ఆ ఘటనతో ఏడాది పాటు డిప్రెషన్.. యాంకర్ ఉదయభాను ఎమోషనల్..
ఒకప్పుడు తెలుగు టెలివిజన్లో యాంకరింగ్ అంటే ప్రత్యేక స్థానం ఉండేది. ఈ రోజుల్లో మైక్ పట్టుకున్నవాళ్లంతా యాంకర్లుగా మారుతున్నా.. దాదాపు పదిహేనేళ్ల క్రితం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. ఆ కాలంలో యాంకరింగ్కి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వారు ఉదయభాను (Udaya Bhanu). వీరిలో ముఖ్యంగా ఉదయభాను ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. 'డాన్స్ బేబీ డాన్స్', 'సాహసం చేయరా ఢింభకా', 'ఢీ' వంటి షోలతో ఆమె చిన్న తెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె హోస్టింగ్ అంటే ఎనర్జీకి మరో పేరు. అప్పట్లో ఆమె కోసం ప్రేక్షకులు టీవీల ముందు కూర్చుని షో మిస్ కాకుండా చూసేవారు అనడం అతిశయోక్తి కాదు. అయితే.. తాజాగా ఓ సంఘటనతో తాను దాదాపు ఏడాది పాటు డిప్రెషన్లోకి వెళ్లిపోయానని ఆమె ఎమోషనల్గా చెప్పింది. ఇంతకీ ఏమైందంటే?
తెలుగు బుల్లితెరపై ఒకప్పుడు స్టార్ యాంకర్గా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఉదయ్ భాను (Udaya Bhanu) తాజాగా తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన అత్యంత భావోద్వేగ అనుభవాన్ని పంచుకుంది. బయటికి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఆమె జీవితం వెనుక ఎంతటి బాధ దాగి ఉందో ఈ సందర్భంలో వెల్లడించింది. ముఖ్యంగా తన మొదటి గర్భధారణ సమయంలో జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంటూ, ఆ రోజులు తన జీవితంలోనే అత్యంత కఠినమైనవని చెప్పింది.

ఉదయభాను మాట్లాడుతూ... "నేను ఇప్పుడు నా ఫీలింగ్స్ను అందరితో షేర్ చేయను. కానీ నా జీవితంలో జరిగిన ఒక సంఘటనను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను" అంటూ ప్రారంభించింది. తాను మొదటిసారి గర్భవతి అయిన సమయంలో ఓ అనుమానం వచ్చి, విమాన ప్రయాణానికి ముందు టెస్ట్ చేసుకున్నానని తెలిపింది. రిపోర్ట్ పాజిటివ్ రావడంతో ఒకవైపు ఆనందం, మరోవైపు ఆందోళన కలిసిపోయాయని చెప్పింది. వెంటనే డాక్టర్కు ఫోన్ చేసి, షూటింగ్ కోసం యూఎస్ వెళ్లాల్సి ఉందని చెప్పి ఏం చేయాలో అడిగినట్లు వెల్లడించింది.
డాక్టర్ పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తగా ప్రయాణం చేయవచ్చని చెప్పడంతో షూటింగ్ కోసం అమెరికాకు వెళ్లినట్లు ఆమె తెలిపింది. అయితే అక్కడ పని ఒత్తిడి కారణంగా శరీరం బలహీనంగా మారిందని, త్వరగా అలసిపోతున్నానని గుర్తుచేసుకుంది. ఆ సమయంలో టెస్టులు చేయించుకున్నప్పటికీ, గర్భధారణ ఆనందం మాత్రం తనలో కొనసాగుతూనే ఉందని చెప్పింది. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. చిన్నప్పటి నుంచి తనకు హారర్, క్రైమ్ సినిమాలంటే భయం ఉంటుందని చెప్పిన ఉదయభాను, అనుకోకుండా ఒక హారర్ సీన్ చూడాల్సి వచ్చిందని తెలిపింది. ఆ సమయంలో తీవ్ర భయం కలిగిందని, వెంటనే కడుపులో అసహజ నొప్పి మొదలైందని వివరించింది. పరిస్థితి విషమించడంతో వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారని, అక్కడ గంటల పాటు పరీక్షలు చేసినట్లు తెలిపింది.
"నేను నడుస్తుంటే ఫ్లోర్ మొత్తం బ్లడ్ కనిపించింది... ఆ క్షణం నా జీవితంలోనే భయంకరమైనది" అంటూ ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనైంది. చివరికి తన మొదటి బిడ్డను కోల్పోయానని చెప్పిన ఉదయభాను, ఆ బాధను మాటల్లో చెప్పలేనిదిగా పేర్కొంది. ఆ ఘటన తర్వాత తాను దాదాపు ఒక సంవత్సరం పాటు తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయానని వెల్లడించింది. "పైకి నవ్వుతున్నా... లోపల మాత్రం ఆ బాధ ఎప్పుడూ ఉండేది. కళ్లుమూసినా, తెరిచినా అదే జ్ఞాపకం వెంటాడేది. దేవుడు ఇచ్చిన బిడ్డను ఎందుకు తీసుకున్నాడో అని ఎన్నోసార్లు ప్రశ్నించుకున్నాను" అంటూ తన మనస్థితిని వివరించింది.
ఆ దశ నుంచి బయటపడటం చాలా కష్టమైందని, కానీ తనలోనే పోరాడి మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చానని చెప్పింది. అయితే కాలం క్రమంగా మారింది. ఏడాది తర్వాత మళ్లీ గర్భవతి అయినట్లు తెలిపిన ఉదయభాను, ఈసారి తన జీవితంలో డబుల్ ఆనందం వచ్చిందని చెప్పింది. ఒకేసారి జంట పిల్లలకు జన్మనిచ్చి, ఆ బాధను ఆనందంగా మార్చుకున్నట్లు వెల్లడించింది. "ఒక బిడ్డను కోల్పోయిన బాధ ఉన్నా... ఇప్పుడు నాకు రెండు ప్రపంచాలు వచ్చాయి" అంటూ ఆమె భావోద్వేగంగా చెప్పింది.
ఇక ఈ సంఘటన తర్వాత తన కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నానని, అందుకే దాదాపు మూడు సంవత్సరాల పాటు అన్ని షోల నుంచి దూరంగా ఉన్నానని తెలిపింది. ప్రస్తుతం తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, జీవితాన్ని కొత్త కోణంలో చూస్తున్నానని పేర్కొంది. ఉదయభాను చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications





