Bhanumathi March 24th Episode: పార్ధు కన్నీటికి కరిగిపోయిన బలరామ్.. కొడుకు కోసం సర్ప్రైజ్, షాక్లో శాంభవి
నీ వల్ల నాకు , నా కూతుళ్లకు సమాజంలో గౌరవం లేకుండా పోతోందని కోటిని తిడుతుంది ప్రమీల. ఆ అబ్బాయి అప్పు తీరిస్తే అలా చూస్తూ ఉండిపోతావా అంటూ మండిపడుతుంది. నువ్వు ఎవరితో మాట్లాడటానికి వీల్లేదని, మన చావేదో ఇక్కడే చద్దామని భానుమతికి వార్నింగ్ ఇస్తుంది ప్రమీల. ఇంతలో పార్ధు భానుమతి ఇంటికి వస్తాడు. పార్ధుని చూడగానే నువ్వు ఈ టైంలో మా ఇంటికి రావొద్దు బాబు , ఎవరైనా చూస్తే ఒకటికి నాలుగు పుట్టిస్తారని చెబుతుంది.
తన కుటుంబ సభ్యుల చేతుల్లో అవమానం జరిగినందుకు పార్ధు క్షమాపణలు చెబుతాడు. మీరు ఈ ఊరిలో ఉన్నంత కాలం మా ఇంటికి రావడం కానీ, మా అమ్మాయితో మాట్లాడటం కానీ చేయొద్దని పార్ధుకి ప్రమీల వార్నింగ్ ఇస్తుంది. మీ మనసు నొప్పించి ఉంటే క్షమించమని భానుమతి కూడా చెబుతుంది. బాధపడుతూ ఇంటికి వచ్చిన పార్ధుని శారద భోజనానికి పిలుస్తుంది. కానీ మధ్యలోనే లేచి వెళ్లిపోతాడు పార్ధు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక మార్చి 24వ తేదీ ఎపిసోడ్ 13లో ఏం జరిగిందంటే?

జీవితం నచ్చినట్లుగా లేకుంటే పార్ధు జీవితాంతం ఎలా సర్దుకుపోయి బతుకుతాడని బలరామ్తో అంటుంది శారద. పంచదార వేసుంటే ఈ పాలు పక్కనపెట్టే పరిస్ధితి వచ్చేది కాదని, జీవితం కూడా అంతేనని చెబుతుంది. మన జీవితంలో మనకి ఇష్టమైన మనుషులు ఉండాలని, మనకి ఇష్టమైన పరిస్దితులు ఉండాలని అంటుంది శారద. అలా లేనప్పుడు ఆనందంతో బతకలేరని చెబుతుంది. పార్ధుకి ఇష్టమైన అమ్మాయిని తీసుకొచ్చి పార్ధుకి పెళ్లి చేయమని అంటావా అని బలరామ్ ప్రశ్నిస్తాడు. ఆ అమ్మాయి కుటుంబం ఎలా ఉన్నా పర్లేదా అని నిలదీస్తాడు.
మీరు పరువు, ప్రతిష్టల కోసం ఎంత పాకులాడతారో కూడా నాకు తెలుసునని అంటుంది. స్నేహం చేసే మనుషులైనా, సంబంధం కలుపుకునే మనుషులైనా వాళ్లకి ఒక విలువ ఉండాలని కోరుకుంటారని చెబుతుంది శారద. బురదలో పెరిగిన కలువని తెచ్చి అమ్మవారి పాదాల దగ్గర పెడతాం కానీ ఆ బురద గురించి పట్టించుకోమని అంటుంది . కొంతమంది మనుషులు కూడా అంతేనని, వాళ్ల చుట్టూ ఉన్న బురద లాంటి పరిస్ధితుల్ని పట్టించుకుంటే కలువ లాంటి విలువైన మనుషుల్ని మనం కోల్పోతామని చెబుతుంది.
