Bhanumathi April 16th Episode : పార్ధు - భానుమతిల పెళ్లి క్యాన్సిల్ .. కట్నకానుకలు లాగేసుకున్న శక్తి
బలరామ్ ఎప్పుడు విడుదలవుతాడో తెలియక అతని కుటుంబం ఎదురుచూస్తుంటుంది. మన పరువు పోవడానికి కారణమైన ఆ అమ్మాయి గురించి కనుక్కున్నారా అని అడుగుతుంది బలరామ్ తల్లి. పార్ధు అదే పనిలో ఉన్నాడని.. ఆ అమ్మాయిని మాత్రం వదిలిపెట్టేది లేదని చెబుతాడు దుర్గ. అన్నయ్యకి ఈ పరిస్దితి రావడానికి కారణమైన అమ్మాయి మన కళ్ల ముందే నాశనమైపోవాలని అంటుంది శాంభవి. తల్లి మాటలతో భువన బాధపడుతూ పైకి వెళ్లిపోతుంది.
భువనపై అనుమానం వచ్చిన శాంభవి.. ఏం జరిగిందని అడుగుతుంది. కన్నతల్లే నేను నాశనమైపోవాలని కోరుకుంటుంటే తట్టుకోలేకపోతున్నానని అనడంతో శాంభవి ఉలిక్కిపడుతుంది. భానుమతి మైనర్ అని , పెళ్లి ఆపమని ఎస్ఐకి ఫోన్ చేసింది నేనేనని చెబుతుంది భువన. ఆ మాటలతో శాంభవి షాక్ అవుతుంది. ఇంతలో వెనక్కి తిరిగి చూసేసరికి పార్ధు కనిపించడంతో తల్లీకూతుళ్లకి ముచ్చెమటలు పడతాయి. మా నాన్న కోసం మీరు పడే ఆవేదన నాకు అర్ధమైందని అంటాడు పార్ధు. భానుమతి ఒంటికి తగిలిన గాయానికి మందు రాస్తుంటుంది వసు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక ఏప్రిల్ 16వ తేదీ ఎపిసోడ్లో 33లో ఏం జరిగిందంటే?

భానుమతి వల్లే బలరామ్ గారికి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వాళ్లకి తెలిస్తే ఇప్పటి వరకు వాళ్లలో మనం చూసిన మంచితనం కన్నా 100 రెట్లు చెడును కూడా చూడాల్సి వస్తుందని భయపడతాడు కోటి. నిజం నిప్పులాంటిది దానిని కొంతకాలం కప్పిపుచ్చగలం కానీ శాశ్వతంగా బయటికి రాకుండా ఆపలేం కదా అని అంటుంది కుమారి. నిజం బయటికి రాకుండా ఆపాలని, శాశ్వతంగా ఆ నిజాన్ని మనం సమాధి చేయాలని అంటాడు కోటి. వసు, భానుమతిలు గదిలో కూర్చొని బాధపడుతుండగా ప్రమీల వచ్చి భోజనం చేద్దామని పిలుస్తుంది.
పెళ్లి ఆపేశానని నా మీద నీకు ఏ కోపం లేదా? అని భానుమతి అడుగుతుంది. నా స్థానంలో ఉన్న ఏ తల్లయినా గొప్ప జీవితాన్ని కాలదన్నుకుంటున్న కూతురిని చూసి ఖచ్చితంగా కోప్పడుతుందని అంటుంది. మీ నాన్న కోపం నీ ఒంటి మీద గుర్తులు మిగిల్చిందని చెబుతుంది. కానీ నీ జీవితంలో ఏర్పడిన ఈ పరిస్థితిని మాత్రం మార్చలేకపోయిందని అంటుంది ప్రమీల. ఇక నేను కూడా కోప్పడటం వల్ల ఏం ప్రయోజనం ఉంది అని కూతురిని ప్రశ్నిస్తుంది. కూతురు అనాలోచితంగా, అవివేకంగా ప్రవర్తిస్తుందని బాధపడటం తప్పించి ఇంకేం చేయలేనని అంటుంది. భానుమతికి వసు భోజనం తినిపిస్తుండగా వద్దు అని చెబుతుంది.
బలరామ్ కుటుంబం అంతా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంది. నా కొడుకు మహారాజులా బతికాడని, ఏనాడు మచ్చపడలేదని అలాంటిది ఈరోజు తప్పు చేసినవాడిలా తలదించుకునే పరిస్ధితి వచ్చిందని బాధపడుతుంది బలరామ్ తల్లి. వాడి జీవితంలో ఇలాంటి చీకటి రోజులు వస్తాయని నేను ఏ రోజు అనుకోలేదని బాధపడుతుంది. నాన్న అతి త్వరలోనే బయటికి వచ్చేస్తారని చెబుతాడు పార్ధు. వాడు బయటికొస్తాడని నాకు కూడా తెలుసని, కానీ పడిన మచ్చ.. పోయిన పరువు వస్తుందా అని ప్రశ్నిస్తుంది బలరామ్ తల్లి.
నా కొడుకు జీవితం మీద ఆ భానుమతి జాతకం ఒక అమావాస్యలా వచ్చి పడిందని మండిపడుతుంది. ఆ అమ్మాయితో పెళ్లి తలపెడితేనే ఇంత ప్రమాదం జరిగిందని, కోడలిగా ఈ ఇంట్లోకి అడుగుపెడితే ఇంకెంత ప్రళయం జరుగుతుందోనని ఫైర్ అవుతుంది. ఆ మాటలతో పార్ధు షాక్ అవుతాడు. మన తలరాతలు బాలేదు కాబట్టి పరిస్థితి ఇలా తలక్రిందులైందని, మన తలరాతకి ఆ అమ్మాయి జాతకానికి ముడి పెట్టొద్దని అంటాడు పార్ధు. ఎవరో చేసిన తప్పుకి ఇంకేవరినో బలిచేయడం కరెక్ట్ కాదని శారద కూడా అంటుంది.
