తప్పు చేశా.. క్షమించండి.. తిరుమల ప్రసాదం వివాదంపై శివజ్యోతి
Shiva Jyothi Controversy: యాంకర్ శివజ్యోతి చేసిన తిరుమల తిరుపతి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారాయి. పవిత్రమైన శ్రీవారి ప్రసాదం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో చిక్కుల్లోపడ్డారు. ఆ వ్యాఖ్యల వల్ల భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ వివాదం క్రమంగా పెరగడంతో శివజ్యోతి స్పందించారు. ఓ వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే?
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో నిలబడి శివజ్యోతి చేసిన వ్యాఖ్యలు తొలుత చిన్నగానే అనిపించినా, క్రమంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. "తిరుమలలో కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాం... రిచెస్ట్ బిచ్చగాళ్లం మేమే" అంటూ ఆమె చెప్పిన మాటలు శ్రీవారి భక్తులు, హిందూ సంఘాల మనోభావాలను దెబ్బ తీశాయి.దీంతో తీవ్రంగా ఆగ్రహాం వ్యక్తం చేశారు. శ్రీవారి భక్తులు ఆమెపై మండిపడుతూ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ సంఘాలు కూడా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. పవిత్రమైన ప్రసాదంపై తప్పుగా మాట్లాడటం సరికాదని హెచ్చరించాయి.

ఈ వివాదం వేడెక్కుతున్న నేపథ్యంలో శివజ్యోతి సోషల్ మీడియాలో ఓ వీడియోను విడుదల చేసి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ తన మాటలు చాలా మందికి తప్పుగా అర్థమైందని, అందుకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నట్లు తెలిపారు. "నేను 'రిచ్' అని అన్నది రూ.10,000 ఎల్1 క్యూ లైన్లో నిలబడ్డామని కాదు, కేవలం కాస్ట్లీ క్యూలైన్లో నిలబడిన ఉద్దేశ్యంతో అన్నాను. నా ఇంటెన్షన్ తప్పు కాదు... మాట మాత్రమే తప్పిపోయింది" అని ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తాను గత నాలుగు నెలలుగా ప్రతి శనివారం శ్రీవారి వ్రతాల గురించి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో చెబుతున్నానని, తనకు వెంకటేశ్వర స్వామిపై ఎంత భక్తి ఉందో తన ఫాలోవర్స్ అందరికీ తెలుసని కూడా చెప్పారు. అంతే కాకుండా తన జీవితంలో అత్యంత విలువైన బిడ్డను కూడా స్వామి ప్రసాదమేనని పేర్కొంటూ భావోద్వేగానికి గురయ్యారు. "ఇలాంటి నేను స్వామి గురించి తప్పుగా ఎలా మాట్లాడతాను? అలా మాట్లాడను. నా మాటలుతో ఎవరైనా హార్ట్ అయి ఉంటే.. నిజంగా క్షమించండి" అని అన్నారు. ఈ వివాదంలో తన తమ్ముడు సోను కూడా అనుకోకుండా కొన్ని మాటలు మాట్లాడాడని, అతని తరఫున కూడా క్షమాపణలు చెబుతున్నట్లు తెలిపారు యాంకర్ శివజ్యోతి.
"కేసులు పెడతారని భయపడి క్షమాపణలు చెబుతున్నది కాదు. నాకు కూడా ఆ మాటలు తప్పుగా అన్నాననే ఫీలింగ్ వచ్చింది. అందుకే ఈ వీడియో పెట్టాను" అని శివజ్యోతి క్లారిటీ ఇచ్చింది. టీటీడీ సభ్యులు, భక్తులు, తన మాటల వల్ల మనోభావాలు దెబ్బతిన్న ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి తప్పు మాటలు తన నోటి నుంచి రానని కూడా హామీ ఇచ్చారు. ప్రస్తుతం శివజ్యోతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే.. కొంతమంది శ్రీవారి భక్తులు ఆమె క్షమాపణలను అంగీకరిస్తున్నప్పటికీ, మరికొందరు మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. మాట్లాడే ముందు జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తున్నారు. కొంతమంది అయితే.. ట్రోల్స్ కూడా చేస్తున్నారు. చూడాలి.. శివజ్యోతి వివాదం చల్లారుతుందా? లేక ఇంకా చర్చ కొనసాగుతుందా? అనేది.


Click it and Unblock the Notifications











