‘6 సార్లు చావు దగ్గరికి వెళ్లా... ప్రాణాలతో ఉన్నానంటే ఆమె వల్లనే'
'గలాటా గీతూ'గా ఫేమస్ అయిన గీతూ రాయల్ (Geetu Royal) గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిత్తూరు యాసతో చురుకైన మాటలు, ఎనర్జిటిక్ ప్రెజెన్స్తో గుర్తింపు తెచ్చుకున్న గీతూ... బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్గా వెళ్లి తన ఆటతో మంచి ఫ్యాన్బేస్ సంపాదించుకుంది. బిగ్ బాస్ రీవ్యూయర్ గా కెరియర్ ప్రారంభించిన ఈ క్యూట్ బ్యూటీ.. సెలబ్రిటీగా మారిపోయింది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తాను 6 సార్లు చచ్చి బతికాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఆ పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
బిగ్ బాస్ రీవ్యూయర్గా కెరీర్ ప్రారంభించిన గీతూ, ఆ తర్వాత షోలోనే అడుగుపెట్టి సెలబ్రిటీగా మారిపోయింది. 'జబర్దస్త్' సహా పలు టీవీ షోలలో కనిపిస్తూ సందడి చేసిన ఆమె, బిగ్ బాస్ తెలుగు 7లో 'బిగ్ బాస్ బజ్' షోకు యాంకర్గా కూడా వ్యవహరించింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ తనదైన స్టైల్లో షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం కూడా వరుస టీవీ ప్రోగ్రామ్స్తో బిజీగా ఉంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.

గీతూ రాయల్ తాజాగా చేసిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. తన జీవితంలో ఎదురైన వరుస ప్రాణాపాయ సంఘటనలను గుర్తు చేసుకుంటూ గీతూ చెప్పిన మాటలు ప్రేక్షకుల గుండెల్ని తాకుతున్నాయి. "నేను ఆరు సార్లు చావు దగ్గరకు వెళ్లా... ఇప్పుడు బతికి ఉన్నానంటే అది మా అమ్మ చేసిన పుణ్యమే" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
ఓ వీడియోలో మాట్లాడుతూ గీతూ తన చిన్ననాటి నుంచే మొదలైన ఆరోగ్య సమస్యలను వెల్లడించారు. తాను థర్డ్ క్లాస్లో ఉండగానే తీవ్ర జ్వరంతో చనిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని, ఆ తర్వాత సెవెంత్ క్లాస్లో కూడా అదే తరహా అనారోగ్యంతో చాలా ఇబ్బంది పడ్డానని చెప్పారు. అప్పట్లో ఎన్ని మందులు వాడినా ఫలితం లేకుండా పోయిందని, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని గుర్తు చేసుకున్నారు.
అలాగే టెన్త్ క్లాస్ సమయంలో హెపటైటిస్ వైరస్ సోకి మరోసారి ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్న పరిస్థితి ఎదురైందని తెలిపారు. అక్కడితో ఆగకుండా, కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో రన్నింగ్ బస్సు నుంచి కింద పడిపోవడంతో తలకు ఏకంగా 12 కుట్లు పడ్డాయని చెప్పారు. "ఆ రోజు కూడా నేను బతికి బయటపడటం దేవుడి దయే" అంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
ఇక 2024 ఏడాది తన జీవితంలోనే అత్యంత కష్టమైన సంవత్సరమని గీతూ పేర్కొన్నారు. 'అదేదో సమస్య వచ్చింది... దాన్లో నుంచి ఎలా బయటపడ్డానో నాకే తెలియదు. మానసికంగా పూర్తిగా దిగజారిన రోజులు అవి' అంటూ తన బాధను పంచుకున్నారు. అయితే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన 2025 మే 10న జరిగింది. ఆ రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ, "నా కారు పూర్తిగా పీస్ పీస్ అయిపోయింది. కళ్ళు తెరిచి చూసినప్పుడు నేను బతికున్నానా లేక ఆత్మనా అన్నట్టుగా అనిపించింది. ఆ క్షణంలో ఒక విషయం బలంగా తాకింది... దేవుడు ఆరు సార్లు ఛాన్స్ ఇచ్చాడంటే, ఈ జీవితానికి ఏదో అర్థం ఉందని" అన్నారు.
ఆ ప్రమాదం తర్వాత తన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయిందని గీతూ చెప్పారు. 'రేపు ఉంటుందో లేదో కూడా తెలియదు. ఆరోజు నేను చనిపోయి ఉంటే ఈ రోజు మీ ముందు గీతూ ఉండేదే కాదు. అప్పుడే డిసైడ్ అయ్యా - ఇక నుంచి నా జీవితాన్ని నా ఇష్టప్రకారమే జీవిస్తా. నా హ్యాపీనెస్ కోసం సెర్చ్ చేయడం మొదలు పెట్టా. బాధ పెట్టే రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా' అంటూ స్పష్టంగా చెప్పారు.
తన జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని అమ్మ ఆశీర్వాదంతోనే దాటానని గీతూ పేర్కొన్నారు. 'ఇలా నేను బతికున్నానంటే మా అమ్మ చేసిన పుణ్యం వల్లే. ఆమె నాకు నేర్పిన ఎథిక్స్, వాల్యూస్ను నేను ఎప్పుడూ మర్చిపోలేదు. మీరు కూడా మీ జీవితంలో బాధ పెట్టే విషయాలను పక్కన పెట్టేసి, మీ లైఫ్ను మీరు ఎంజాయ్ చేయండి' అంటూ ఆమె ఇచ్చిన సందేశం ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణగా మారుతోంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు గీతూ ధైర్యాన్ని మెచ్చుకుంటూ, 'నీ స్ట్రెంత్కు సెల్యూట్', 'ఇలాంటి అనుభవాల తర్వాత కూడా పాజిటివ్గా మాట్లాడటం గొప్ప విషయం' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు తమ జీవిత అనుభవాలను కూడా షేర్ చేస్తూ ఆమె మాటలకు కనెక్ట్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











