తిరుమలలో దివ్వెల మాధురి ఓవర్ యాక్షన్! చిక్కుల్లో బిగ్బాస్ తనూజ.. అసలేం జరిగిందంటే?
తిరుమలలో మరోసారి వివాదం రేగింది. బిగ్బాస్ ఫేమ్ తనూజ, దివ్వెల మాధురి చిక్కుల్లో పడ్డారు. దివ్వెల పోస్ట్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఈ క్రమంలో కొంతమంది భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా ఈ విషయంపై విచారణ చేపట్టిందట. తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఆ వివాదం ఏంటీ? ఇంతకీ దివ్వెల మాధురి, తనూజ ఏం చేశారు?
బుల్లితెర నటి, బిగ్బాస్ సీజన్ 9 రన్నరప్ తనూజ పుట్టస్వామి పుట్టిన రోజు వేడుకలు తిరుమలలో నిర్వహించారు. ముఖ్యంగా అక్కడ కేక్ కట్ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ బర్త్ సెలబ్రెషన్స్ సంబంధించిన ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో దివ్వెల మాధురిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమల కొండపై కేక్లు తీసుకెళ్లడంపై సాధారణంగా నిబంధనలు ఉన్నప్పటికీ, ఎలా ఈ వేడుక జరిగింది అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

సమాచారం ప్రకారం.. తనూజ పుట్టిన రోజు సందర్భంగా దివ్వెల మాధురి తిరుమలలోని ఒక గెస్ట్ హౌస్లో కేక్ కట్ చేయించి వేడుకలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వీడియోలో కేక్ కట్ చేయించడం మాత్రమే కాకుండా, తనూజకు చీర, గాజులు, బంగారు చెవి దిద్దులు బహుమతిగా ఇచ్చినట్లు కనిపిస్తోంది. అయితే.. ఈ వీడియో వైరల్ కావడంతో భక్తులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
తిరుమల పవిత్రతను దృష్టిలో ఉంచుకుని కొండపై వ్యక్తిగత వేడుకలు, పార్టీలు వంటి కార్యక్రమాలపై అనేక నిబంధనలు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా కేక్లు, మాంసాహార పదార్థాలు వంటి వాటిపై నియంత్రణలు ఉన్నాయని భక్తులు గుర్తు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ కేక్ కొండపైకి ఎలా చేరింది అనే ప్రశ్న ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఈ విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విజిలెన్స్ విభాగం కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇదే మొదటిసారి దివ్వెల మాధురి తిరుమలలో వివాదంలో పడటం కాదు. గతంలో కూడా ఆమె శ్రీవారి ఆలయం పరిసరాల్లో సోషల్ మీడియా రీల్స్ చేయడం ద్వారా విమర్శలు ఎదుర్కొన్నారు. అప్పట్లో దువ్వాడ శ్రీనివాస్తో కలిసి ఆలయం వద్ద వీడియోలు చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటనపై ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదైంది. తర్వాత ఆమె క్షమాపణలు చెప్పినా మళ్లీ ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశమైంది.
ఈసారి తనూజ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించడం వల్ల విమర్శలు మరింత పెరిగాయి. ముఖ్యంగా శ్రీవారి సన్నిధిలో ఇలాంటి వ్యక్తిగత వేడుకలు చేయడం సరైంది కాదని భక్తులు అంటున్నారు. కొంతమంది అయితే 'సామాన్య భక్తులకు ఒక రూల్, సెలబ్రిటీలకు మరో రూల్?' అంటూ టీటీడీపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
అయితే మరోవైపు కొంతమంది మాత్రం ఈ వేడుకలు ఆలయం వద్ద కాకుండా గెస్ట్ హౌస్లో జరిగాయని, అందువల్ల అసలు నిబంధనలు ఏమిటన్నది స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. సాధారణంగా తిరుమలలో ఎగ్లెస్ కేక్లకు మాత్రమే కొన్ని సందర్భాల్లో అనుమతి ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో తీసుకెళ్లిన కేక్కు అనుమతి ఉందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక దివ్వెల మాధురి, తనూజలు గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో శ్రీవారిని దర్శించుకున్నట్లు కూడా సమాచారం. బిగ్బాస్ షోలో ఏర్పడిన స్నేహం కారణంగా వీరిద్దరూ కలిసి తిరుమలకు వెళ్లి ఈ వేడుకలను నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఘటనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, టీటీడీ విజిలెన్స్ విభాగం కూడా ఈ విషయంపై విచారణ చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వివాదంపై దివ్వెల మాధురి లేదా తనూజ ఎలా స్పందిస్తారో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications

