ఒక మనిషి కోసం మన కుటుంబం విలువ తగ్గించమంటావా అని బలరామ్ ప్రశ్నిస్తాడు. ఒక మనిషి సంతోషం మీద ఒక కుటుంబం సంతోషం ఆధారపడి ఉంటుందని చెబుతుంది. గౌరవ మర్యాదల కంటే జీవితమే గొప్పదని , పార్ధు బాధపడుతూ బతికితే మనం మాత్రం సంతోషంగా ఉండగలమా అని ప్రశ్నిస్తుంది శారద. భానుమతి బంగారు బొమ్మలా ఉందని, అన్నింటికి మించి ఆ అమ్మాయి పార్ధు జీవితంలోకి వస్తే సంతోషంగా ఉంటాడని చెబుతుంది. పార్ధుని నేను కనకపోయినా వాడి సంతోషాన్ని కోరుకునే తల్లినని , వాడి సంతోషం కన్నా నాకు ఏది కనిపించడడం లేదని మనసులో అనుకుంటుంది శారద.
భానుమతిని తలచుకుంటూ ఒంటరిగా బాధపడుతుంటాడు పార్ధు. ఇంతలో సూరి వచ్చి దక్కని దాని గురించి బాధపడొద్దని , ఏం జరిగినా మన మంచికేనని వదిలేయమంటాడు. వదిలేసేంత చిన్న విషయంలో అది నా మనసుకు అనిపించడం లేదని అంటాడు పార్ధు. చిన్నప్పుడు నీకు ఒక కారు బొమ్మ నచ్చితే అది దొరకలేదు, దీంతో మీ నాన్న వేరే బొమ్మ కొనిస్తే సరిపెట్టుకున్నావని గుర్తుచేస్తాడు. కోరుకున్నది దొరక్కపోతే సరిపెట్టుకుని బతకాలని చెబుతాడు సూరి.
అది బొమ్మ కాబట్టి సరిపెట్టుకున్నానని, ఇది ప్రేమ కాబట్టి సరిపెట్టుకోలేనని అంటాడు పార్ధు. పోనీ నీ ప్రేమ గురించి మరోసారి ఆలోచించమని మీ నాన్నతో చెబుదామా అని చెబుతాడు సూరి. పిల్లలను అర్ధం చేసుకునే తండ్రికైనా, అన్నింటికి అడ్డుపడే తండ్రికైనా ఇంకోసారి చెప్పొచ్చు.. కానీ మా నాన్న అలా కాదని అంటాడు పార్ధు. కావాల్సింది ఇస్తారు, మేం అడిగింది తెస్తారు, మొట్టమొదటిసారి వద్దు అని అంటున్నారని చెబుతాడు పార్ధు. అందుకే ఆయన మాటని ఎదిరించలేకపోతున్నానని అంటాడు.
అడిగితే కానీ అమ్మైనా అన్నం పెట్టదంటారు, ఒక్కసారి అడిగితే పోయేదేముంది అని చెబుతాడు సూరి. మాకేం కావాలో మా నాన్నకి తెలుసని, తెలియనివాళ్లయితే మళ్లీ మళ్లీ అడగొచ్చని అంటాడు పార్ధు. అలాగని ఇలాగే బతికేస్తావా అని సూరి అడగ్గా.. ఈ బాధ ఎన్ని రోజులు ఉంటుందో , ఇంకేలా మారుతుందో నాకు కూడా తెలియని చెబుతాడు పార్ధు. కానీ మా నాన్నకి ఇష్టం లేని పని చేయడం నాకు ఇష్టం లేదని తేల్చిచెబుతాడు. కొన్నేళ్ల తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే సంతోషాలు ఉండాలి కానీ, విచారాలు ఉండకూడదని అంటాడు సూరి.
మా నాన్న గర్వపడే పని నేను చేయకపోయినా పర్లేదు కానీ, మా నాన్న బాధపడే పని మాత్రం చేయనని అంటాడు పార్ధు. ప్రేమది ఏముంది నాలుగు రోజులకి గతంలోకి వెళ్లిపోతుంది.. కానీ నాన్న అలా కాదని చెబుతాడు. నాన్న అనే పుస్తకంలో నేనొక పేజీలాంటి వాడిని, అందులో సంతోషాలు రాసుకునేలా నేనుండాలి కానీ ఆయన చేదు జ్ఞాపకాలు రాసుకునేలా ఉండకూడదని అంటాడు. పార్ధు మాటలు దూరం నుంచి విన్న బలరామ్ బాధపడతాడు. ఉదయాన్నే శారద, పార్ధు చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంటాడు బలరామ్.
