Bhanumathi May 3rd Episode : భానుమతిని నిలదీసిన వేదవతి.. కూతురి గురించి ప్రమీల ఆందోళన, భార్యపై పార్ధు ప్రేమ
వేదవతిని చూడగానే బలరామ్ కుటుంబం ఎంతో సంతోషిస్తుంది. తర్వాత భానుమతిని వేదవతికి పార్ధు పరిచయం చేస్తాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలివని ఎన్ని అడ్డంకులు ఎదురైనా నీ పెళ్లి పార్ధుతో జరిగిందని, గొప్ప కుటుంబానికి కోడలిగా అడుగుపెట్టావని చెబుతుంది వేదవతి. నీ జీవితాన్ని నాశనం చేయడానికి ఎవరో చాలా గట్టిగా ప్రయత్నించారని చెప్పడంతో భానుమతి, భువనలు వణికిపోతారు. ప్రమీల బాధపడుతుండగా వసు వచ్చి ఏం జరిగిందని అడగటంతో మీ అక్కని ఇక్కడంతా నెత్తిన పెట్టుకుంటున్నారని.. కానీ పెళ్లి ఆపింది? పోలీసులకు ఫోన్ చేసింది? భానుమతేనని తెలిస్తే పాతేస్తారని చెబుతుంది ప్రమీల.
ఈ మాటలన్నీ వేదవతి విని రగిలిపోతుంది. బలరామ్ కుటుంబ సభ్యులు పార్ధు, భానుమతి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తారు. పూజ సమయంలో పార్ధు భుజంపై నిద్రపోతుంది భానుమతి. దీంతో అంతా నవ్వుకుంటారు. తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకుంటుంది కొత్త జంట. మందు కొట్టడానికి డబ్బులు లేక పార్ధు దగ్గరికి వస్తాడు కోటి. అతనికి డబ్బులిచ్చి తక్కువ తాగమని చెబుతాడు పార్ధు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక మే 3వ తేదీ ఎపిసోడ్ 48లో ఏం జరిగిందంటే?

పూజ ముగిసి భోజనం చేయడానికి భానుమతి కూర్చుంటుండగా బలరామ్ తల్లి అడ్డుకుంటుంది. రోజువారీ జీవితంలో ఆచారాలు , సాంప్రదాయాలు వదిలేశారని.. కనీసం ఇంట్లో పండగలు, పబ్బాలు జరిగినప్పుడైనా కట్టుబాట్లు ఫాలో అవ్వాలని చెబుతుంది. మా కాలంలో భర్తలు తిన్నాక అదే పళ్లెంలో భార్యలు తినేవారని, కాలం మారిందని ఆచారాలు కూడా ఆవిరి అయిపోయాయని మండిపడుతుంది. పార్ధు తిన్నాక అదే ఆకులో నువ్వు తినాలని బలరామ్ తల్లి చెప్పడంతో భానుమతి సరేనని అంటుంది.
ఎంగిలి ఆకులో భోజనం చేయడమేంటీ? అసలు వీళ్ల ఆచారాలేంటోనని టెన్షన్ పడుతుంది భానుమతి. చిత్రను పంపి ఆకు తీసుకురమ్మని చెబుతుంది పెద్దావిడ. అందులో అన్ని వడ్డించమని భానుమతికి ఆర్డర్స్ వేస్తుంది. బలరామ్ తల్లిపై కోపంతో ఆమెనే చూస్తుంటుంది భానుమతి. అరిటాకులో అన్నం వడ్డిస్తుండగా అది కింద పడటంతో మరోసారి భానుమతికి క్లాస్ తీసుకుంటుంది పెద్దావిడ. నువ్వు కంగారు పెట్టొద్దని , చిన్న చిన్న తప్పులు సహజమని భార్యని వెనకేసుకొస్తాడు పార్ధు. భర్త అన్నం తినడం చూసిన భానుమతి ఆ ఆకులో తినడానికి ఇబ్బంది పడుతుంది.
