హీరోయిన్ రాశికి అనసూయ క్షమాపణలు.. నా నోట డబుల్ మీనింగ్ డైలాగ్స్ తప్పే అంటూ!
Anasuya Apologises to Raasi: టాలీవుడ్లో కొద్దిరోజులుగా నడుస్తున్న శివాజీ - అనసూయ వివాదం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారంలో తాజాగా హీరోయిన్ రాశి పేరు రావడంతో పరిస్థితి మరింత సీరియస్గా మారింది. చివరకు ఈ అంశంపై స్పందించిన నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్, రాశికి క్షమాపణలు చెబుతూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ నోట్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ అపాలజీ పోస్ట్ టాలీవుడ్తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఏమన్నారంటే?
వివాదం ఏంటీ?
ఇటీవల 'దండోరా' సినిమా ఈవెంట్లో టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన మాటల్లో కొన్ని పదాలు అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఆ వెంటనే శివాజీ తాను ఉపయోగించిన కొన్ని పదాల విషయంలో క్షమాపణలు చెప్పినా, వస్త్రధారణపై తన అభిప్రాయానికి మాత్రం కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఈ అంశంలోకి యాంకర్ అనసూయ రావడంతో ఆ వివాదం శివాజీ వర్సెస్ అనసూయగా మారింది. ఒక వర్గం శివాజీకి మద్దతు తెలుపగా, మరో వర్గం అనసూయకు సపోర్ట్గా నిలిచింది.

రాశి వీడియోతో మరో మలుపు
ఈ వివాదంలో 'రాశి గారి ఫలాలు' అనే పాత టీవీ షో స్కిట్ డైలాగ్ వైరల్ కావడంతో నటి రాశి స్వయంగా స్పందించారు. ఆ వీడియోపై హీరోయిన్ రాశి మాట్లాడుతూ.. 'కామెడీ చేయొచ్చు... కానీ బాడీ షేమింగ్ చేయడానికి ఎవరికీ హక్కు లేదు' అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆ స్కిట్ సమయంలో ఒక మహిళ యాంకర్ అయి ఉండి కూడా అలాంటి డైలాగ్ను ప్రశ్నించకుండా అడగడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. అవసరమైతే లీగల్ యాక్షన్ తీసుకోవాలనుకున్నానని, కానీ చివరకు శాంతియుతంగా ఈ వీడియో ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించానని రాశి చెప్పారు. ఈ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది.
అనసూయ క్షమాపణ
దీంతో అనసూయ భరద్వాజ్ తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కొన్నేళ్ల క్రితం ఒక కామెడీ షోలో భాగంగా నటి రాశి పేరుతో వచ్చిన డబుల్ మీనింగ్ డైలాగుల విషయంలో తాను చేసిన తప్పును అంగీకరిస్తూ.. రాశికి హృదయపూర్వక క్షమాపణలు తెలిపారు. అనసూయ తన పోస్ట్లో 'సుమారు మూడేళ్ల క్రితం ఒక టీవీ కామెడీ షోలో జరిగిన స్కిట్లో రాశిని ఉద్దేశించి డబుల్ మీనింగ్ డైలాగులు తన నోటి నుంచి రావడం తప్పేనని, ఆ సమయంలో ఆ డైలాగులు రాసిన రచయితలు, స్కిట్ను డైరెక్ట్ చేసిన వారిని నిలదీయలేకపోయానని, అది తన వైఫల్యమేనని ఆమె అంగీకరించారు. ' అప్పటి పరిస్థితుల్లో నాకు అంత ధైర్యం లేకపోయింది, కానీ అది పొరపాటేనన్న నిజాన్ని ఇప్పుడు ఒప్పుకుంటున్నాను'అని ఆమె పేర్కొన్నారు.
అయితే ఆ సంఘటన తన జీవితంలో ఒక మలుపుగా మారిందని అనసూయ చెప్పారు. కాలక్రమేణా తన ఆలోచనలు మారాయని, వ్యక్తిగా ఎదిగానని తెలిపారు. మహిళల గౌరవం, భద్రత విషయంలో గట్టిగా నిలబడటం నేర్చుకున్నానని, డబుల్ మీనింగ్ మాటలను ఖండించడం, అలాంటి షోల నుంచి దూరంగా ఉండటం వంటి నిర్ణయాలు ఆ మార్పులో భాగమేనని వివరించారు. మహిళల హక్కులపై గొంతెత్తడం తన బాధ్యతగా భావిస్తున్నానని కూడా ఆమె చెప్పారు. ఇటీవల తనను లక్ష్యంగా చేసుకుని పాత వీడియోలు, క్లిప్పులు తీసుకొచ్చి సోషల్ మీడియాలో హేట్ క్యాంపెయిన్లు నడుపుతున్నారని అనసూయ ఆవేదన వ్యక్తం చేశారు.
అలా చేయడం వల్ల తాను మాత్రమే కాదు, రాశికీ ఇబ్బంది కలిగే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. షో నిర్వాహకులు లేదా రచయితలు క్షమాపణ చెబుతారో లేదో తనకు తెలియదని, కానీ ఆ మాటలు తన నోటి నుంచి వచ్చాయి కాబట్టి నైతిక బాధ్యతగా తానే క్షమాపణ చెప్పాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. 'గతాన్ని మార్చలేను... కానీ భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోగలను' అని తెలిపారు. హీరోయిన్ రాశి ఈ విషయాన్ని అర్థం చేసుకుని తనకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్న అంటూ పేర్కొన్నారు అనసూయ. ఇప్పటికైనా ఈ వివాదానికి తెర పడుతుందో లేదో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











