Bhanumathi March 22nd Episode: భానుమతికి పార్ధు క్షమాపణలు.. పార్ధు మనసు విరిచేసిన ప్రమీల
భానుమతి గురించి, ఆమె తండ్రి గురించి బలరామ్కి చెబుతుంది శక్తి. అలగా వాడి కూతురి కోసం నా ఇంటి పరువును నేను దిగజార్చలేనని .. ఆ భానుమతికి మన ఇంటికి కోడలయ్యే అర్హత లేదని తేల్చిచెబుతాడు బలరామ్. తండ్రి తన ప్రేమను తిరస్కరించడంతో పార్ధు చాలా బాధపడతాడు. ఇంతలో ప్రమీల భోజనం తీసుకుని విశ్వనాథం ఇంటికి వస్తుంది.
ఆమెను చూసిన వెంటనే శాంభవి - భువనలు నానా మాటలు అంటారు. గొప్పింటి అబ్బాయిలను వలలో వేసుకోమని నీ కూతుళ్లకి ట్రైనింగ్ ఇచ్చావా అంటూ దెబ్బిపొడుస్తారు. మేం అలాంటి వాళ్లం కాదని, ఆత్మాభిమానంతో బతుకుతున్నామని అంటుంది ప్రమీల. నా కూతుళ్లకు సభ్యత, సంస్కారం నేర్పించానని శాంభవికి కౌంటర్ ఇస్తుంది ప్రమీల. వీరిద్దరి గొడవని బలరామ్ పెద్ద కోడలు విని పార్ధుకి చెబుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక మార్చి 22వ తేదీ ఎపిసోడ్ 12లో ఏం జరిగిందంటే?

కోటిని, కుమారిని తిడుతుంది ప్రమీల. మీ జన్మలకు ఎలాగూ సిగ్గు, శరం, మానం, అభిమానం ఏం లేవని నన్ను నా బిడ్డలనైనా మర్యాదగా బతకనివ్వారా అని మండిపడుతుంది. నువ్వు తీసుకున్న అప్పుని ఇంకెవరో కడుతుంటే అప్పూ తీరిపోతుందని చూస్తూ ఊండిపోయావా అంటుంది. నీ అప్పు తీరిపోయింది కానీ నా మీద నాబిడ్డ మీద నిందపడిందని చెబుతుంది ప్రమీల. నా కూతుళ్లని ఎరవేసి అప్పులు, అవసరాలు తీర్చుకుంటున్నాని అంటున్నారని బాధపడుతుంది. ఆ మాటలతో భానుమతి షాక్ అవుతుంది. నీ కడుపున పుట్టిన పాపానికి నా కూతుళ్లకి గౌరవంగా బతికే అదృష్టం లేదని కనీసం గుట్టుగా కూడా బతకనివ్వవా అని అంటుంది ప్రమీల.
నేనేం అడగలేదని.. ఆ అబ్బాయే ఇస్తానన్నాడని , ఇచ్చాడని చెబుతాడు కోటి. ఆ అబ్బాయి గొప్పవాడైనా ముక్కు ముఖం తెలియని వారి దగ్గర డబ్బులు ఎలా తీసుకుంటావని ప్రశ్నిస్తుంది. ఒక తాగుబోతు పెళ్లానికి వీధిలో గౌరవం ఉంటుందా అని ప్రశ్నిస్తుంది ప్రమీల. మా తిండి కోసం మేం తిప్పలు పడుతుంటే వెళ్లిన చోట విలువ లేకుండా చేస్తున్నాడని మండిపడుతుంది. తాగడం తలకు మించిన అప్పు చేయడం తప్పించి నీ బతుక్కి ఏం తెలుసని అంటూ కోటిని తిడుతుంది ప్రమీల. మీ నాన్న మనకిచ్చిన ఆస్తి ఏడవటం ఒక్కటేనని భానుమతితో అంటుంది.
నువ్వు ఎవరితోనూ మాట్లాడటానికి వీల్లేదని, మన చావేదో ఇక్కడే చద్దామని భానుమతికి వార్నింగ్ ఇస్తుంది ప్రమీల. కూతుళ్లని ఒళ్లో పడుకోబెట్టుకుని బాధపడుతుంది ప్రమీల. ఇంట్లో శాంభవి, భువన అన్న మాటలు గుర్తొచ్చి ఏడుస్తుంది. ఇంతలో పార్ధు కారు ఇంటి ముందుకు వచ్చి ఆగుతుంది. లోపలికి వస్తున్న పార్ధుని బయటే ఆగమని అంటుంది ప్రమీల. ఇలా కూడా మమ్మల్ని బతకనివ్వరా? మమ్మల్ని వీధిలోకి ఎందుకు లాగుతున్నారని ప్రశ్నిస్తుంది. మా ఇంట్లో వాళ్ల వల్ల మీకు అవమానం జరిగిందని, వారి తరపున నేను క్షమాపణ చెబుతున్నానని అంటాడు పార్ధు.
మీరు ఇక్కడికి మంచి ఉద్దేశంతోనే రావొచ్చు కానీ.. చీకటి పడ్డాక మీరు ఇలా వస్తే దానికి ఇంకో అర్ధం తీస్తారని అంటుంది ప్రమీల. నా గురించి, నా కూతురు గురించి తప్పుగా మాట్లాడే అవకాశం నేను ఇవ్వదలచుకోలేదని అంటుంది . మీ మంచితనాన్ని మరొకరికి పంచండి, మా పేదరికాన్ని మా ఇంట్లోనే ఉండనివ్వండి అంటుంది. దయ చేసి మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి అని చెబుతుంది ప్రమీల. మనం చేసే సాయం కూడా అవతలివాళ్లకు మేలుకు బదులు కీడు చేస్తుందని తెలుసుకోలేకపోయానని చెబుతాడు పార్ధు.
