Bhanumathi April 9h Episode: బలరామ్ చుట్టూ ఉచ్చు .. వీడియోతో శక్తి కుట్ర, కుమారికి మస్కా కొట్టిన భానుమతి
భానుమతి మెడలో పార్ధు తాళి కడుతుండగా పోలీసులు వచ్చి పెళ్లి ఆపమని అంటారు. ఆ మాటలతో షాకైన బలరామ్.. ఏం జరిగిందని అడుగుతాడు. పీటల మీదున్న అమ్మాయి మైనర్ అని చట్టరీత్యా మైనర్ను పెళ్లి చేసుకోవడం నేరమని చెబుతాడు ఎస్ఐ. ఈ విషయం నిజమేనా అని కోటిని బలరామ్ అడగ్గా నిజమేనని అంటాడు. నాలుగు రోజుల్లో అమ్మాయి మేజర్ అవుతుందని వదిలేయమని ఎస్ఐని అడుగుతాడు బలరామ్. ఈ పెళ్లి జరగనివ్వనని ఎస్ఐ మొండిపట్టు పట్టడంతో పాటు తన కాలర్ పట్టుకోవడంతో ఎస్ఐని లాగి పీకుతాడు బలరామ్.
దీంతో రగిలిపోయిన ఎస్ఐ .. బలరామ్ను అరెస్ట్ చేస్తాడు. తండ్రి కోసం పోలీస్ జీపు వెనుకాలే పరిగెడతాడు పార్ధు. పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో కోటి ఏడుస్తుంటాడు. నువ్వు నీ ఆటకాలు ఆపు , అసలు నీ కూతురి జాతకం వల్లే ఇలా జరిగిందని పార్ధు నానమ్మ మండిపడుతుంది. మీరూ వద్దు మీ పెళ్లి వద్దు ఇక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పడంతో కోటి తన కుటుంబాన్ని తీసుకుని వెళ్లిపోతాడు. ఇంతలో బలరామ్ను పోలీస్ స్టేషన్కు తీసుకొస్తాడు ఆ ఎస్ఐ. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక ఏప్రిల్ 9 తేదీ ఎపిసోడ్ 27 ఏం జరిగిందంటే?

మీరు జనాల ముందు పెద్ద జ్వాల అయ్యుండొచ్చని కానీ మా ముందు కాదని బలరామ్తో అంటాడు ఎస్ఐ. మేము కుండపోత వాన లాంటి వాళ్లమని, మీలాంటి ఎగిసిపడే మంటల్ని చిటికెలో చల్లారుస్తామని చెబుతాడు. నీలో ఉన్న పొగరుని, నీ ఉద్యోగంలో ఉన్న పవర్ని నా మీద చూపిద్దామని అనుకుంటున్నావా అని బలరామ్ మండిపడతాడు. ఈ బలరామ్ బలమేంటో నీకు తెలియడం లేదు.. ఈ బలరామ్ బలగం ఏంటో నీకు అర్ధం కావడం లేదని అంటాడు. ఎంత త్వరగా నన్ను తీసుకొచ్చావో, అంతే త్వరగా నేను బయటికి వెళ్తానని చెబుతాడు.
ఎవరో నాకు ఫోన్ చేస్తే ఆ పెళ్లిని ఆపడానికి వచ్చానని.. కానీ ఇప్పుడు సమస్య నాది, పంతం నాది, ప్రతీకారం నాది పోలీస్ వాడి మీద చేయ్యెస్తావా అని రగిలిపోతాడు ఎస్ఐ. కానిస్టేబుల్ను పిలిచి ఎఫ్ఐఆర్ ఫైల్ తీసుకురమ్ని చెబుతాడు. నువ్వేం చేసుకుంటావో చేసుకోమని అక్కడే కూర్చొంటాడు బలరామ్. ఇంతలో పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన పార్ధు, సూరి, దుర్గలను కానిస్టేబుల్స్ అడ్డుకుంటారు. మనం ఇలాగే పంతానికి పోతే సమస్య ఇంకా పెద్దది అవుతుందని లాయర్తో మాట్లాడదామని పార్ధుకి సలహా ఇస్తారు దుర్గ, సూరి.
పదిమందికి న్యాయం చెప్పే నా కొడుక్కి ఇంత అన్యాయమా అని బలరామ్ తల్లి బాధపడుతుంది. ఏనాడు ఎవరిని పల్లెత్తు మాట అనడం కానీ, ఎవరి మనసును నొచ్చుకునేలాగా ప్రవర్తించేవారు కాదని అంటుంది శారద. ఇలా జరుగుతుందని నాకెప్పుడో తెలుసని అంటుంది శాంభవి. ఆ మాటలతో బలరామ్ కుటుంబం షాక్ అవుతుంది. కయ్యానికైనా వియ్యానికైనా సమఉజ్జీలు కావాలని అంటారని చెబుతుంది. ఇదంతా మన దురదృష్టమని దానికి ఎదుటివాళ్లని నిందించడం కరెక్ట్ కాదని అంటుంది శారద.
