Bhanumathi May 14th Episode: రైతు కుటుంబాన్ని కాపాడిన బలరామ్.. భానుమతి చప్పట్లు, రగిలిపోతున్న శక్తి
బలరామ్, దుర్గలు లెక్కలు చూస్తుండగా కానిస్టేబుల్ ఇంటికొస్తాడు. నన్ను రమ్మన్నారని కానిస్టేబుల్ అడగ్గా.. పార్ధు వచ్చి ఆ రోజు పోలీసులకు ఫోన్ చేసింది ఎవరో కనుక్కోమని అతని చేతిలో డబ్బు పెడతాడు. ఇదంతా చూసిన భువన, భానుమతిలు వణికిపోతారు. భానుమతి విషయం బయటికొస్తే ఆమెను ఇంటి నుంచి గెంటేస్తారని, పార్ధుకి మళ్లీ పెళ్లి చేస్తారని శక్తి టెన్షన్ పడుతుంది. కొత్తగా వచ్చే అమ్మాయి తన మాట వినకపోతే కష్టమని భావించి కానిస్టేబుల్కు డబ్బులు ఇచ్చి భానుమతి మేటర్ బయటికి రావొద్దని వార్నింగ్ ఇస్తుంది.
పోలీసులకు ఫోన్ చేసింది నేనే అని తెలిస్తే జీపబ్బాయి తనను ద్వేషిస్తాడని, ఈ కుటుంబం కూడా నన్ను బయటికి గెంటేస్తుందని బాధపడుతుంది భానుమతి. ఇంతలో పార్ధు వచ్చి ఏం జరిగింది? ఎందుకలా ఉన్నావ్? అని ప్రశ్నించగా అమ్మ గుర్తుకొచ్చిందని కవర్ చేస్తుంది. బ్యాగ్లో దాచిన డబ్బు కనిపించకపోవడంతో దుర్గ టెన్షన్ పడతాడు. ఆ డబ్బు నేనే తీశానని, ఏదో ఒక లెక్కలో రాసేయమని అంటుంది శక్తి. పార్ధు - భానుమతిల ఫస్ట్ నైట్కి మరోసారి ఏర్పాట్లు చేస్తుంది దుగ్గిరాల ఫ్యామిలీ. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక మే 14వ తేదీ ఎపిసోడ్ 57లో ఏం జరిగిందంటే?

భానుమతి ఒంటిపై నగలు తీస్తుండగా ఓ హారం చూసి పార్ధు బాధపడతాడు. ఏం జరిగింది? ఆ నగలు అలా చూస్తున్నావని అడుగుతుంది భానుమతి. ఈ నగలు మా అమ్మవి అని చెప్పడంతో వాటిని కళ్లుకు అద్దుకుంటుంది భాను. అత్తయ్యగారి నగలని తెలియక ఈ నగల వల్ల తప్పుగా మాట్లాడానని అంటుంది. ఈ నగల్ని అత్తయ్య గారు రోజూ వేసుకునే వారా అని ప్రశ్నిస్తుంది భానుమతి. రోజూ కాదు కానీ అప్పుడప్పుడు వేసుకునేదని పార్ధు చెప్పడంతో.. ఈ నగలు అత్తయ్య గారిని కూడా ఇబ్బంది పెట్టి ఉంటాయని, కాకపోతే బామ్మగారు మాత్రం రోజూ వేసుకోమని నన్ను ఇబ్బంది పెడుతున్నారని మండిపడుతుంది.
ఈ నగల్ని ఏమంటారో ఒక్కో దాని గురించి వివరిస్తాడు పార్ధు. ఇంతలో భానుమతి పార్ధు ఒడిలో నిద్రపోతుంది. తన ఫస్ట్ నైట్ మరోసారి వేస్ట్ అయిపోయిందని పార్ధు బాధపడతాడు. భార్యను చూసుకుని మురిసిపోతూ ఆమెకు ఇబ్బంది కలగకుండా అలాగే కూర్చొని నిద్రపోతాడు. ఉదయాన్నే నిద్రలేచి చూసేసరికి పార్ధు కూర్చొని ఉండటంతో భానుమతి బాధపడుతుంది. నా నిద్ర ఎక్కడో పాడవుతుందోనని రాత్రంతా జీపబ్బాయి మంచానికి ఆనుకుని పడుకున్నాడు చాలా చాలా మంచోడని, నా బంగారమని అంటుంది. ఆ మాటలు విన్న పార్ధు మురిసిపోతాడు.
నగలు వేసుకోకుండా బయటికి వెళ్తున్న భానుమతిని ఆటపట్టిస్తాడు పార్ధు. బయటికి అడుగుపెట్టగానే బయట బామ్మగారు కనిపించడంతో భయపడి తిరిగి పార్ధుని పట్టుకుంటుంది. బామ్మకి చెప్పేస్తానని భాను వెళ్లగా వెనక్కి లాగుతాడు పార్ధు. నువ్వు ఆ మాటలు పడినా నువ్వు బాధపడితే నేను బాధపడతానని చెబుతాడు పార్ధు. మీరు బాధపడటం నాకిష్టం లేదని మీకోసం నగలు వేసుకుంటానని చెబుతుంది భానుమతి. నగలు వేసుకుని బయటికొచ్చిన భానుమతిని చూసిన బామ్మగారు రగిలిపోతూ ఉంటారు.
