Bhanumathi April 2nd Episode: భానుమతి నోరు నొక్కేసిన ప్రమీల.. శాంభవి కుట్ర తెలుసుకున్న బలరామ్
పెళ్లి పనులు మొదలుపెట్టాలని కుమారి చెప్పగా త్వరలోనే శుభలేఖలు ప్రింట్ చేయించి ఊరంతా పంచేస్తానని అంటాడు కోటి. ఆ మాటలు విని భానుమతి, వసులు నవ్వుకుంటూ ఉంటారు. విశ్వనాథం ఇంట్లో పసుపు దంచడానికి కావాల్సిన రోలు, రోకలి అన్ని సిద్ధం చేయించి హడావుడి చేస్తుంది శారద. బలరామ్ కుటుంబం సంబరాలు చేసుకుంటూ ఉండగా శాంభవి, భువనలు రగిలిపోతుంటారు. రోడ్డుపై కనిపించిన భానుమతికి లిఫ్ట్ ఇచ్చి ఇంటి దగ్గర దించుతాడు పార్ధు.
పార్ధుతో ఇంటికొచ్చిన భానుమతిని చూసి కోటి, కుమారి, ప్రమీలలు సంతోషిస్తారు. భానులో మార్పు మొదలై పార్ధుతో క్లోజ్గా ఉండటంతో కోటి సంబరపడిపోతాడు. పెళ్లికి కావాల్సిన నగలు , బట్టలను బలరామ్ ఫ్యామిలీ సెలెక్ట్ చేస్తుండగా పార్ధు వస్తాడు. శారద అతనిని పలకరించబోగా మండిపడతాడు. ఇంతలో శక్తి వచ్చి భానుమతికి బట్టలు , నగలు సెలెక్ట్ చేయాలని చెప్పడంతో వాటిని చూస్తాడు. చీరలు , నగలు సెలెక్ట్ చేయడంతో పాటు కొంత డబ్బిచ్చి శక్తితో పంపిస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక ఏప్రిల్ 2వ తేదీ ఎపిసోడ్ 21లో ఏం జరిగిందంటే?

పార్ధు ఇచ్చిన డబ్బు, నగలు, బట్టలు తీసుకుని భానుమతికి ఇంటికి బయల్దేరతారు శక్తి, ఆమె కూతురు చిత్ర. గతంలో ప్రమీల, భానుమతిలను అవమానించిన ఘటనను చిత్ర గుర్తుచేసుకుంటుంది. ఏం ఆలోచిస్తున్నావని శక్తి అడగ్గా.. మనకి పనికిరాదని విసిరికొట్టిన ఓ చిల్లర నాణేం కోసం వెతుకుతున్నట్లుగా ఉందని అంటుంది చిత్ర. ఒకప్పుడు వాళ్లని చూస్తేనే మనం చీదరించుకున్నామని, మన కాలి గోటికి కూడా సరిపోరని ఎగతాళి చేశాం.. కానీ ఇప్పుడు వాళ్లింటికే కారు వేసుకుని ఇద్దరం బయల్దేరమని చెబుతుంది .
ఒక్కోసారి పరిస్ధితులు తారుమారై మనల్ని తికమకపెడుతుంటాయని అంటుంది శక్తి. వాళ్ల జాతకాల దశ తిరిగిందని , అందుకే ఇప్పుడు వాళ్ల కాళ్ల దగ్గరికి మనం వెళ్లాల్సి వస్తోందని చెబుతుంది. వాళ్లతో సంబంధం అంటే నాకు నచ్చడం లేదని చెబుతుంది చిత్ర. పనిమనిషి, తోటమాలి మనకు నచ్చాల్సిన అవసరం లేదని ఆ పని కోసమే వాళ్లని పెట్టుకుంటామని ఇప్పుడు భానుమతి కూడా అంతేనని అంటుంది శక్తి. ఇంటి కోడలిగా వచ్చినంత మాత్రాన అది మనింటికి మహారాణి అయిపోదని, అలాంటిది పార్ధుకి పెళ్లాంగా వస్తేనే మన చెప్పుచేతల్లో ఉంటుందని చెబుతుంది.
