నన్ను విమర్శించడానికి మీరెవరు? ఆంటీ అంటూ వేధింపులపై అనసూయ స్ట్రాంగ్ వార్నింగ్
తన మాటలు, చేతలతో వివాదాల్లో నిలుస్తుంటారు స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్. ఎంతగా సంయమనంతో ఉందామని అనుకున్నా ఆమెను వివాదాల్లోకి లాగుతున్నారు కొందరు. తాజాగా హోలీ సందర్భంగా అనసూయ కొత్త వివాదంలో చిక్కుకున్నారు. స్టేజ్పై ఆమె మాట్లాడుతుండగా కొందరు ఆకతాయిలు దారుణమైన కామెంట్స్ చేశారు. ఆంటీ.. ఆంటీ అంటూ కేకలు వేశారు. అప్పటికీ తనను తాను కంట్రోల్ చేసుకున్న అనసూయ .. తాజాగా సోషల్ మీడియా ద్వారా తనను వేధించిన వారికి వార్నింగ్ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
మనసులో ఏమున్నాసరే కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడటం అనసూయ స్టైల్. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా సరే తగ్గేదే లేదని పలుమార్లు నిరూపించారు కూడా. తన గురించి, తన వస్త్రధారణ గురించి అసభ్యంగా మాట్లాడినా.. అభ్యంతరకరంగా పోస్టులు పెట్టినా వారిపై ఒంటి కాలు మీద లేస్తుంది. అంతేకాదు.. ఇలాంటి చర్యలకు పాల్పడిన యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా ఖాతాలపైనా గతంలో పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసి ఎవరినీ వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చింది. తనపై అభ్యంతరకరంగా కామెంట్ చేసిన 30 లక్షల మందిని బ్లాక్ చేయించానని అనసూయ అప్పట్లోనే చెప్పింది.

తనపై హద్దులు మీరి కామెంట్ చేస్తున్నా మౌనంగానే భరిస్తున్నానని.. కానీ తన వ్యక్తిత్వం, కుటుంబ సభ్యులపై విమర్శలు చేస్తుంటే స్పందించక తప్పడం లేదని అనసూయ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు. కొందరు మహిళలు కూడా నన్నే తప్పుబడుతూ మాట్లాడుతున్నారని.. నిజానికి వాళ్లెవరో నాకు తెలియదు.. నేనెవరో వాళ్లకు తెలియదు అయినప్పటికీ నేను ధరించే దుస్తులపై కామెంట్ చేస్తున్నారని అనసూయ ఫైర్ అయ్యారు. ఇక ఇటీవల హీరోయిన్ల వస్త్రధారణపై హీరో శివాజీ చేసిన వ్యాఖ్యలపై అనసూయ ఘాటుగా స్పందించారు. నిత్యం దీనిపై పోస్టులు, వీడియోలు పెడుతూ విమర్శలు చేశారు. దాంతో సినీ పరిశ్రమ, సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయి చెరొకరికి సపోర్ట్ చేశారు. ఈ వివాదం సద్దుమణగడంతో అనసూయ కొంతకాలంగా సైలెంట్ తన పని తాను చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో హోలీ సందర్భంగా అనసూయకి చేదు అనుభవం ఎదురైంది. ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనసూయ సందడి చేశారు. వేదిక మీద డ్యాన్స్ చేస్తూ అందరినీ ఉత్సాహపరిచారు. అయితే మైక్ తీసుకుని మాట్లాడుతుండగా కొందరు ఆకతాయిలు దారుణంగా ప్రవర్తించారు. అనసూయ మాట్లాడుతున్నంత సేపు ఆంటీ ఆంటీ అంటూ కేకలు వేశారు. ఊహించని ఈ ఘటనతో షాకైనప్పటికీ ఓపికగా ప్రసంగాన్ని పూర్తి చేశారు అనసూయ. అయితే ఆ వెంటనే సోషల్ మీడియాలో ఈ కామెంట్స్పై కొందరు రీల్స్ చేశారు. ఈ పరిణామాలపై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు.
ఇతరుల బాధలో నుంచి ఆనందం వెతుక్కోవడం సరికాదు. తోటివారి పట్ల కనీస సానుభూతి, సమాజం పట్ల బాధ్యత లేని వారిని ఈ సొసైటీ నిలదీసే రోజులు రావాలి. వయసును బట్టి బాడీ షేమింగ్కు పాల్పడటం.. మహిళలపై వివక్ష చూపడం సరికాదు. ఇలాంటి వారిని చూసి సమాజం సిగ్గుపడాలి.. ప్రతి ఒక్కరూ నాకెందుకులే అని వదిలేస్తే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. వాటిపై నిర్లక్ష్యంగా ఉంటే మానవత్వాన్ని కోల్పోతాం. నేను ఎప్పుడూ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతా.. ఎవరికీ భయపడను. ఎన్నో అవమానాలను, అడ్డంకులను దాటుకుని ఈ స్థాయికి చేరుకున్నా. నా జర్నీ, నా విజయాలు నాకు గర్వంగా నిలుస్తాయి. ఎంతో కష్టపడి ఎదుగుతున్న వారిని తక్కువ చేయడానికి మీరెవరు అంటూ అనసూయ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు అనసూయకు అండగా నిలుస్తూ పోస్టులు పెడుతున్నారు. మరి ఇక్కడితో ఈ వివాదం ముగుస్తుందా? మరింత రాద్ధాంతం జరుగుతుందా? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications

















