Bhanumathi April 28th Episode : శక్తి షాకింగ్ ప్లాన్, భానుమతి మెడలో తాళి.. ప్రమీల కంటతడి
కోటి ఇంటికి వెళ్లి భువన గొడవ చేయడంతో ఆమెపై రగిలిపోతాడు పార్ధు. నీతో నా పెళ్లి జన్మలో జరగదనని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దని వార్నింగ్ ఇస్తాడు. నువ్వయినా భువనకి అర్ధమయ్యేలా చెప్పమని శాంభవికి చెబుతాడు. ఇంతలో శక్తి, చిత్రలు రావడంతో నువ్వు చెప్పినట్లే భానుమతి ఇంటికి వెళ్లి గొడవ చేశానని కానీ ఫలితం రాలేదని అంటుంది భువన. భానుమతి - పార్ధుల పెళ్లి చాలా దూరం వచ్చేసిందని ఇక ఈ ప్రయత్నాలు ఆపమని చెబుతుంది శక్తి.
పార్ధు- భానుమతిల పెళ్లికి బలరామ్ గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తాడు. పెళ్లి అయ్యే వరకు భానుమతి పక్కనే ఉంటానని అంటుంది ప్రమీల. బాబురావుని పిలిపించిన శాంభవి అతనికి డబ్బులిచ్చి పెళ్లిని ఆపడానికి పోలీసులకు ఫోన్ చేసింది భానుమతేనని చెప్పాలని అంటుంది. శాంభవి చెప్పినట్లే చేయడానికి పార్ధు దగ్గరికి వెళ్లిన బాబూరావు అతనిని బయటికి తీసుకొస్తాడు. అయితే పార్ధు కోపం చూసి చెప్పలేకపోతాడు. బలరామ్ పెద్ద కొడుకు ధర్మ.. పోలీస్ కానిస్టేబుల్ తాగుతూ ఉంటారు. ఆ రోజు పోలీసులకి ఫోన్ చేసింది భానుమతేనని కానిస్టేబుల్ చెబుతుండగా శక్తి విని షాక్ అవుతుంది. ఇదంతా గల ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక ఏప్రిల్ 28వ తేదీ ఎపిసోడ్ 43లో ఏం జరిగిందంటే?

మందు కొట్టడానికి వెళ్లిన కానిస్టేబుల్, బలరామ్ పెద్ద కొడుకు ధర్మలను వెతుక్కుంటూ కోటి అటు ఇటూ తిరుగుతాడు. ఇంతలో వాళ్లిద్దరినీ చూస్తాడు. మీరు ఏదో చెబుతున్నారని.. కానీ నాకేం అర్ధం కాలేదని ధర్మ అంటాడు. ఆ రోజు పెళ్లి ఆపింది ఎవరో కాదు పెళ్లి కూతురు భానుమతేనని అంటాడు కానిస్టేబుల్. ఆ మాటలు విన్న కోటి షాక్ అవుతాడు. పెళ్లికి రమ్మని పిలిస్తే ఈ కానిస్టేబుల్ పెళ్లే చెడగొట్టేసేలా ఉన్నాడని భయపడతాడు కోటి. మందు ఇప్పటికే ఎక్కువైందని ఇక ఇంటికి బయల్దేరండి అని కానిస్టేబుల్ని పంపేస్తాడు. ఈ కానిస్టేబుల్ మాటలు ధర్మ వినలేదని.. సంతోషించి మిగిలిపోయిన మందు తాగేస్తాడు కోటి.
ఇంతలో పెళ్లి కూతురు గదికి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు పంతులు గారు రమ్మంటున్నారని చెప్పి ప్రమీలను పిలుస్తారు. నేను ఇప్పుడే వస్తానని, మీరు అమ్మాయి దగ్గరే ఉండి జాగ్రత్తగా చూసుకోమని ప్రమీల. వీళ్లని ఏదో రకంగా బయటికి పంపించమని వసుతో చెబుతుంది భానుమతి. వాళ్లెవరో మిమ్మల్ని పిలుస్తున్నారని తోడుగా ఉన్న ఇద్దరిని బయటికి తీసుకెళ్తుంది వసు. నేను ఎలాగైనా పార్ధుని కలిసి నా చదువు గురించి చెప్పాలని అనుకుని అతనిని వెతుక్కుంటూ వెళ్తుంది భానుమతి. అది చూసిన శక్తి ఆమెను పిలుస్తుంది.
ఎక్కడికి? ఇంత హడావుడిగా బయల్దేరావు? అని ప్రశ్నిస్తుంది. నేను పార్ధు గారిని కలవాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. అదేంటో నాతో చెబితే నేను పార్ధుకి చెబుతానని అంటుంది శక్తి. నేను చదువుకుంటానని, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పి వచ్చేస్తానని అంటుంది భానుమతి. నీకు పెళ్లి వద్దా? పార్ధుతో పెళ్లి వద్దా? అని ప్రశ్నిస్తుంది శక్తి. చదువుకోవడం కోసం పెళ్లి వద్దని అంటుంది భానుమతి. ఒకవేళ నీకు పెళ్లి తర్వాత చదువుకునే అవకాశం ఉంటే పార్ధుని పెళ్లి చేసుకోవడంలో నీకు అభ్యంతరం లేదు కదా అని అడుగుతుంది శక్తి.