పార్ధు చేయి కడుక్కోవడానికి భానుమతి నీళ్లు ఇస్తుంది. ఆమె ముఖంలో ఏదో బాధ ఉండాన్ని పార్ధు గమనించి ఏం జరిగిందని అడుగుతాడు. ఒకరు తిన్న ఆకులో తినడానికి ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుందని, నువ్వు ఇబ్బంది పడుతున్నావని నాకు తెలుసు అంటాడు పార్ధు. కాదు కూడదు అంటే పెద్దవాళ్లని ఎదిరించామని వాళ్లు బాధపడతారని చెబుతాడు. అందుకే ఆకులో నేను తినేటప్పుడు ఓ వైపు మాత్రమే తిన్నానని, నువ్వు తినేటప్పుడు ఖాళీగా ఉన్న పక్క తినమని చెబుతాడు. భర్త అన్నాక భార్య ఇబ్బందిని అర్ధం చేసుకోవాలి కదా అనడంతో భానుమతి సంతోషిస్తుంది ఈ మాటలను వేదవతి వింటుంది. డైనింగ్ టేబుల్ వద్ద భానుమతికి వడ్డిస్తారు శారద, శక్తి.
బలరామ్ కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటూ ఉండగా వేదవతి వస్తుంది. గతంలో నీలో కనిపించిన ఉత్సాహం ఇప్పుడు నీలో కనిపించడం లేదని అంటుంది. ఎప్పుడూ ఒకేలా ఉండం కదా వేదవతి అని అంటాడు బలరామ్. మన మీద ఏదైనా బలమైన ఒత్తిడి పడినప్పుడు కృంగిపోవడం వేరు.. పెళ్లి చెడిపోవడం, పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడం, అందరి ముందు నువ్వు దోషిలా నిలబడటం ఇవన్నీ నీ మనసు మీద నీకు తెలియకుండానే ఒత్తిడి కలిగించాయని అంటుంది వేదవతి. ఆమె మాటలతో శాంభవి, భువన, భానుమతిలు వణికిపోతారు. అటు తిరిగి ఇటు తిరిగి టాపిక్ మళ్లీ ఆ అమ్మాయి దగ్గరికే వెళ్తుందని భువనతో శాంభవి అంటుంది. నువ్వు అనవసరంగా టెన్షన్ పడొద్దని మన పేర్లు బయటికి రావని చెబుతుంది భువన.
తప్పు జరిగింది, నేను అందరి ముందు తలదించుకోవడం కూడా జరిగిపోయింది.. ఆ బాధ ఎప్పటికీ ఉంటుందని అంటాడు బలరామ్. కనీసం నాకు అవమానం కలిగించడానికి ప్రయత్నించిన అమ్మాయి ఎవరో తెలిస్తే మనసుకి కాస్తయినా తృప్తిగా ఉండేదని చెబుతాడు బలరామ్. ఆ అమ్మాయి ఎవరో తెలియకపోవడం వల్లే కాస్త అసంతృప్తిగా ఉందని అంటాడు. భానుమతి భోజనం చేస్తుండగా వేదవతి కోపంగా ఆమె వైపు చూస్తుండటంతో భాను టెన్షన్ పడుతుంది. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవడానికి పార్ధు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాడని చెబుతాడు బలరామ్. కానీ తనెవ్వరో ఇంకా తెలియడం లేదని బాధపడతాడు.