ఆ ఇంటికి శివగామిలా అవతారమెత్తాలంటే ఇలాంటివాళ్లు మన చెప్పుచేతల్లో ఉండాలని అంటుంది. కూటికి లేనిదానికి ఇంత కనకాభిషేకం అవసరమా అని ప్రశ్నిస్తుంది చిత్ర. కోడలి పోస్ట్ ఇస్తూ ఇంత డబ్బు, నగలు ఇవ్వడం నాకు నచ్చలేదని అంటుంది. అయితే వాటిలో నుంచి కొన్ని నువ్వు తీసేస్కో అని చెబుతుంది శక్తి. ఇంతలో ఇంటి ముందు నిలబడ్డ శక్తి, చిత్రలను చూసి షాక్ అవుతుంది ప్రమీల. కోటిని పిలిచి ఇంట్లోకి తీసుకొస్తుంది. ఏమైనా అవసరం వస్తే కబురు పెట్టుంటే నేనే వచ్చేదాన్నని అంటాడు కోటి. బంధువులం అవుతున్నప్పుడు రాకపోకలు ఉండాలని అంటుంది శక్తి.
ఇంట్లో శక్తి, చిత్రలను చూసిన భానుమతి షాక్ అవుతుంది. పెళ్లి ఆగిపోయిందని అనుకుంటే మళ్లీ వీళ్లెందుకు వచ్చారని అనుకుంటుంది. పెళ్లి దగ్గరపడుతుంది కదా? బోసి మెడతో అమ్మాయిని పెళ్లీ పీటలపై కూర్చోబెడితే బాగుండదని అందుకే బట్టలు, నగలు , డబ్బు తీసుకొచ్చామని అంటుంది శక్తి. అవి చూసి భానుమతి ఫ్యామిలీ షాక్ అవుతుంది. ఆ నగలు చూసి తాను వేసుకున్నట్లుగా మురిసిపోతుంది కుమారి. పెళ్లిలో మా స్థాయికి తగ్గట్లుగా నువ్వు కనిపించాలని శక్తి చెప్పడంతో భానుమతి షాక్ అవుతుంది.
మా తాహతుకు తగ్గట్లు నువ్వు వెలిగిపోవాలని.. అందుకే ఈ బట్టలు, నగలు తీసుకొచ్చానని చెబతుంది. పెళ్లి ఆగిపోయాక ఇంకా బట్టలు, నగలతో పనేముందని అనుకుంటుంది భానుమతి. గుడిలో ఏదో బంగారు నగల యాడ్ వున్న పాంప్లేట్ పార్ధుకి ఇచ్చావేమో కదా.. అలాంటి నగలే కావాలని ఆశ పడుతున్నావేమోనని అలాంటివే నీకోసం సెలెక్ట్ చేశాడని చెబుతుంది శక్తి. నాకు పెళ్లి ఇష్టం లేదని రాసిన మేటర్ ఆయన చదవలేదా అని బాధపడుతుంది భాను. పార్ధు నీ ఇష్టాయిష్టాల్ని ఇప్పటి నుంచే గౌరవించాలని అనుకుంటున్నాడు.. అందుకే ఇవన్నీ పంపించాడని అంటుంది శక్తి.
పెళ్లి ఖర్చుల కోసం కొంత డబ్బు కూడా పంపించాడని సంతోషమే కదా అని శక్తి అనగా.. ఇది నాకు సంతోషం కాదు, విచారమని ఫైర్ అవుతుంది భానుమతి. నా కలల్ని, ఊహల్ని కూల్చేసే విషాదమని అంటుంది. నా జీవితాన్ని నాశనం చేయడానికి మీరంతా చేస్తున్న ఓ కన్నీటి మోసమని చెబుతుంది భానుమతి. ఆమె మాటలతో అంతా షాక్ అవుతారు. మరోవైపు భానుమతికి నగలు ఇచ్చారా లేదా అని పార్ధు ఆలోచిస్తుంటాడు. నేను సెలెక్ట్ చేసిన నగలు భానుమతికి నచ్చుతాయో లేదోనని టెన్షన్గా ఉందని సూరితో చెబుతాడు పార్ధు. ప్రేమ రంగరించి మరి పట్టుచీరలు కొన్నావు కదా నచ్చుతాయిలే అంటాడు సూరి.