అందరినీ పిలిచి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అంటాడు బలరామ్. మన అందరం పార్ధుకి పెళ్లి చూపులు చూడటానికి వెళ్తున్నామని చెబుతాడు. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. పార్ధు బావని నాకిచ్చి పెళ్లి చేస్తానని అన్నావ్ ఏం జరుగుతోందని శాంభవిపై మండిపడుతుంది భువన. అన్నయ్య మనసులో ఇలాంటి ఆలోచన వస్తుందని నేను ఊహించలేదని అంటుంది శాంభవి. తెలిసో తెలియకో పార్ధుకి తను ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి చేస్తామని ఆశ కల్పించామని, అంతలోనే ఆ ఆశని చిదిమేసి వాడి మనసును గాయపరిచానని అంటాడు బలరామ్.
ఆ గాయానికి మందు పూయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉందని, అందుకే ఈ పెళ్లి చూపులని చెబుతాడు. గాయానికి మందు పూయడంలో తప్పులేదని, కానీ ఆ మందు సరైందో లేదో చూసుకోవాలి కదా అని అంటుంది శారద. మీ అందరి ప్రశ్నలకు సమాధానం చెప్పడానికే ఆ పెళ్లి చూపులని అంటాడు బలరామ్. పార్ధు దగ్గరికి వచ్చి నీకిష్టమే కదా అని అడగ్గా వద్దని చెప్పి నీ మనసు బాధపెట్టలేనని చెబుతాడు. ఇంతకీ అమ్మాయి ఎవరని శక్తి అడగ్గా.. ఎక్కడికో తర్వాత చెబుతానని ముందు రెడీ అవ్వండని అంటాడు బలరామ్.
మీరంతా సంతోషంగా వెళ్లే పనిలో నాకు , నా కూతురికి సంతోషం ఉండదని అందుకే ఈ పెళ్లి చూపులకి నేను, నా కూతురు రావడం లేదని అంటుంది శాంభవి. దానికి సరేనని అంటాడు బలరామ్. పెళ్లిచూపులు ఎక్కడ? ఎవరితో అనేది తెలియక బలరామ్ కుటుంబ సభ్యులంతా మాట్లాడుకుంటూ ఉంటారు. పార్ధు దగ్గరికి వచ్చి ఇప్పటికైనా బావతో నీ మనసులోని బాధను చెప్పమని అంటాడు సూరి. భానుమతి విషయంలో తీసుకున్న నిర్ణయానికి తలవంచుకున్నానని, ఇప్పుడు ఎవరితో పెళ్లయితే ఏంటని చెబుతాడు పార్ధు.
అందరూ కలిసి పెళ్లి చూపులకి బయల్దేరతారు. కారులో వెళ్తుండగా అంత డల్గా ఉన్నావేంటీ అని పార్ధుని ప్రశ్నిస్తాడు బలరామ్. పార్ధు మనసులో ఏముందోనని శారద అడగ్గా.. మా నాన్న నిర్ణయం తీసుకున్నాక దానిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని చెబుతాడు పార్ధు. నా మాట కాదనలేక వస్తున్నావా? మనస్పూర్తిగా వస్తున్నావా? అని బలరామ్ అడగ్గా.. మీరు రమ్మన్నారు, వస్తున్నాను అంటాడు . మీరు ఏ అమ్మాయి మెడలో తాళి కట్టమన్నా కడతానని పార్ధు చెప్పగా.. చూశాక కాదనకూడదని అంటాడు బలరామ్. ఇంతలో కారు పెళ్లికూతురు ఇంటికి వస్తుంది. పార్ధుని పిలిచి ఈ ఇంట్లోనే ఆ అమ్మాయి ఉండేదని బలరామ్ చెప్పగా.. పార్ధు ఆ ఇంటి వైపు చూస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











