Bhanumathi May 9th Episode : భానుమతి లుక్ మార్చేసిన శారద.. భార్యకి దిష్టి తీసిన పార్ధు, పగతో రగిలిపోతోన్న భువన
కోటయ్యపై పార్ధు కోప్పడిన తీరు చూసి భానుమతి వణికిపోతుంది. పెళ్లి ఆపింది నేనేనని వీళ్లకి తెలిస్తే నా అంతు చూసేవరకు వదిలిపెట్టరని అనుకుంటుంది. భానుమతిని అత్తారింటికి పంపాం కానీ ఆమెకు సారె పంపలేదని ప్రమీల బాధపడుతుంది. కోటిని పిలిచి 25000 తీసుకురమ్మని చెప్పడంతో అతను షాక్ అవుతాడు. ఇదంతా నావల్ల కాదని చేతులెత్తేయడంతో ప్రమీల బాధపడుతుంది. తాను ఇచ్చిన గిఫ్ట్ని భానుమతి చూడకపోవడంతో పార్ధు బాధపడతాడు. ఇంతలో భాను వచ్చి మీకు ఎవరైనా మోసం చేస్తే కోపమా? అని అడగటంతో పార్ధు అవునని చెబుతాడు.
కాంచన అనే బలరామ్ బంధువు ఒకామె వచ్చి భువనని పార్ధు భార్య అనుకోవడంతో శాంభవి, భువనలు మురిసిపోతారు. ఇంతలో భానుమతిని పిలిచి మంచినీళ్లు తీసుకురమ్మని చెప్పడంతో బలరామ్ ఫ్యామిలీ షాక్ అవుతుంది. కోడలిని పనిమనిషిలా చూస్తున్న కాంచనపై శారద రగిలిపోతూ ఈ అమ్మాయి ఈ ఇంటి కోడలని చెప్పడంతో కాంచన అక్కడి నుంచి వెళ్లిపోతుంది. భానుమతికి అలాంటి అవమానం జరగకూడదని, మన ఇంటి గౌరవం తగ్గకూడదని శారదతో బలరామ్ తల్లి అంటుండగా పార్ధు వింటాడు. పార్ధుని తీసుకుని నా దగ్గరికి రమ్మని చెప్పడంతో భానుమతి దగ్గరికి వెళ్తాడు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక మే 9వ తేదీ ఎపిసోడ్ 53లో ఏం జరిగిందంటే?

నాయనమ్మ పిలుస్తుందని పార్ధు చెప్పడంతో భానుమతి టెన్షన్ పడుతుంది. అమ్మమ్మగారి చూపు ఎప్పుడు నామీదే ఉంటోందని, నేను ఏం చేస్తే ఏమంటారోనని భయంగా ఉందని పార్ధుతో అంటుంది భానుమతి. నేనేం తప్పు చేశానో నాకు తెలియదని, ఇంతకీ ఆ తప్పుకి ఏం శిక్ష వేస్తారని అడుగుతుంది. దాంతో పార్ధు బంగారం లాంటి శిక్ష వేస్తున్నామని, అక్కడికి వెళ్లాక నీకే తెలుస్తుందని చెప్పి నాయనమ్మ దగ్గరికి తీసుకెళ్తాడు. పార్ధుని బయటికి వెళ్లామని పెద్దావిడ చెప్పడంతో భానుమతిని అక్కడే వదిలేసి వెళ్తాడు.
బస్సమ్మాయిని ఎందుకు తీసుకురమ్మన్నారు? లోపల ఏం జరుగుతోంది? అని పార్ధు ఆలోచిస్తూ దొంగచాటుగా చూస్తాడు పార్ధు. ఎదురుగా ఉన్న నగలు చూసి భానుమతి షాక్ అవుతుంది. ఏదో శిక్ష వేస్తానని అన్నారు కదా మీరేంటీ బంగారంతో అలంకరిస్తున్నారని ప్రశ్నిస్తుంది భానుమతి. నీకు ఈ ఇంటి కోడలు అనే హోదా లేదని ఈ నగలు వేసుకుంటే అది వస్తుందని చెబుతుంది శారద. తర్వాత పెద్దావిడ, శారదలు కలిసి భానుమతికి బంగారాన్ని అలంకరిస్తారు. భార్యను అలా చూసి పార్ధు మురిసిపోతాడు. వడ్డాణం పెడుతుండగా చెక్కిలిగింతలు పెట్టడంతో భానుమతి నవ్వుకుంటుంది.
భానుమతిని చూసి శారద మురిసిపోతుంది. మనం ఎక్కడికైనా వెళ్లాలా? అని పెద్దావిడని అడుగుతుంది భానుమతి. నన్ను గంగిరెద్దులా తయారు చేశారు కదా అని అనడంతో పెద్దావిడ మండిపడుతుంది. నువ్వు ఈ ఇంటి కోడలివి కదా? ఎప్పుడూ లక్ష్మీదేవిలా కళకళలాడుతూ కనిపించాలని చెబుతుంది శారద. ఈ నగలు ఒళ్లంతా గుచ్చుకుంటున్నాయని, కాసేపు ఉంచుకుని తీసైనా అని భానుమతి అడగటంతో పెద్దావిడ రగిలిపోతుంది. ఇక నుంచి రోజూ నువ్వు ఇలాగే రెడీ అవ్వాలని, ఇంట్లో అన్ని పనులు ఇలాగే చేయాలని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే నువ్వు ఈ ఇంటి కోడలివని అందరూ గుర్తిస్తారని చెబుతుంది.
ఈ ఇంటి పరువు, మర్యాద అన్నీ నువ్వు కట్టుకునే బట్టల్లోనూ వేసుకునే బంగారంలోనూ ఉంటుందని చెబుతుంది పెద్దావిడ. ఇక నుంచి రోజూ నువ్వు ఇలాగే తయారవ్వాలని అంటుంది. నాకు వద్దు అని పార్ధు వంక చూసి చెబుతుంది భానుమతి. మరోవైపు కిచెన్లో వంట చేస్తున్న స్వాతిని చూసిన చరణ్ వెనుక నుంచి వెళ్లి పట్టుకుంటాడు. సెంటు లేకపోయినా నీ ఒంటి వాసన అదిరిపోతుందని ఆమెను మాటల్లో పెడతాడు. నీకోసం లడ్డూ తీసుకొచ్చానని చెప్పి ఆమెకు తినిపిస్తాడు.
వీరిద్దరూ కిచెన్లో సరసాలు ఆడుకుంటుండగా భువన రావడాన్ని చూసిన స్వాతి టెన్షన్ పడుతుంది. కరెక్ట్ టైంలో వచ్చి చెడగొట్టిందని చరణ్ ఆమెపై మండిపడతాడు. కాంచన అన్న మాటలు గుర్తు రావడంతో అదే తలచుకుంటూ ఆలోచిస్తుంది భువన. ఇంతలో శాంభవి వచ్చి కొత్తగా కనిపిస్తున్నావని అంటుంది. కొన్ని విషయాలు నాతో కొత్త ఉత్సాహం నింపుతున్నాయని, అందుకే నేను కూడా కొత్తగా కనిపిస్తున్నానని చెబుతుంది భువన. ఇందాక వచ్చిన కాంచన గారు నన్నే ఇంటి కోడలినని, పార్ధు భార్యనని అనుకున్నారని .. అంటే నాకే ఈ ఇంటి కోడలయ్యే అర్హత ఉందని అర్ధమని అంటుంది భువన. ఒక తల్లిగా నువ్వు కోరుకున్నది నేను అందించలేకపోయానని, ఆ విషయంలో నా మీద నాకే అసహ్యం వేస్తోందని చెబుతుంది శాంభవి.
నా కోసం నువ్వు ఎంత చేయగలిగావో అంత చేశావని, ఇకపైనా చేయాలని అంటుంది భువన. ఇక చేయడానికి ఏం లేదని, మనం వెళ్లేదారికి ఒక పెద్ద అడ్డుగోడ కనిపిస్తోందని, అది దాటే మార్గం మాత్రం కనిపించడం లేదని అంటుంది శాంభవి. పదిమంది మనకి తోడుగా ఉంటే గెలవగలమనే భరోసా ఉంటుందని, సాధించగలమనే నమ్మకం వస్తుందని కానీ ఈ ఇంట్లో మనం పరాయివాళ్లలా బతుకుతున్నామని చెబుతుంది. ఒక్కసారి నేను పంతానికి పోతే ఎంత దూరమైనా వెళ్తానని అంటుంది భువన. వాళ్లంతా భానుమతిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నారని, ఇలాంటి సమయంలో వాళ్ల మనసులు మార్చలేమని చెబుతుంది శాంభవి. ఏదో ఒకరోజు ఈ భానుమతిని ఇంట్లో నుంచి గెంటేస్తారని, ఆ రోజున ఈ భువన విలువ అందరికీ తెలిసొస్తుందని చెబుతుంది.
ప్రమీల వంట చేసుకుంటూ భానుమతి పెళ్లి ఆపిన సంఘటన, బలరామ్ తల్లి అన్న మాటలు గుర్తొచ్చి బాధపడుతుంది. ఇంతలో ఆమె చేయి తెగి రక్తం వస్తుంది. ఆ వెంటనే వసు కంగారుగా వచ్చి తల్లికి కట్టుకడుతుంది. ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తే అంతా బాగానే ఉంటుందని కుమారి సూటి పోటి మాటలు అంటుంది. ఇంతలో కోటి వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ఏ ఇంటికైతే భానుమతి వల్ల అన్యాయం జరిగిందో అదే ఇంటికి కోడలిగా పంపించామని చెబుతుంది కుమారి. భానుమతి వల్ల వాళ్లకి అన్యాయం జరిగిందని ఆ కుటుంబానికి తెలిస్తే దాని పరిస్థితి ఏంటా అని భయపడుతున్నానని అంటుంది.
నిజం అనేది ఏదో ఒకరోజు బయటపడుతుందని, ఆరోజున భానుమతికి ఆ ఇంట్లో స్థానం ఉండదని, వారి ఆగ్రహానికి నా కూతురు ఎక్కడ బలవుతుందోనని భయంగా ఉందని చెబుతుంది. భానుమతి నోరు విప్పదు, మనం చచ్చినా ఆ గుట్టు బయటపడదు అలాంటప్పుడు ఎందుకు బాధపడతావని ప్రశ్నిస్తాడు కోటి. లెక్కలు చూస్తున్న భర్తని చూసి మండిపడుతుంది శక్తి. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తోంది.


Click it and Unblock the Notifications











