరిని పోషించారండి, అయినా ఇన్నేళ్లగా పెండింగ్ లేకుండా జియోకి బిల్లులు చెల్లిస్తున్నానని , నాలాగా చేసేవాళ్లకి ఒక నెల జియో ఫ్రీగా ఇవ్వొచ్చు కదా .. ఎందుకు ఛార్జీలు ఈ రకంగా పెంచేశారు, ఎవరి డబ్బులు పెట్టి ఎవరిని పోషించారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ జ్యోతిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











