Sravanthi Chokkarapu: బిగ్బాస్ స్రవంతి పెద్ద మనసు.. వీర జవాన్ తల్లిదండ్రులకి ఆర్ధిక సాయం
బిగ్బాస్ తెలుగు 8 రన్నరప్గా నిలిచిన డాక్టర్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తోన్న చిత్రం సోలో బాయ్. రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటించారు. పి. నవీన్ కుమార్ దర్శకత్వం వహించగా.. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సతీష్ కుమార్ నిర్మించిన ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా జూన్ 18న సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆపరేషన్ సిందూర్లో అమరుడైన వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయి దంపతులు హాజరయ్యారు. వేదిక మీదకు వీరు రాగానే చిత్ర యూనిట్, ప్రేక్షకులు జై హింద్.. వందేమాతరం అంటూ మురళీ నాయక్కు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన యాంకర్ స్రవంతి చొక్కారపు వారిని చూసి ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె తీసుకున్న నిర్ణయంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
500 రూపాయలతో హైదరాబాద్కి
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా కదిరికి చెందిన స్రవంతి 2009లో చదువు పూర్తి చేసి మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా ప్రశాంత్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారగా అతని కోసం చేతిలో 500 రూపాయలు పెట్టుకుని హైదరాబాద్ వచ్చేశానని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది స్రవంతి. ఎస్ఆర్ నగర్లో హాస్టల్లో ఉండి పిల్లలకు పాఠాలు చెబుతూ లైఫ్ లీడ్ చేసినట్లు చెప్పింది. ఇంట్లో వాళ్లు తమ పెళ్లికి అంగీకరించకపోవడంతో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నామని తెలిపింది.

స్రవంతి ప్రేమను అంగీకరించని పెద్దలు
ఈలోపు స్రవంతి గర్భం దాల్చడంతో, ప్రశాంత్కు ఆర్ధికంగానూ నష్టాలు రావడంతో ఎంతో ఇబ్బంది పడ్డామని యాంకరమ్మ చెప్పింది. చివరికి డెలివరీ చేయడానికి కూడా డబ్బులు లేకపోవడంతో అత్తమ్మవాళ్లు ఆదుకున్నట్లు తెలిపింది. బాబు పుట్టాక పుట్టింటికి వెళ్దామని అనుకుంటే సరిగ్గా ఆ సమయంలో మా అమ్మ చనిపోయినట్లు తెలియడంతో ఏడ్చానని.. అప్పుడు బాబు బాధ్యతలు అత్తమ్మ తీసుకోవడంతో తాను యాంకరింగ్ వైపు అడుగులు వేసినట్లు స్రవంతి వెల్లడించింది.
స్రవంతి జీవితాన్ని మలుపు తిప్పిన పుష్ప
ఓ లోకల్ ఛానెల్లో యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసిన దశలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఇంటర్వ్యూతో పాటు పుష్ప సినిమా విడుదల సమయంలో అల్లు అర్జున్తో చేసిన ఇంటర్వ్యూ స్రవంతి జీవితాన్ని మార్చేసింది. ఈ పాపులారిటీతో బిగ్బాస్ తెలుగులో అవకాశం దక్కించుకుని మరింత క్రేజ్ సంపాదించుకున్నారు స్రవంతి. ప్రస్తుతం సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, పలు ఛానెల్స్లో షోలతో బిజీగా ఉన్నారు స్రవంతి చొక్కారపు. హాట్ హాట్ ఫోటో షూట్లతో కుర్రాళ్లను రెచ్చగొడుతుంటారు. స్రవంతిలో మంచి మనసు కూడా ఉంది. గతేడాది విజయవాడ నగరాన్ని వరదలు ముంచెత్తినప్పుడు తన స్తోమతకు తగినట్లుగా లక్ష రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళంగా అందించారు. తాజాగా స్రవంతి తన పెద్ద మనసును మరోసారి చాటుకున్నారు.
ఆపరేషన్ సిందూర్లో అమరుడైన మురళీ నాయక్
కొద్దిరోజుల క్రితం జమ్మూకాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదుల ఊచకోతలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. దీనికి కౌంటర్గా పాకిస్తాన్ సైన్యం ప్రతిదాడులు చేసింది. ఈ యుద్ధంలో శత్రు సైన్యంతో పోరాడుతూ పలువురు భారత సైనికులు అమరులయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా కళ్లెతండాకు చెందిన మురళీ నాయక్ కూడా ఒకరు. ఒక్కగానొక్క కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించడంతో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మురళీ నాయక్ కుటుంబానికి స్రవంతి సాయం
సోలో బాయ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో యాంకర్ స్రవంతి చొక్కారపు మాట్లాడుతూ.. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మురళీని తిరిగి తీసుకురాలేకపోయినా.. తమ వంతుగా ఆర్ధిక సాయం చేస్తామని చెప్పింది. దీనిలో భాగంగా లక్ష రూపాయలను ఈవెంట్ అవ్వగానే వారికి ట్రాన్స్ఫర్ చేస్తానని తెలిపింది. అదే వేదికపై ఉన్న ఈ చిత్ర సంగీత దర్శకుడు కూడా త్వరలో కల్లితండా గ్రామానికి వెళ్లి మ్యూజిక్ కన్సర్ట్ చేసి వచ్చిన డబ్బును మురళీ నాయక్ కుటుంబానికి అందిస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోకుండా తానే యాంకరింగ్ చేస్తానని స్రవంతి వెల్లడించారు. దీంతో యాంకర్ స్రవంతిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా మంది స్టార్స్ కంటే ఈమె బెటరంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











