Bigg Boss Winner: ప్రశాంత్ అరెస్ట్ తర్వాత జరిగింది ఇదే.. అదే రుజువైతే అన్ని సంవత్సరాలు జైల్లోనే!
పల్లవి ప్రశాంత్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఒక సంచలనం. అంతలా దాదాపు నాలుగు నెలలుగా అటు టీవీల్లోనూ, ఇటు సోషల్ మీడియాలోనూ ఇతగాడి పేరు మారుమ్రోగిపోతోంది. దీనికి కారణం కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్ షోలోకి వచ్చి.. అసాధారణ ఆటతీరుతో విజేతగా నిలవడమే అని తెలిసిందే.
అంత వరకూ బాగానే ఉన్నా ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ పోలీసు కేసులో చిక్కుకున్నాడు. దీంతో గత రాత్రే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? అతడు ఎన్ని రోజులు జైల్లో ఉండాలి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి!

పల్లవి ప్రశాంత్ అరెస్ట్: బిగ్ బాస్ షో ఫినాలే తర్వాత జరిగిన గొడవలు, అల్లర్లకు బాధ్యుడిని చేస్తూ పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు రోజుల తర్వాత అంటే బుధవారం సాయంత్రం పల్లవి ప్రశాంత్ నివాసానికి చేరుకుని అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు.
పేరెంట్స్ ఆందోళన: బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో అతడి తల్లదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ బిడ్డ ఏం తప్పు చేశాడని అరెస్ట్ చేశారంటూ వాళ్లు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అదే సమయంలో ప్రశాంత్ అభిమానులు సైతం అతడి గురించి టెన్షన్ పడుతున్నారు. అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
6 గంటలు స్టేషన్లో: బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ను బుధవారం రాత్రి గజ్వేల్లో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడిని అక్కడి నుంచి హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. అతడితో పాటు ప్రశాంత్ సోదరుడిని కూడా తీసుకు వచ్చారు. ఈ క్రమంలోనే రైతు బిడ్డను ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ జరిపినట్లు తెలిసింది.

ప్రశాంత్కు హెచ్చరిక: అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్కు తీసుకు వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులోనే అతడిని అరెస్ట్ చేసినట్లు పల్లవి ప్రశాంత్కు జూబ్లీహిల్స్ పోలీసులు వివరించినట్లు తెలిసింది. అంతేకాదు, సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమంటూ ప్రశాంత్ను పోలీసులు హెచ్చరించినట్లు కూడా తెలుస్తోంది.
జడ్జ్ ఇంట్లో.. రిమాండ్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ జరిపిన తర్వాత పల్లవి ప్రశాంత్ను స్థానిక మెజిస్టేట్ జడ్జి ఇంట్లో హాజరు పరిచారు. అతడితో పాటు సోదరుడిని సైతం అక్కడకు తీసుకు వెళ్లారు. ఈ క్రమంలోనే జడ్జ్ పల్లవి ప్రశాంత్తో పాటు అతడి సోదరుడికి 14 రోజులు జ్యూడీషియల్ రిమాండ్ను విధించారు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు మీడియాకు వెళ్లడించారు.

ఆ జైలుకు.. శిక్షపైన: జడ్జ్ ముందు హాజరు పరిచిన తర్వాత రిమాండ్ కోసం పల్లవి ప్రశాంత్ను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం కేసులో అతడిపై 427 సెక్షన్ పైన కేసు నమోదు చేశారు. ఇందులో నేరం చేసినట్లు రుజువు అయితే పల్లవి ప్రశాంత్కు మూడేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