పెళ్లయ్యాక నన్ను చదువుకోనిస్తారా? అని భానుమతి సంబరపడిపోతుంది. నేను చదువుకోడానికి బలరామ్ గారు ఒప్పుకుంటారా? అని భానుమతి అడగ్గా.. ఆయనని ఒప్పించే బాధ్యత నాది అని చెబుతుంది శక్తి. కావాలంటే ఇప్పుడే వెళ్లి ఆయనతో మాట్లాడతానని బలరామ్ దగ్గరికి వెళ్లి మాట్లాడినట్లుగా నటిస్తుంది. వారిద్దరి తీరుని దూరం నుంచి చూసిన భానుమతి.. నిజంగానే శక్తి ఏదో మాట్లాడిందని సంబరపడుతుంది. నేను చదువుకోవడానికి బలరామ్ గారు ఒప్పుకున్నారా? అని భానుమతి అడగ్గా ఔనని అంటుంది శక్తి. ఆ మాటలతో భానుమతి సంబరపడిపోతుంది. ఇప్పుడైనా పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని శక్తి అడగ్గా.. భానుమతి సిగ్గుపడుతూ లోపలికి వెళ్తుంది. నీ చదువుకు ఈ ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోరని, ఈ పెళ్లి జరగడం కోసం నిన్ను మభ్య పెడుతున్నానని మనసులో అనుకుంటుంది శక్తి.
పార్ధుతో తన పెళ్లి జరగకపోవంతో భువన బాధపడుతుంటుంది. పెళ్లి పీటల మీద భానుమతికి అడ్డుగా తెర పెట్టి పార్ధుని ఆటపట్టిస్తాడు సూరి. జీలకర్ర బెల్లం పెట్టి భానుమతి మెడలో పార్ధు తాళి కట్టడంతో బలరామ్ దంపతులు, కోటి దంపతులు ఆనంద భాష్పాలు రాల్చుతారు. తర్వాత భానుమతి - పార్దులు దండలు మార్చుకుంటారు. పెళ్లి ఎలాంటి ఆటంకం లేకుండా జరగడంతో శక్తి సంతోషిస్తుంది. నేను అనుకున్నట్లుగానే ఒక పల్లెటూరి అమ్మాయిని , ఒక పేదింటి అమ్మాయిని, అంతగా చదువుకోని అమ్మాయిని పార్ధుకి కట్టబెట్టేశానని అనుకుంటుంది శక్తి. భానుమతిని నా చెప్పు చేతల్లో పెట్టుకుని ఇకపై ముందు కథ నేను నడిపిస్తానని అనుకుంటుంది.
అప్పగింతల సమయంలో భానుమతిని పట్టుకుని ఏడుస్తుంది ప్రమీల. అక్కడ ఏమైనా తేడా చేశావో ఇక్కడ మీ అమ్మ ప్రాణాలు గోవింద అని కూతురికి వార్నింగ్ ఇస్తాడు కోటి. తర్వాత శాస్త్రం ప్రకారం భానుమతిని శారద చేతుల్లో పెడుతుంది ప్రమీల. నేను నా కూతురిని పట్టు పాన్పుల మీద పెంచలేదని, ప్రేమ విషయంలో మాత్రం ఏ లోటు రానీయొద్దని అంటుంది. మా పార్ధు .. మీ భానుమతిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడని, మా పార్ధు ప్రేమని మేం గౌరవిస్తున్నామని చెబుతుంది శారద. భానుమతి ఇక మా ఇంటి బిడ్డ అని.. తనకు ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత మాదని మాటిస్తాడు బలరామ్.
తర్వాత భానుమతిని పార్ధు చేతుల్లో పెడుతుంది ప్రమీల. అత్తారింటికి వచ్చిన అమ్మాయి చుట్టూ ఎంత మంది ఉన్నా.. ఆ అమ్మాయి అన్నింటి కంటే ఎక్కువగా కోరుకునేది భర్త ప్రేమని, భర్త అప్యాయతని అని చెబుతుంది ప్రమీల. పరిస్ధితులతో పోరాడి మరి భానుమతిని పెళ్లి చేసుకున్నానని, అంత పోరాడింది నా ప్రేమను చూపించుకోవడానికే కాదు.. తనని నేను మహారాణిలా చూసుకోవడానికి అంటాడు పార్ధు. ఆమెకు ఏ లోటు లేకుండా చూసుకుంటానని మాటిస్తాడు. అత్తారింటికి వెళ్తూ తల్లిని, చెల్లిని హత్తుకుని ఏడుస్తుంది భానుమతి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











