అమర్పై దాడి వెనుక ఆ సీజన్ రన్నర్: ఫొటో పెట్టడంతో సంచలనం..ఒక్క పోస్టుతో బయటపడ్డ నిజం
ఎప్పుడు వచ్చినా సంచలనంగా మారుతూ.. పదిహేను వారాల పాటు ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోన్న ఏకైక షోనే బిగ్ బాస్. ముఖ్యంగా ఏడో సీజన్ ఉల్టా పుల్టాగా సాగుతూ ప్రేక్షకులకు మజాను అందించింది. ఫలితంగా సక్సెస్ఫుల్గా దీన్ని కంప్లీట్ చేసుకుంది.
అయితే, ఈ షో పూర్తైన తర్వాత జరిగిన గొడవలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సీజన్ రన్నర్ అమర్దీప్ చౌదరిపై దాడి సంచలనం మారింది. ఈ నేపథ్యంలో దీని వెనుక ఓ సీజన్ రన్నర్ ఉన్నాడని టాక్ వచ్చింది. తాజాగా దీనిపై అసలు నిజం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళ్తే...

సీజన్ రన్నర్గా అమర్దీప్: బిగ్ బాస్ ఏడో సీజన్లో ఆరుగురు ఫైనలిస్టులలో నలుగురు ముందుగానే ఎలిమినేట్ అవడంతో అమర్దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్ టాప్ 2 కంటెస్టెంట్లుగా మిగిలారు. వీళ్లిద్దరిలో ఎవరు గెలుస్తారన్న దానిపై చివర్లో చాలా ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజయం సాధించడంతో అమర్దీప్ చౌదరి ఈ సీజన్ రన్నరప్గా మిగిలిపోయాడు.

అమర్ ఫ్యామిలీపై దాడితో: ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే పూర్తైన తర్వాత హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియో దగ్గర కొందరు అభిమానులు అమర్దీప్ చౌదరి ఫ్యామిలీపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇందులో అతడు ప్రయాణిస్తున్న కారును పూర్తి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఆ వాహనం వెనుక అద్దాలు పూర్తి పగిలిపోయాయి. అదే సమయంలో అమర్ తల్లి, భార్య భయంతో వణికిపోయారు.

ప్రశాంత్పై కేసు నమోదు: అమర్దీప్ చౌదరి ఫ్యామిలీపై దాడి చేయడంతో పాటు మరికొన్ని ప్రైవేట్ వాహనాలను, ఆర్టీసీ బస్ను పల్లవి ప్రశాంత్ అభిమానులు ధ్వంసం చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు గుర్తించారు. దీంతో బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్తో పాటు అతడి అభిమానులు, సహచరలుపై ఆరు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఇప్పటికే ఓ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ కూడా చేసేశారు.

అఖిల్ సార్థక్పై పుకార్లతో: బిగ్ బాస్ ఏడో సీజన్ ఆరంభం నుంచీ పల్లవి ప్రశాంత్ను కొందరు మాజీ కంటెస్టెంట్లు సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే. అందులో నాలుగు, ఓటీటీ సీజన్ల రన్నర్ అఖిల్ సార్థక్ ఒకడు. ప్రతి రోజూ ఈ షో చూస్తూ ప్రశాంత్కు అతడు మద్దతు ప్రకటిస్తూ పోస్టులు పెట్టేవాడు. అదే సమయంలో ఎదుటి వాళ్లపై కూడా అసహనం వెల్లగక్కేవాడు. దీంతో ఈ దాడి వెనుక అఖిల్ పేరు వినిపించింది.
ఓ యూట్యూబ్ ఛానెల్లో: అమర్దీప్ చౌదరిపై జరిగిన దాడి వెనుక అఖిల్ సార్థక్ ఉన్నాడని తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్లో చూపించారు. ఇందుకోసం అతడి ఫొటోను కూడా వాడుకున్నారు. దీనికి 'అమర్పై దాడి చేయించింది వీళ్లే.. బయటపడ్డ ఓల్డ్ కంటెస్టెంట్ల బాగోతం' అంటూ థంబ్ నెయిల్ కూడా పెట్టారు. తాజాగా దీన్ని అఖిల్ సార్థక్ ఇన్స్టాలో షేర్ చేస్తూ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు.

వ్యూస్ కోసమే వేశావంటూ: అమర్దీప్పై దాడి వెనుక తాను ఉన్నానంటూ వేసిన వీడియోపై అఖిల్ సార్థక్ స్పందించాడు. 'భయ్యా వ్యూస్ కోసం నా పిక్ వేసుకున్నావ్ కానీ.. కాస్త కొత్త పిక్ పెట్టుండాలి. అసలు విషయం ఏంటంటే అసలు నేనెందుకు అతడిపై దాడి చేస్తా. మీ మీడియాకు ఒక దండం. దానికి నాకు ఏంటి సంబంధం. మీకోసం నేను ప్రార్థిస్తున్నా. దృష్ప్రచారం చేయకండి' అని చెప్పుకొచ్చాడు.
దాడిని ఖండించిన అఖిల్: మరో పోస్టులో అఖిల్ సార్థక్.. 'తాజాగా ఏదైతే దాడి జరిగిందో దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. కంటెస్టెంట్లపై దాడి చేయడం చాలా తప్పు. గేమ్ అనేది అయిపోయింది. మీకు ఇష్టమైన వాళ్లను ప్రేమించండి.. కానీ, వేరే వాళ్లను మాత్రం దూషించకండి' అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ ఘటనతో తనకు సంబంధం లేదని అఖిల్ క్లారిటీ ఇచ్చేశాడు.


Click it and Unblock the Notifications