నా కుటుంబంలోని ఒకరి వల్ల మీ మీద నిందపడిందని, దానికి నేను కారణమైనందుకు చాలా బాధగా ఉందని నన్ను క్షమించమని అంటాడు పార్ధు. అంత పెద్ద మాటలెందుకులే బాబు, అందరికీ అన్నం పెట్టే వాళ్లు గడ్డి తినరని వాళ్లకి చెప్పండి అంటుంది ప్రమీల. మీరు ఈ ఊరిలో ఉన్నంతకాలం ఇటువైపు రావడం కానీ, నా కూతురితో మాట్లాడటం కానీ చేయకండి అని చెబుతుంది. పార్ధు వెళ్లిపోతుండగా భానుమతి పిలుస్తుంది. మా అమ్మ ఇలా మాట్లాడినందుకు మీరేం బాధపడకండి.. మా అమ్మ జీవితంలో ఎలాంటి సంతోషం లేదని , ఆరోగ్యం ఎప్పుడూ బాలేదని అంటుంది.
నన్ను మా చెల్లిని చదివించడానికి, పోషించడానికి కష్టపడుతోందని అలాంటి అమ్మను ఎవరో ఏదో అన్నారని చెబుతుంది భానుమతి. అందులో మీ తప్పేం లేదని, మీ మంచితనం నాకు తెలుసని, ఆ మంచితనమే మరో రకంగా కొందరికీ కనిపిస్తుందని అంటుంది . ఏమీ లేకపోయినా ఉన్నంతలో బతకడం మాకు తెలుసని, కానీ ఏ తప్పు చేయకపోయినా నిందలు మోస్తూ బతకడం మాకు తెలియదని చెబుతుంది భానుమతి. మరోసారి మా ఇంటికి రావొద్దని, మాతో మాట్లాడటానికి ట్రై చేయొద్దని.. మీ మనసును కష్టపెడితే క్షమించమని అంటుంది.
బాధపడుతూ ఇంటికొచ్చిన పార్ధుని శారద చూసి భోజనం తినడానికి పిలవడంతో నాకు వద్దని చెబుతాడు పార్ధు. ఇది చూసిన బలరామ్ కొడుకు దగ్గరికి వచ్చి భోజనం చేద్దామని పిలుస్తాడు. ఇంట్లో అందరికీ భోజనాలు వడ్డించినా పార్థు మాత్రం తినడు. దానిని గమనించిన శక్తి.. మీ నాన్న అధికారాన్ని , అహంకారాన్ని ఎప్పుడు దించాలా అని ఎదురుచూస్తున్నానని మనసులో అనుకుంటుంది. నీకు, ఆ భానుమతికి పెళ్లి చేసి మిమ్మల్ని నా చెప్పు చేతల్లో ఉంచుకోవాలని అనుకున్నానని.. కానీ ఈ ప్లాన్ ఫెయిల్ అయ్యిందని అనుకుంటుంది.
మరోవైపు.. పార్ధుకి ఇష్టమైన అమ్మాయిని పక్కదారి పట్టించి, పార్ధు దారిలో నా కూతురిని కలిపేలా చేస్తున్నానని అనుకుంటుంది శాంభవి. భోజనం చేయకుండా ఆలోచిస్తున్న పార్ధుని చూస్తుంది శారద. ఈ విషయాన్ని వెంటనే భర్తకి చెప్పడంతో బలరామ్ భోజనం చేయమని అంటాడు. పార్ధు ముద్ద నోట్లో పెట్టుకోబోతుండగా భానుమతి జ్ఞాపకాలు వెంటాడుతుండటంలో లేచి వెళ్లిపోతాడు. బయట కూర్చొని బాధపడుతుండగా పిల్లలు వచ్చి ఆడుకుందామని అడగ్గా వారిని కసురుకుంటాడు.
ఇంతలో దుర్గ వచ్చి ఇళ్లంతా నీకోసం వెతుకుతున్నానని చెబుతాడు. ఎందుకు ఏడుస్తున్నావని అడగ్గా గుండెల్లో భరించలేనంత బాధ ఉన్నప్పుడే ఇలా కన్నీళ్లు వస్తాయని అంటాడు పార్ధు. బలరామ్ వచ్చి కనీసం ఈ మజ్జిగైనా ఇవ్వమని శారదకు చెప్పడంతో ఆమె పార్ధుకి ఇవ్వబోతుండగా దానిని విసిరి కొడతాడు. రాత్రి బలరామ్ పాలు తాగుతుండగా చప్పగా ఉండటంతో పంచదార వేయడం మరిచిపోయావా అని అడుగుతాడు.
మీకు నచ్చినట్లుగా పాలు లేకపోయేసరికి ఒక్కరోజు సర్దుకోలేకపోయారు కదా.. జీవితమే నచ్చినట్లు లేకపోతే పార్ధు మాత్రం జీవితాంతం ఎలా సర్దుకుపోతూ బతుకుతాడని అంటుంది. మన జీవితంలో ఇష్టమైన మనుషులు, పరిస్ధితులు ఉండాలని అలా లేనప్పుడు ఆనందంగా బతకలేరని చెబుతుంది. అంటే పార్ధుకి ఇష్టమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయనా అని అడుగుతాడు బలరామ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