అసలు సీతారాముల కళ్యాణం అయిపోగానే మనం మన ఊరికి వెళ్లిపోయుంటే ఈ సమస్య వచ్చేది కాదని అంటుంది శాంభవి. ఇంతలో శక్తి కొడుకు ఆమె దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడాలని బయటికి తీసుకెళ్తాడు. నువ్వు ఆడే చదరంగంలో కొత్త ఎత్తు వేయడానికి నా దగ్గర ఒక ఆయుధం ఉందని చెబుతాడు చరణ్. ఆయుధమా? ఏంటది? అని శక్తి అడగ్గా.. తాను ఫోన్లో తీసిన వీడియోను చూపిస్తాడు . అందులో ఎస్ఐని బలరామ్ కొట్టడం, ఆయనను అరెస్ట్ చేయడం ఉంటాయి.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలని.. 100 మందిలో పోయిన పరువు, సోషల్ మీడియా ద్వారా మొత్తం ప్రపంచానికి తెలియాలని అంటుంది. పెద్దనాన్నకి ఎంతగా అవమానం జరిగితే.. ఆయన్ను తొక్కడానికి ముందు ముందు అంతగా మనకి అవకాశం దొరుకుతుందని చెబుతుంది శక్తి. మీ బలరామ్ పెదనాన్న ఒక ఓడిపోయిన వీరుడిలా మారాలని, ఆ తర్వాత నేను అందుకోవాల్సిన స్థానం కోసం ఒక చక్కని ప్రణాళికను తయారు చేస్తానని అంటుంది శక్తి. సాయంత్రానికల్లా ఈ వీడియో ఎంత వైరల్ అవుతుందో నువ్వే చూస్తావని చెబుతాడు చరణ్.
పెళ్లి ఆగిపోయిన బాధతో ఇంటికొస్తారు కోటి, ప్రమీల. భానుమతి ఆ ఇంట్లోకి అడుగుపెడితే నా జీవితం కూడా బాగుపడుతుందని ఎన్నో కలలు కన్నానని అంటాడు కోటి. నా కూతురు కూడా సంతోషం, సుఖం లేకుండా బతికేయాలని రాసుందేమోనని బాధపడుతుంది ప్రమీల. ఇంతలో ఇరుగుపొరుగు వచ్చి భానుమతి పెళ్లి చెడిపోయిందటగా, కోటీశ్వరుల ఇంటికి వియ్యంకులం అయిపోతున్నామని కలలు కన్నారని సూటిపోటి మాటలంటారు. ఆ మాటలతో కుమారి వాళ్లపై మండిపడుతుంది.
నేను పోలీస్ స్టేషన్ దాకా వెళ్లొస్తానని.. బలరామ్ గారి మనసులో ఏముందో తెలిస్తేనే , మనం తర్వాత ఏం చేయాలో తెలుస్తుందని చెబుతాడు కోటి. వెళ్తూ వెళ్తూ.. భానుమతిని మాత్రం ఇల్లు దాటనీయొద్దని చెబుతాడు కోటి. ఆ మాటలతో భానుమతి, వసులు షాక్ అవుతారు. పెళ్లి ఆగిపోయింది కాబట్టి పరీక్ష రాయడానికి వెళ్లొచ్చుని అనుకున్నానని.. కానీ నానమ్మ ఉంటే ఎలా వెళ్లగలనని బాధపడుతుంది భానుమతి. ఇంతలో వసుకి ఓ ఐడియా వస్తుంది. 100 రూపాయల నోటుకి దారం తగిలించి బయటికి లాగుతుంది వసు. దానిని చూసి కుమారి.. దానిని ఎలాగైనా తీసుకోవాలని అనుకుని దాని వెనకే పరుగులు తీస్తుంది. ఇదే అదనుగా భానుమతి కాలేజ్ బ్యాగ్ తీసుకుని ఎగ్జామ్కి బయల్దేరుతుంది.
ఈ సంబంధం చేజారిపోకుండా కాపాడుకోవాలని అనుకుంటూ పోలీస్ స్టేషన్కి వెళ్తాడు కోటి. ఇంతలో ఓ స్వామిజీ కనిపించడంతో ఆయన దగ్గరికి వెళ్తాడు . ఆయన విబూది ఇవ్వడంతో దానిని తీసుకుని పార్ధు దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని అనుకుంటాడు కోటి. లాయర్ కోసం పార్ధు, సూరి, దుర్గలు ఎదురుచూస్తుంటారు. ఇంతసేపైనా నాన్నని బయటికి తీసుకురాలేకపోవడం నాకు అవమానంగా ఉందని అంటాడు పార్ధు. పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి బస్సు కోసం పరుగులు తీస్తూ వస్తుంది భానుమతి. టైంకి ఎగ్జామ్ సెంటర్కు చేరుకోవాలని.. లేదంటే పడిన శ్రమంతా వృథా అయిపోతుందని అనుకుంటుంది. తాను ఎలాగైనా పరీక్ష రాసి పాసై డాక్టర్ కావాలని దేవుడిని కోరుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