నేనే పోలీసులకు ఫోన్ చేసిన అమ్మాయినని వేదవతి గారికి తెలుసా అని టెన్షన్ పడుతుంది భానుమతి. ఆ అమ్మాయి ఖచ్చితంగా దొరుకుతుందని, కానీ అదే మనసులో పెట్టుకుని కృంగిపోవడం నీ ఆరోగ్యానికి మంచిది కాదని అంటుంది. మన తలరాతలు బాగానే ఉంటాయని, కానీ కొందరి జాతకాలు మన జీవితాల్లోకి అడుగుపెడితే మన తలరాతలు కూడా మారిపోతాయని బలరామ్ తల్లి నానామాటలు అంటుంది. ఏ ముహూర్తంలో ఈ భానుమతిని మన పార్ధు ప్రేమించడం మొదలుపెట్టాడో కానీ మనకు దరిద్ర్యం పట్టుకుందామని చెబుతుంది. ఆ మాటలతో భానుమతి, ప్రమీలలు బాధపడతారు.
అనవసరంగా మన జీవితానికి, తన జాతకానికి ఎందుకు ముడిపెడుతున్నావని బలరామ్ ఫైర్ అవుతాడు. పెద్దావిడ మాటలతో ప్రమీల, కుమారి, వసులు బయటికొచ్చి బాధపడతారు. పుండు మీద కారం చల్లే లాంటి వాళ్లు ఉంటే అది ఇక్కడ సంతోషంగా ఉండదని అంటుంది ప్రమీల. ఇంత పెద్దింటికి కోడలు కావడమే దాని అదృష్టం, ఆ పెద్దావిడ నాలుగు మాటలంటే పడలేదా అని కుమారి ప్రశ్నిస్తుంది. ఇంతలో శారద వచ్చి ప్రమీలకి భోజనం క్యారియర్ ఇస్తుంది. మా అత్తయ్య మాటలతో బాధపడొద్దని, భానుమతి చాలా మంచిదని అంటుంది శారద. తర్వాత భానుమతిని పక్కకి తీసుకెళ్లి మాట్లాడుతుంది ప్రమీల.
అమ్మ వెళ్లిపోయిన తర్వాత వేదవతి అన్న మాటలు గుర్తు తెచ్చుకుని బాధపడుతుంది భానుమతి. ఆమెను చూసిన వేదవతి వచ్చి ఎందుకు బాధపడుతున్నావ్? ఈ ఇంట్లో వాళ్లు నిన్ను బాగా చూసుకోవడం లేదా? అని అడుగుతుంది. అందరూ చాలా మంచివాళ్లని, నన్ను చాలా బాగా చూసుకుంటున్నారని చెబుతుంది భానుమతి. ఇంత మంచి మనుషుల మధ్య కూడా ఉండలేకపోతే ఇంకెక్కడా ఉండలేనని అంటుంది. నేనెప్పుడూ మంచి జీవితం పొందాలని అనుకున్నాను కానీ పాడు చేసుకోవాలని అనుకోలేదని చెబుతుంది భానుమతి. ఇంత మంచి కుటుంబానికి కోడలయ్యే అవకాశం వస్తే పెళ్లి ఆపాలని ఎందుకు అనుకున్నావని నిలదీస్తుంది వేదవతి. ఆ మాటలతో భానుమతి షాక్ అవుతుంది.
పెళ్లి ఆపడం కోసం నువ్వే పోలీసులకు ఫోన్ చేశావని, నీ వల్లే పెళ్లి ఆగిపోయిందని , నీ వల్లే మా బలరామ్ అన్నయ్య అవమానాల పాలయ్యాడని నాకు తెలుసని అంటుంది. మంచి మనుషులున్న కుటుంబం.. పది మందికి సాయం చేసే కుటుంబం, సమాజంలో ఉన్నతమైన పేరున్న కుటుంబం ఇలాంటి ఇంటికి కోడలిగా వెళ్లే అదృష్టం ఎంతమంది అమ్మాయిలకి ఉంటుందని ప్రశ్నిస్తుంది వేదవతి. అలాంటిఅవకాశాన్ని నువ్వు కాలదన్నుకోవాలని చూశావని చెబుతుంది. నీ స్వార్ధం కోసం ఈ కుటుంబం చేత కన్నీరు పెట్టించావని మండిపడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











