Ashu Reddy: అషు రెడ్డి కేసులో మరో కీలక పరిణామం.. హైకోర్టుకు చేరిన వివాదం..
బిగ్ బాస్ ఫేమ్, ప్రముఖ సినీనటి అషురెడ్డి (Ashu Reddy) చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. ప్రస్తుతం భారీ వివాదం నెలకొంది. ప్రేమ, పెళ్లి పేరుతో భారీగా డబ్బులు మోసం చేసిందన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. దాదాపు రూ. 9.83 కోట్లు మోసం చేశారన్న ఫిర్యాదుతో పోలీసులు నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేయగా, తాజాగా ఈ కేసును కొట్టివేయాలంటూ ఆమె న్యాయపోరాటానికి దిగడం మరింత ఆసక్తి రేపుతోంది.
ఆరోపణల నేపథ్యం ఏమిటి?
ఫిర్యాదు ప్రకారం.. బాధితుడు ధర్మేంద్ర అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో అషు రెడ్డి 2018 ప్రాంతంలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, పెళ్లి వరకు వెళ్లిందని ఆరోపణలు ఉన్నాయి. ఇరు కుటుంబాలు పెళ్లి విషయంపై చర్చలు జరిపినట్లు, జాతకాలు కూడా చూపించినట్లు సమాచారం. అయితే ఈ సంబంధాన్ని నమ్మిన ధర్మేంద్ర నుంచి అషు రెడ్డి భారీగా డబ్బులు తీసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సుమారు రూ. 9.5 కోట్లకు పైగా వివిధ సందర్భాల్లో తీసుకుని, ఆ మొత్తాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుందని ఆరోపించారు. అదనంగా, ఆమె సోదరి పేరుతో కూడా డబ్బులు తీసుకున్నట్లు వివరించారు.

డబ్బుల వినియోగంపై ఆరోపణలు
బాధితుడు చేసిన ఫిర్యాదు ప్రకారం, తీసుకున్న డబ్బుతో బంగారం, ఫ్లాట్లు, లగ్జరీ కార్లు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల వివరాలు కూడా బయటకు వస్తుండటం కేసుకు మరింత బలం చేకూరుస్తోంది. అంతేకాదు, డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే బెదిరింపులకు పాల్పడిందని, తనపై తప్పుడు కేసులు పెడతానని లేదా ఆత్మహత్య చేస్తానని బెదిరించిందని ధర్మేంద్ర పేర్కొన్నారు. ఈ కేసులో తన బాయ్ఫ్రెండ్ జయంత్ పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించడం గమనార్హం.
హైకోర్టును ఆశ్రయించిన అషు రెడ్డి
బాధితుడి ఫిర్యాదు ఆధారంగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. మోసం, కుట్ర వంటి తీవ్రమైన ఆరోపణల కింద నాన్-బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేసినట్లు సమాచారం. ఈ పరిణామం అషు రెడ్డి కెరీర్పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ కేసు నేపథ్యంలో అషు రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన FIRను రద్దు చేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. తన వెర్షన్ను పోలీసులు వినకుండానే ఏకపక్షంగా కేసు నమోదు చేశారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని, దురుద్దేశంతో ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ, కేసును కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ ఘటన ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఒకవైపు భారీ ఆర్థిక మోసం ఆరోపణలు, మరోవైపు నటి వాటిని ఖండిస్తూ కోర్టు మెట్లు ఎక్కడం ఈ కేసును మరింత సంక్లిష్టంగా మార్చింది. ఇక ఈ వ్యవహారం రెండు నెలల క్రితమే పోలీసులకు వెళ్లినా, ఇప్పుడు బయటకు రావడం కూడా అనుమానాలకు తావిస్తోంది. సోషల్ మీడియాలో ఈ అంశంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం పరిధిలో ఉంది. తెలంగాణ హైకోర్టులో అషు రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరగనుంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది కీలకంగా మారింది. ఈ కేసులో నిజం ఏంటి? ఆరోపణలు ఎంతవరకు నిజం? అన్నది కోర్టు విచారణలో తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications