Anasuya Bharadwaj : 400 ఎకరాల భూ వివాదం .. ఆ వీడియోలతో అనసూయ సంచలనం
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్పీయూ) భూముల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. వర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఫ్లాట్లుగా మార్చి విక్రయిస్తుందని తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్, బీజేపీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇదంతా అబద్ధమని తిప్పికొడుతోంది. అయితే ఈ వివాదంలో పలువురు సినీ ప్రముఖులు కూడా మాట్లాడుతుండటం దుమారం రేపుతోంది.
భూముల అమ్మకాలను వ్యతిరేకిస్తూ హెచ్సీయూ గడిచిన కొద్దిరోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వీరికి మద్ధతుగా ప్రజాస్వామ్య సంఘాలు, రాజకీయ పార్టీలు, సామాజిక కార్యకర్తలు నిలుస్తున్నారు. ఇప్పటికే క్యాంపస్లో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా ముందుకు వచ్చారు. ఈ 400 ఎకరాల భూములను ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఐఎంజీ భారత్ అనే సంస్థకు అప్పగించిందని తెలిపారు. దీనికి బదులుగా పక్కనే గోపన్పల్లిలో ఉన్న 400 ఎకరాలను యూనివర్సిటీకి బదలాయింపు చేసిందని భట్టి విక్రమార్క వెల్లడించారు.

అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఒప్పందాన్ని రద్దు చేసి 400 ఎకరాల భూమిపై హైకోర్టును ఆశ్రయించిందని గుర్తుచేశారు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరగడం, టీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండటంతో విషయాన్ని గాలికి వదిలేశారని భట్టి మండిపడ్డారు. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టి వాదనను వినిపించి కేసును గెలిచిందని తెలిపారు. ఈ 400 ఎకరాల ప్రజల ఆస్తిని వారికే చెందేలా చేస్తున్నామని.. ఈ భూముల్లో పెద్ద పెద్ద కంపెనీలు, పరిశ్రమలు వస్తే లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
అయితే ఆ 400 ఎకరాల స్థలంలో పచ్చని చెట్లను నరికివేస్తుండటంతో ఆ అడవిపై ఆధారపడ్డ మూగజీవులకు ఆధారం లేకుండా పోతుందవని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణానికి హాని కలిగించడంతో పాటు జీవ వైవిధ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. ఈ నిరసనకు పలువురు సెలబ్రెటీలు సైతం మద్ధతుగా నిలుస్తున్నారు. నాగ్ అశ్విన్, సినీనటి రేణూ దేశాయ్ తదితరులు సోషల్ మీడియా ద్వారా తమ స్పందన తెలియజేస్తున్నారు. తాజా ఈ లిస్ట్లోకి స్టార్ యాంకర్, సినీనటి అనసూయ భరద్వాజ్ కూడా చేరారు.
ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టారు. ఇది నిజంగా హార్డ్ బ్రేకింగ్ అంటూ రాసుకొచ్చిన అనసూయ.. హెచ్సీయూ క్యాంపస్లోని రాత్రి పూట వీడియోలు, జింకలు, ఇతర మూగజీవాలు సేద తీరుతున్న వీడియోలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం అనసూయ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే రానున్న రోజుల్లో హెచ్సీయూ భూముల వివాదం, అడవుల నరికివేతపై పలువురు స్పందించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