నేరుగా నేనే ఆ బంగారం, బట్టలు ఇచ్చి తన కళ్లలో మెరుపులు చూసుంటే బాగుండేదని అనిపిస్తుందని చెబుతాడు పార్ధు. పెళ్లి కాకుండానే భర్త పోస్టుని ఎంత బాధ్యతగా తీసుకున్నావ్ అని పార్ధుని ఆటపట్టిస్తాడు సూరి. భానుమతి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో అంతా షాక్ అవుతారు. ఈ నగల్ని చూడగానే నీ ముఖం వెలిగిపోతుందని అనుకున్నానని, ఇలా వెల వెల బోతోందని అడుగుతుంది శక్తి. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నామని తెలిసిపోయేలా ఉందని కోటి టెన్షన్ పడతాడు. ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా అని శక్తి అడగటంతో అంతా షాక్ అవుతారు.
మీతో కొంచెం మాట్లాడొచ్చా అని శక్తిని అడిగి లోపలికి తీసుకెళ్తుంది భానుమతి. దాంతో అంతా టెన్షన్ పడతారు. అంతా నాశనం అయిపోయిందని దాని భవిష్యత్కి అదే సమాధి కట్టుకుంటుందని ప్రమీలపై మండిపడతాడు కోటి. బంగారం లాంటి జీవితాన్ని ఎవరైనా ఇలా బలి చేసుకుంటారా అని అంటాడు. ఏం మాట్లాడాలని పిలిచావ్? పెళ్లి గురించి కానీ? మా పార్ధు గురించి కానీ? ఏమైనా కండీషన్స్ ఉన్నాయా అని ప్రశ్నిస్తుంది శక్తి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని భానుమతి చెప్పబోతుండగా ప్రమీల అడ్డుపడుతుంది.
ఇంత పెద్ద మనసుతో తనని కోడలిగా చేసుకుంటున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటానని తను మీకు చెప్పాలని అనుకుందని ప్రమీల అంటుంది . ఆ మాటలతో భానుమతి, వసులు బాధపడతారు. ఏది ఏమైనా ఇది విధి రాత అని.. ఎవ్వరూ తప్పించుకోలేని రాత అని చెప్పి బయల్దేరుతుంది శక్తి. కారు ఎక్కబోతూ శక్తికి ఎక్కడో డౌట్ కొడుతుంది. సూరితో పార్ధు చెప్పిన మాటలు విన్న భువన రగిలిపోతుంది. ఇంతలో శాంభవి వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. ఈ ఆగిపోయేలా ఒక ప్రణాళిక వేయాలని, నిన్నే ఈ కోడలిగా చేసుకునేలా ఈ బుర్రలకి కలగాలని శాంభవి అంటుండగా బలరామ్ విని కోపంతో ఊగిపోతాడు.
మన మధ్య అన్నాచెల్లెళ్ల బంధం ఉందని, మన పిల్లల మధ్య పెళ్లి బంధం ఏర్పడాలని లేదని అంటాడు. ఒకరి లాభం కోసం మరొకరి సంతోషాన్ని చిదిమేయడం పద్ధతి కాదని చెబుతాడు. పార్ధు పెళ్లి ఆగిపోయినా, ఈ సంతోషం నాశనమైనా నేను సహించనని వార్నింగ్ ఇస్తాడు బలరామ్. భానుమతి ఫోటో చూస్తూ మురిసిపోతాడు పార్ధు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