మీ వల్ల పార్ధు ప్రేమ ఇరకాటంలో పడే ప్రమాదంలో ఉందని చెబుతుంది. పెళ్లే వద్దు అంటుంటే ఇంకా ఆ ప్రేమను పట్టుకుని ఏం చేస్తాడని ప్రశ్నిస్తుంది బలరామ్ తల్లి. ఈ మాటలన్నీ కోటి దొంగచాటుగా విని వాళ్ల మనసు మార్చాలని అనుకుంటాడు. అల్లుడుగారు అంటూ పార్ధు దగ్గరికి వెళ్లి బాధపడతాడు. ఎవడ్రా నీకు అల్లుడు.. అష్ట దరిద్రాలు జాతకంలో ఉన్న దానిని తీసుకొచ్చి మా ఇంటి కోడలిగా చేద్దామని అనుకుంటున్నావా? అని మండిపడుతుంది బలరామ్ తల్లి. నీ కూతురు వద్దు.. నీ సంబంధం వద్దు అని చెప్పడంతో అంతా షాక్ అవుతారు.
బలరామ్ బాబుగారిపై పడ్డ మచ్చ గురించి అంతా మరిచిపోతారని, కానీ పీటల మీద పెళ్లి ఆగిపోయిన ఓ అమ్మాయి గురించి జనం మరిచిపోరని అంటాడు కోటి. మీరు ఇంటికి వెళ్లండి .. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడదామని చెబుతాడు పార్ధు. నిర్ణయం తీసుకోవడం అయిపోయిందని, ఇక మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని బలరామ్ తల్లి తేల్చిచెబుతుంది. పెళ్లి కానుకలుగా మీ అమ్మాయికి మేం ఇచ్చిన చీరలు, నగలు, కానుకలు మాకు తిరిగి ఇచ్చేయాలని అంటుంది. ఆ మాటలతో కోటి షాక్ అవుతాడు.
నానమ్మ ఏంటీ ఇంత ట్విస్ట్ ఇచ్చింది? ఇప్పుడు మనం నొక్కేసిన నగల గురించి కూడా బయటపడుతుందని శక్తితో అంటుంది చిత్ర. ఇప్పుడే వెళ్లి ఆ బట్టలు, నగలు తీసుకొచ్చేస్తానని అంటుంది శాంభవి. దీంతో శక్తి జోక్యం చేసుకుని నేను వెళ్లి తీసుకొస్తానని చెబుతుంది. వాటిని ఇచ్చింది నేనే కాబట్టి, తెచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని అంటుంది శక్తి. ఈ కుటుంబానికి వియ్యంకుడు అవ్వాలన్న ఆలోచన ఈ ఇంటి వాకిట్లోనే వదిలేసి వెళ్లిపోమని కోటికి వార్నింగ్ ఇస్తుంది బలరామ్ తల్లి.
కోటితో కలిసి ఇంటికొచ్చిన శక్తిని చూసి ప్రమీల షాక్ అవుతుంది. పెళ్లి జరగలేదు, ఇకపై జరుగుతుందన్న నమ్మకం కూడా లేదని మేం ఇచ్చిన కట్నకానుకలు తిరిగి ఇచ్చేయమని ప్రమీలతో చెబుతుంది శక్తి. మా అత్తయ్యకు ఈ పెళ్లి ఇష్టం లేదని అంటుంది. కోటి బతిమలాడాలని చూడగా ప్రమీల వద్దు అని చెబుతుంది. నువ్వు అడగటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వాళ్లు ఇచ్చిన బట్టలు, బంగారం వాళ్లకే ఇచ్చేద్దామని అంటుంది. ఆ మాటలతో కుమారి, కోటి షాక్ అవుతారు. ఇంటికి వెళ్లగానే మనం కొట్టేసిన నగలను ఇందులో కలిపేసి నానమ్మకి ఇచ్చేద్దామని శక్తితో చెబుతుంది చిత్ర.
డబ్బు, బంగారం ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో భానుమతిపై మండిపడతారు శక్తి , కుమారి. భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికి భగవంతుడు గొప్పరాత రాయడని .. అది ఉన్నవాడే అదృష్టవంతుడు అవుతాడని అంటుంది కుమారి. కానీ నువ్వు రాతలో ఉన్న అదృష్టాన్ని కాలితో తన్నావని మండిపడుతుంది. నువ్వు బాగుపడకపోయినా పర్లేదు.. మమ్మల్ని కూడా బాగుపడనివ్వడం లేదని ఫైర్ అవుతుంది కుమారి. కాలినడకన వెళ్లేవాడికి కారు విలువ తెలుస్తుందని, కూర్చిలో నుంచి లేవలేని వాడికి కాళ్ల విలువ తెలుస్తుందని అంటుంది ప్రమీల.
నువ్వు అనుకున్న గొప్పజీవితం నువ్వు అందుకోలేని రోజున నువ్వు కోల్పోయిన అదృష్టం విలువ నీకు తెలుస్తుందని చెబుతుంది. నువ్వు చేసింది చిన్న తప్పు కాదని.. ఆ తప్పు విలువ నీ జీవితమని క్లాస్ పీకుతుంది ప్రమీల. ఆ మాటలతో భానుమతి కన్నీటి పర్యంతమవుతుంది. ఎవరెన్ని అడ్డుపుల్లలు వేసినా బలరామ్ని, పార్ధుని ఒప్పిస్తే చాలని ప్లాన్ చేస్తాడు కోటి. ఉదయాన్నే బెయిల్ పేపర్స్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వస్తాడు లాయర్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