భానుమతి పదే పదే లోపలికి బయటికి వస్తుండటంతో గదిలో నుంచి బయటికి రాలేకపోతున్నావా అని మండిపడుతుంది బామ్మగారు. ఆమె చెప్పే విధానం చూసిన భానుమతికి నవ్వు వచ్చేస్తుంది. ఇంటికొచ్చిన కొత్త కోడలు బారెడు పొద్దెక్కేవరకు లేవకుండా ఉంటుందా అని ఫైర్ అవుతుంది. ముగ్గువేయడానికి వెళ్తున్న స్వాతిని ఆపి.. ఆ ముగ్గు నువ్వు వేయమని భానుమతితో చెబుతుంది. ఇవాళ భానుమతే వాకిలి ఊడ్చి ముగ్గు పెడుతుందని అంటుంది బామ్మగారు. ఆ మాటలతో భానుమతి షాక్ అవుతుంది.
ముగ్గుపెట్టడం నీకు రాదా? అని బామ్మగారు ప్రశ్నించడంతో వచ్చని అబద్ధం చెబుతుంది భానుమతి. అయితే నీకెంత బాగా వచ్చో నేను కూడా చూస్తానని అంటుంది బామ్మగారు. దాంతో బయటికొచ్చి వాకిలి ఊడ్చి, కళ్లాపు చల్లుతుంది. ముగ్గు వేయడం రాకపోవడంతో ఏం చేయాలో అర్ధం కాక టెన్షన్ పడుతుంది భానుమతి. ఏదో ఒకటి వేసేస్తానని చెప్పి వేసేస్తుంది. ఇంతలో బామ్మగారు వచ్చి ముగ్గు పెట్టడం అయిపోయిందా అని అడగ్గా.. అయిపోయింది కావాలంటే చూడండి అని అంటుంది.
ఆడికారులోని రింగులన్నీ ముగ్గుగా వేయడంతో అది చూసిన బామ్మగారు షాక్ అవుతుంది. ముగ్గు పెట్టడం మీ అమ్మ నేర్పించలేదా? అని మండిపడుతుంది. కనీసం వంటైనా వచ్చా? రాదా అని అడుగుతుంది. అయితే వెళ్లి వంట చేయమని చెప్పడంతో భానుమతి సరేనని అంటుంది. బలరామ్, శారదలు మాట్లాడుకుంటూ ఉండగా అటు నుంచి శక్తి వస్తుంది. ఆమెను పిలిచి మీ ఇద్దరితో చరణ్ విషయం మాట్లాడదామని అనుకుంటున్నానని చెబుతాడు బలరామ్. ఆ మాటలతో శక్తి టెన్షన్ పడుతుంది.
పార్ధుకి పెళ్లి అయిపోయింది కదా? చరణ్కు పెళ్లి చేయకుండా ఎందుకు ఆలస్యం చేస్తున్నారని నలుగురు ప్రశ్నలు వేస్తున్నారని చెబుతాడు బలరామ్. నలుగురు నాలుగు మాటలు అనుకోకముందే చరణ్కు కూడా పెళ్లి చేస్తే బాగుంటుందని అంటాడు. పార్ధు అంటే ఎవరినో ఇష్టపడితే, నా కొడుక్కి తొందరపడి ఎవరో ఒకరిని కట్టబెట్టలేనని అనుకుంటుంది శక్తి. ఇప్పటికిప్పుడు మనకి సరితూగే అమ్మాయి దొరుకుతుందా అని బలరామ్ను ప్రశ్నిస్తుంది శక్తి. ఇంతలో దుర్గ కోపంతో ఇంటికి వస్తాడు.
వీళ్లు మన దగ్గర తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టలేదని.. అది అసలు కంటే ఎక్కువైందని అందుకే పొలం రాయించుకుందామని వచ్చానని చెబుతాడు దుర్గ. అది తప్పని వాళ్ల పత్రాలు వాళ్లకి ఇచ్చేయమని చెబుతాడు బలరామ్. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. ఈయనకి అప్పు కట్టే ఓపిక లేదని, పొలం చూసుకునేంత స్తోమత లేదని భార్యాభర్తలిద్దరూ చెప్పడంతో దుర్గకి చెప్పి 25 లక్షల రూపాయలు తీసుకొచ్చి వాళ్లకి ఇవ్వమంటాడు. ఇదంతా చూసిన భానుమతి చప్పట్లు కొట్టడంతో అంతా షాక్ అవుతారు.
నలుగురి దృష్టిలో తన భర్త రాక్షసుడు అయ్యాడని కోపంతో రగిలిపోతుంది శక్తి. తర్వాత చరణ్ని పిలిపించి ఈ పొలాన్ని పార్ధు పేరిట రిజిస్ట్రేషన్ చేయించమని చెబుతాడు బలరామ్. కిచెన్లో వంట ఎలా చేయాలో తెలియక టెన్షన్ పడుతున్న భానుమతిని చూసి పార్ధు ఏం జరిగిందని అడుగుతాడు. నాకు వంట రాదని చెప్పడంతో పార్ధు వెళ్లి ఫస్ట్ నైట్ రోజున ఇచ్చిన గిఫ్ట్ని తీసుకొచ్చి ఇస్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











