20 లక్షలు నమ్మి ఇస్తే మోసం చేశారు.. కర్మ ఎవ్వర్నీ వదిలిపెట్టదు
బుల్లితెర నటి, మోడల్, బిగ్బాస్ ఫేమ్ భానుశ్రీ (Bhanu Sri)గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. డాన్సర్గా కెరీర్ను ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత సీరియల్స్, సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైంది. కుమారి 21ఎఫ్, బాహుబలి వంటి సినిమాల్లో చిన్న పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న భానుశ్రీ, అనంతరం మౌనం, ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి, ఇద్దరి మధ్య 18 వంటి సినిమాలో కథానాయికగా నటించింది. ఈ తరుణంలోనే 'బిగ్ బాస్ తెలుగు 2'లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఈ రియాలిటీ షోతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే, ఇటీవల జబర్దస్త్ వర్ష హోస్ట్గా నిర్వహిస్తున్న 'కిసిక్ టాక్స్'కార్యక్రమంలో భానుశ్రీ పాల్గొంది.
ఈ టాక్ షోలో భాను శ్రీ తన వ్యక్తిగత జీవితం, కెరీర్, ఎదుర్కొన్న కష్టాలు, మోసాలు వంటి పలు విషయాల గురించి ఓపెన్గా మాట్లాడింది. అలాగే తన జీవితంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని పంచుకుని భావోద్వేగానికి గురయ్యారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి తన కష్టంతో ఇండస్ట్రీలో గుర్తింపు సంపాదించిన భానుశ్రీ, నమ్మిన వ్యక్తుల చేతిలో ఏకంగా రూ.20 లక్షలు కోల్పోయానంటూ వెల్లడించారు. జబర్దస్త్ వర్ష హోస్ట్గా నిర్వహిస్తున్న 'కిసిక్ టాక్స్' కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, తన జీవితంలో జరిగిన ఆర్థిక మోసం గురించి తొలిసారిగా బహిరంగంగా మాట్లాడారు.

"ఎవరినైనా గుడ్డిగా నమ్మి ఎప్పుడైనా మోసపోయారా?" అని వర్ష ప్రశ్నించగా, భానుశ్రీ వెంటనే తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకున్నారు. డబ్బుల విషయంలో ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మి భారీగా నష్టపోయానని చెప్పారు. భానుశ్రీ మాట్లాడుతూ.. "దాదాపు రూ.20 లక్షలు ఒక వ్యక్తికి ఇచ్చాను. మొదట్లో అంతా బాగానే అనిపించింది. రెండు సంవత్సరాల పాటు ఆయన నాకు క్రమం తప్పకుండా వడ్డీ కూడా ఇచ్చారు. దీంతో నేను ఆయనపై మరింత నమ్మకం పెట్టుకున్నాను. అయితే తర్వాత నాకు ఆ డబ్బులు అవసరం రావడంతో అసలు మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరాను. కానీ అప్పటి నుంచి వారి వైఖరి పూర్తిగా మారిపోయింది" అని తెలిపారు.
డబ్బులు తిరిగి అడిగిన తర్వాత ఆ వ్యక్తి తన వద్ద డబ్బులు లేవని, ఇవ్వలేమని నేరుగా చెప్పేశారని భానుశ్రీ వెల్లడించారు. "నేను ఎందుకు ఇవ్వలేరు అని ప్రశ్నించగా.. చేయగలిగితే చేసుకోండి, ఎక్కడికైనా వెళ్లండి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. నేను షాక్ అయ్యాను. ఎందుకంటే రెండు సంవత్సరాల పాటు వడ్డీ ఇచ్చిన వ్యక్తి ఒక్కసారిగా మాట మార్చడం ఊహించలేదు" అని చెప్పారు.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, తర్వాత తాము అసలు డబ్బులే తీసుకోలేదని ఎదురు ప్రశ్నించారని భానుశ్రీ తెలిపారు. "మీరు నిజంగా డబ్బులు ఇచ్చారా? ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అంటూ మమ్మల్నే ప్రశ్నించారు. నేను క్యాష్ రూపంలో డబ్బులు ఇచ్చాను. కానీ వాళ్లు మాత్రం కొన్ని లావాదేవీలు ఆన్లైన్లో చేశారు. ఆ తర్వాత మొత్తం డబ్బును షేర్ మార్కెట్లో పెట్టి నష్టపోయామని, ఇప్పుడు తిరిగి ఇవ్వలేమని చెప్పారు" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ డబ్బుల కోసం తాను ఎంత కష్టపడ్డానో కూడా భానుశ్రీ వివరించారు. "ఆ మొత్తం డబ్బులో రూ.12 లక్షలు నేను స్వయంగా సంపాదించినవి. మిగిలిన రూ.8 లక్షలు మా అమ్మకు ఉన్న చిన్న స్థలం అమ్మి సేకరించాం. భవిష్యత్తులో ఒక ఫ్లాట్ కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఆ పెట్టుబడి పెట్టాను. కానీ చివరకు మమ్మల్ని పూర్తిగా మోసం చేశారు" అని ఎమోషనల్ అయ్యారు. అయితే ఈ సంఘటన తనను పూర్తిగా కుంగదీయలేదని, మరింత బలంగా నిలబడేలా చేసిందని భానుశ్రీ చెప్పారు.
"నన్ను మోసం చేసిన వాళ్లు ఆ సమయంలో ఒక స్థాయిలో ఉండొచ్చు. కానీ నేను మాత్రం నా కష్టంతో మరింత ఎదగాలని నిర్ణయించుకున్నాను. నన్ను మోసం చేసిన వారికంటే ఎక్కువగా సాధించాలి అని అప్పుడే ఫిక్స్ అయ్యాను" అని అన్నారు. ఈ సందర్భంగా కర్మ సిద్ధాంతంపై తన నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు. "నేను ఎప్పుడూ కర్మను నమ్ముతాను. ఎవరైనా తప్పు చేస్తే దానికి ఫలితం తప్పకుండా అనుభవించాల్సిందే. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. నా జీవితంలో అలాంటి ఎన్నో సంఘటనలు చూశాను. నన్ను మోసం చేసిన వాళ్లు కూడా ఒకరోజు తమ తప్పు ఫలితాన్ని అనుభవిస్తారనే నమ్మకం నాకు ఉంది" అని చెప్పారు. భానుశ్రీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications




