జబర్దస్త్ వల్గారిటీ షో.. కామెడీ పేరుతో.. బిగ్బాస్ బ్యూటీ కౌంటర్
తెలుగు బుల్లితెరలో కామెడీ షోలంటే ప్రేక్షకులకు మొదట గుర్తుకు వచ్చేవి జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. ఎన్నో ఏళ్లుగా ప్రసారం అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షోలు అనేక మంది కమెడియన్స్కు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. చాలా మంది నటులు, యాంకర్లు, కమెడియన్స్ ఈ వేదిక ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్డమ్ సంపాదించారు. అయితే ఈ షోలపై విమర్శలు కూడా అప్పటి నుంచే వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గర్ జోక్స్, కుటుంబంతో కలిసి చూడలేని కొన్ని స్కిట్స్పై సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా హీరోయిన్, బిగ్బాస్ ఫేమ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అసలు ఏం అన్నారు?
జబర్థస్త్ పై పరోక్షంగా కామెంట్స్ చేసిన హీరోయిన్ ఎవరో కాదు.. హీరోయిన్, బిగ్బాస్ ఫేమ్ బిందు మాధవి. ఈమె నేరుగా ఏ షో పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా వల్గర్ కామెడీ షోలు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలుగు సినీ,టెలివిజన్ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి బిందు మాధవి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ఒకప్పుడు 'అవకాయ బిర్యానీ' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అచ్చతెలుగు అందం, తర్వాత 'బంపర్ ఆఫర్', 'పిల్ల జమిందార్' వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినా, తమిళ సినీ పరిశ్రమలో మాత్రం వరుస అవకాశాలు అందుకుని మంచి స్థాయిని సంపాదించింది.

ఇటీవల బిగ్బాస్ రియాలిటీ షోలో పాల్గొని విజేతగా నిలిచిన తర్వాత, బిందు మాధవి మళ్లీ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఆ షో ద్వారా వచ్చిన పాపులారిటీతో ఆమెకు తిరిగి టాలీవుడ్లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. 'యాంగర్ టేల్స్' వెబ్సిరీస్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఇటీవల'దండోరా'సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఇదే సమయంలో బిందు మాధవి టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి "మాస్ జాతర" అనే కొత్త కామెడీ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షో గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసాయి. కామెడీ షోలలో పెరుగుతున్న వల్గారిటీపై ఆమె పరోక్షంగా స్పందించడం విశేషం.
'మాస్ జాతర పూర్తిగా ఎంటర్టైన్మెంట్తో నిండిన షో. కానీ, మొదట నన్ను జడ్జిగా అడిగినప్పుడు వెంటనే ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా కామెడీ షోలలో డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గర్ జోక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాంటి కంటెంట్తో నేను కంఫర్ట్గా ఉండలేను అనిపించింది' అని ఆమె స్పష్టం చేసింది. అయితే షో డైరెక్టర్ ప్రత్యేకంగా వచ్చి క్లారిటీ ఇవ్వడంతోనే తాను అంగీకరించానని తెలిపింది. 'మా షోలో ఎలాంటి వల్గారిటీ ఉండదు. కుటుంబం మొత్తం కలిసి చూసేలా క్లీన్ కామెడీ అందిస్తాం. ఎక్కడైనా అసౌకర్యంగా అనిపిస్తే మీరు మధ్యలోనే వెళ్లిపోవచ్చు అని కూడా చెప్పారు. ఆ నమ్మకంతోనే ఈ షోలో భాగమయ్యాను' అని వివరించింది.
ఇప్పటికే 28 ఎపిసోడ్లు పూర్తి అయ్యాయని, ఇప్పటివరకు ఒక్కసారి కూడా అసౌకర్యంగా ఫీల్ కాలేదని బిందు మాధవి చెప్పడం గమనార్హం. 'తెలుగులో కూడా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేలా క్లీన్ కామెడీ చేయగలమని మా షో నిరూపిస్తోంది. ఇందులో భాగమవ్వడం నాకు గర్వంగా ఉంది' అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. బిందు మాధవి నేరుగా ఏ షో పేరును ప్రస్తావించకపోయినా, నెటిజన్లు మాత్రం ఆమె వ్యాఖ్యలను ప్రముఖ కామెడీ షోలపై ఇండైరెక్ట్ కౌంటర్గా భావిస్తున్నారు. దీంతో తెలుగు టెలివిజన్లో కామెడీ కంటెంట్ నాణ్యత, వల్గారిటీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications



