హనీ ట్రాప్లో చిక్కుకున్న బిగ్ బాస్ ఫేమ్.. రూ.23 లక్షలు మోసపోయాయని ఆవేదన
బిగ్ బాస్ తెలుగు ద్వారా గుర్తింపు పొందిన మోడల్, నటుడు ప్రిన్స్ యావర్ (Prince Yawar). వాస్తవానికి బిగ్ బాస్ లో అడుగుపెట్టినప్పుడు యావర్ కు తెలుగు అస్సలు రాదు. కానీ, లోపలికి వెళ్ళిన తర్వాత తెలుగు నేర్చుకున్నాడు. చివర వరకు తెలుగులో మాట్లాడాడు ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నారు. ప్రస్తుతం ఓ సంచలన వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ, సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో తాను హనీ ట్రాప్కు గురయ్యానని వెల్లడించడం ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చకు దారితీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే?
దగ్గరి బంధువే మోసం చేశాడని ఆరోపణ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్రిన్స్ యావర్ మాట్లాడుతూ..తనకు ఎంతో దగ్గరైన బంధువే ఈ వ్యవహారంలో తనను మోసం చేశాడని యావర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో ఎవర్నీ సులభంగా నమ్మకూడదని, తాను నమ్మిన దగ్గరి బంధువే తనను నిండా ముంచేశాడని చెప్పారు. ఆ వ్యక్తి ఒక ఫంక్షన్కు రావాలని బలవంతం చేశాడని, అక్కడ అతడి కూతురిని కలిసిన తర్వాత పరిచయం మొదలైందని వివరించారు.

ఆ అమ్మాయికి తనంటే ఇష్టమని,ఆ కారణంగా తన ఫోన్ నెంబర్ తీసుకుని తరచూ మాట్లాడేదని చెప్పారు. కొంతకాలానికి ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కోరిందని, కుటుంబ సభ్యుల ఒత్తిడి కారణంగా తాను నిశ్చితార్థం కూడా చేసుకున్నానని వెల్లడించారు. అయితే తాను ఇంకా కెరీర్లో స్థిరపడలేదని, కాబట్టి పెళ్లి తర్వాత చేస్తానని ముందే చెప్పానని యావర్ తెలిపారు.
పెట్టుబడి పేరుతో డబ్బులు
ఈ పరిచయం తర్వాత ఆ అమ్మాయి తండ్రి తనను పెట్టుబడి పెట్టమని ఒప్పించాడని యావర్ ఆరోపించారు. ల్యాండ్ డీల్లో రూ.30 లక్షలు పెట్టితే రూ.50 లక్షలు తిరిగి ఇస్తానని చెప్పాడని తెలిపారు. అంత పెద్ద మొత్తం తన వద్ద లేకపోయినా, అతడిని నమ్మి తాను కష్టపడి సంపాదించిన డబ్బంతా ఇచ్చేశానని యావర్ చెప్పారు. తన దగ్గర ఉన్న రూ.18 లక్షలు, స్నేహితుడి దగ్గర నుంచి తీసుకున్న రూ.5 లక్షలు కలిపి మొత్తం రూ.23 లక్షలు ఇచ్చానని తెలిపారు.
డబ్బులు ఇచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని యావర్ చెప్పారు. ముందుగా రూ.40 లక్షలు ఇస్తానని చెప్పిన వ్యక్తి తర్వాత మాట మార్చాడని తెలిపారు. నెలలు గడిచినా తనకు ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదని ఆరోపించారు. అదే సమయంలో తన అన్నకు రూ.7 లక్షలు ఇచ్చానని చెబుతున్నాడని, కానీ తనకు ఒక్క మాట కూడా చెప్పలేదని యావర్ ప్రశ్నించారు. ఇంకా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో పాటు తన కూతురిని అడ్డుపెట్టుకుని సింపతీ డ్రామాలు చేస్తున్నారని యావర్ ఆరోపించారు. అంతేకాదు కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్పి తనను బెదిరిస్తున్నారని కూడా తెలిపారు.
ఈ మొత్తం ఘటన కారణంగా గత 8 నెలలుగా తాను తీవ్రమైన డిప్రెషన్లో ఉన్నానని యావర్ చెప్పారు. మానసిక ప్రశాంతత కోల్పోయానని, ఈ పరిస్థితుల్లో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అసాధ్యమని భావోద్వేగంతో తెలిపారు. ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో కూడా యావర్ ఒక వీడియో పోస్ట్ చేశారు. అందులో తనకు తెలిసిన ఒక అమ్మాయి తనను ట్రాప్ చేసి రూ. 23 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు డబ్బులు వసూలు చేసిందని పేర్కొన్నారు. అంతేకాదు తన కెరీర్ను నాశనం చేస్తానని కూడా బెదిరించిందని చెప్పారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఘటనపై ప్రిన్స్ యావర్ పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఆ కేసులో నిజానిజాలు ఏంటన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ విషయం బయటకు రావడంతో నెట్టింట పెద్ద చర్చ మొదలైంది. చాలా మంది నెటిజన్లు యావర్కు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











