Bhanumathi May 16th Episode: శారదను బాధపెట్టిన పార్ధు.. భాను వంటకి బలరామ్ ఫ్యామిలీ ఫిదా, రగిలిపోతున్న భువన
భానుమతికి ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన పార్ధు దాని సాయంతో మీ అమ్మకి ఫోన్ చేసి చేపల పులుసు ఎలా వండాలో నేర్చుకోమని చెబుతాడు. భర్త చెప్పినట్లుగానే ప్రమీలకి ఫోన్ చేసి వంట చేస్తుండగా భువన దానిని వీడియో తీస్తుంది. బలరామ్ కాలి కింద చెప్పులా ఎన్నాళ్లు ఉంటావని భర్తపై మండిపడుతుంది శక్తి. ఇకపై కథ నేను నడుపుతాను, నేను చెప్పినట్లుగా నడవమని భర్తకి, పిల్లలకి చెబుతుంది శక్తి.
బాబూరావు ఫోన్ చేయడంతో వాడిని వెతుక్కుంటూ వెళ్తుంది భువన. నీకు మూడు లక్షలు ఇస్తాను జన్మలో నాకు కనిపించొద్దని వార్నింగ్ ఇస్తుంది భువన. ఇంతలో పార్ధు అటుగా వెళ్తూ బాబూరావుని చూసి ఆగుతాడు. పోలీసులకు ఫోన్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసుకునే ప్రయత్నాలు గట్టిగా చేయమని చెబుతాడు. తన ముందు ఊయల ఊగుతున్న భానుమతిని చూసి రగిలిపోయిన శక్తి.. స్వాతిని పిలిచి తిడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక మే 16వ తేదీ ఎపిసోడ్ 59లో ఏం జరిగిందంటే?

వడ్డీ డబ్బులు వసూలు చేయడానికి పిన్ని వాళ్లింటికి వెళ్తాడు పార్ధు. నువ్వు రెండో పెళ్లి చేసుకున్నావా? అని ఒక వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతాడు పార్ధు. మీ నాన్నలాగే నేను కూడా రెండో పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో పార్ధు రగిలిపోతాడు. మీరు ఒప్పుకోకపోయుంటే మీ నాన్న కూడా రెండో ఇల్లు బ్యాచే కదా అని అనడంతో పార్ధు ఆవేశం కట్టలు తెంచుకుని వెళ్లిపోతాడు. కోపంగా ఇంటికొచ్చిన పార్ధుని చూసి శారద ఏం జరిగిందని అడుగుతుంది. ఆమెను అడ్డు తప్పుకోమని సూరి చెప్పడంతో శారద పక్కకి జరుగుతుంది. ఇదంతా చూసిన భానుమతి కూడా చాలా బాధపడుతుంది.
పేపర్ చదువుతున్న బలరామ్ దగ్గరికి వెళ్లి వడ్డీ డబ్బులు ఇచ్చి కోపంగా వెళ్లిపోతాడు పార్ధు. దీంతో ఏం జరిగిందని సూరిని అడుగుతాడు బలరామ్. నా కొడుకు మనసును ఎవరో నొప్పించారని నేను తెలుసుకోలేనని అనుకుంటున్నావా? అని అంటాడు బలరామ్. ఏం జరిగిందో చెప్పమని అడిగేసరికి.. సూరి జరిగినదంతా చెబుతాడు. జరిగినదంతా ఆలోచిస్తూ పార్ధు కోపంతో రగిలిపోతాడు. భర్తని అలా చూసిన భానుమతి ఏదో జరిగిందని అనుకుంటుంది. నేను బాధగా ఉన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్గా నన్ను ఎంత సపోర్ట్ చేస్తాడో.. నేను కూడా అలాగే వెళ్లి సపోర్ట్ చేయాలని అనుకుంటుంది.
జీపబ్బాయి ముఖం చాలా కోపంగా ఉందని పార్ధుతో అంటుంది. ఏం లేదని పార్థు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా పదే పదే అడుగుతుంది భానుమతి. మీరు చెప్పకపోయినా ఆ కోపం ఎవరి మీదో నాకు తెలుసని అంటుంది. అత్తయ్య మీదే కదా?.. శారద అత్తయ్య కూడా మీలాగే చాలా మంచిదని చెబుతుంది భానుమతి. ఎందుకో మీరు అత్తయ్యని సరిగా అర్ధం చేసుకోలేదని అనడంతో పార్ధు కోపంగా భాను మీద చెయ్యెత్తుతాడు. అతని కోపం చూసి భానుమతి వణికిపోతుంది. మరోసారి నువ్వు ఇలా మాట్లాడితే బాగుండదని చెప్పి పార్ధు వెళ్లిపోతాడు.
జీపబ్బాయిని ఇంత కోపంగా ఎప్పుడూ చూడలేదని.. పరిచయం అయిన దగ్గరి నుంచి ఎప్పుడూ నాతో ఇంత కోపంగా లేడని, అత్తయ్య పేరు వింటేనే అంత కోపం ఎందుకో అర్ధం కావడం లేదని ఆలోచిస్తుంది భానుమతి. ఇంతలో బామ్మగారు వచ్చి పిలవడంతో ఉలిక్కిపడి లేస్తుంది. వంట చేశావా? తినేలాగే చేశావా? అని అడుగుతుంది పెద్దావిడ. తినేలాగే చేసినప్పుడు తినడానికి అందరినీ పిలిచి వడ్డించకుండా ఏం చేస్తున్నావని మండిపడుతుంది. పార్ధు వంక చూస్తున్న భానుమతిని అలాగే చూస్తుంది బామ్మగారు.
భానుమతి మీద కోప్పడ్డానని బాధపడ్డ పార్ధు.. సారీ చెబుతాడు. మీరు కోప్పడటానికి కారణం ఉంటుంది కదా? నేనే తెలుసుకోకుండా వచ్చానని చెప్పడంతో పార్ధు నవ్వేస్తాడు. నా చేతి వంట రుచి చూద్దురు గానీ అని పిలవడంతో పార్ధు లోపలికి వెళ్తుండగా బలరామ్ ఎదురుపడతాడు. నీకు నచ్చిన అమ్మాయితో పెళ్లి చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావని నీ ఇష్టాన్ని కాదనకుండా ఈ పెళ్లి చేశానని చెబుతాడు బలరామ్. ఇప్పుడు నీకు భార్య వచ్చింది.. రేపు పిల్లలు కూడా వస్తారు, నువ్వు నీ భార్యాబిడ్డలతో ఎప్పుడూ ఆనందంగా ఉండాలని అంటాడు.
జీవితంలో కొన్ని విషయాలు మనకి వెంటనే అర్ధమవుతాయని, కొన్ని తర్వాత అర్ధమవుతాయని, కొన్ని ఎప్పటికీ అర్ధం కావని, కొన్నింటికి అర్ధాలే ఉండవని చెబుతాడు బలరామ్. కానీ ఈ జనాలు వారికి తోచిన అర్ధాలు జోడిస్తుంటారని అంటాడు. వినపడ్డ ప్రతిదానికి విలువ ఇవ్వకూడదని సలహా ఇస్తాడు. ఈరోజు స్పెషల్ ఏంటీ అని దుర్గ అడగ్గా.. చేపల పులుసు అని, కొత్త కోడలు చేసిందని చెబుతుంది శక్తి. ఎవ్వరి సాయం తీసుకోకుండా కష్టపడి ఒక్కటే కూర చేసిందని భానుమతిని మెచ్చుకుంటుంది జయంతి. కాసేపు ఆగితే వీడియో ప్లే చేసి అందరి నోర్లు మూయిస్తానని అనుకుంటుంది భువన.
అందరూ ముద్ద నోట్లో పెట్టుకుంటూ ఉండగా భాను దేవుడికి దండం పెట్టుకోవడంతో బలరామ్ ఫ్యామిలీ ఆశ్చర్యంగా చూస్తుంది. ఈ కూర అందరికీ నచ్చాలి కదా అని దేవుడికి దండం పెట్టుకున్నానని అంటుంది భానుమతి. అలాగే చేపల కూర తిన్న తర్వాత మాకు ఏం కాకూడదని కూడా దండం పెట్టుకోమని సెటైర్లు వేస్తుంది చిత్ర. చేపల కూర చాలా బాగుందని బలరామ్ మెచ్చుకుంటాడు. ఇకపై చేపల కూర తినాలని అనిపించినప్పుడు భానుమతితోనే వండించాలని అంటాడు. ఆ మాటలతో భువన, శాంభవి రగిలిపోతారు.
భానుమతిని అందరూ పొగడటం చూసిన శిల్ప.. ఆ వీడియోను వెంటనే ప్లే చేయమని భువనతో అంటుంది. అందరూ భానుకి గట్టిగానే మార్కులు వేశారని, అత్తయ్య గారికి నచ్చిందా? లేదా? అని అడుగుతుంది శక్తి. ఈ పిల్ల ముగ్గు వేయడం చూసి ఒళ్లు మండింది కానీ, చేపల కూర బాగానే ఉందని బామ్మగారు మెచ్చుకుంటుంది. ఆ మాటలతో భానుమతి చాలా సంతోషిస్తుంది. చేపల కూరే కాదు.. రోజూ అన్ని వంటలూ ఈ పిల్లతోనే చేయించండి అని పెద్దావిడ చెప్పడంతో భానుమతి షాక్ అవుతుంది. రోజూ మా అమ్మకి ఫోన్ చేసి వంటలు వండాలంటే చాలా కష్టమని నోరు జారుతుంది భానుమతి. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. అన్నయ్య కోడలికి ముగ్గులే కాదు వంటలు కూడా రావని శాంభవి అంటుంది. ఫోన్లో వాళ్ల అమ్మ సలహా, సూచనలతో వంట చేసిందని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











