జస్ట్ మిస్ .. బూడిద కుప్పగా మిగిలేదాన్ని , బుల్లితెర నటికి భయానక అనుభవం
ప్రకృతి ముందు మనిషి నిలబడలేడని ఎన్నో సంఘటనలు నిరూపిస్తూనే ఉన్నాయి. తుఫాన్లు, వరదలు, భూకంపాలు, సునామీలు వంటి వాటి ద్వారా తాను ఎంత శక్తివంతురాలినో ప్రకృతి చూపెడుతుంది. నిన్న గాక మొన్న టిబెట్, నేపాల్లను ఇటీవల భారీ భూకంపం కుదిపేయగా భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఇప్పుడు ప్రపంచం మాట్లాడుతున్న మరో విపత్తు అమెరికాలో కార్చిచ్చు.
అగ్రరాజ్యం అమెరికాలో టోర్నడోలు, కార్చిచ్చులు సర్వసాధారణం. వీటికి అక్కడి జనాలు, ప్రభుత్వాలు కూడా అలవాటు పడ్డాయి. ఇలాంటివి తలెత్తినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని ప్రాణ, ఆస్తి నష్టాలను సాధ్యమైనంత మేర తగ్గించేందుకు ప్రయత్నించడం మినహా పెద్దగా చేయగలిగేది ఏం లేదు. అమెరికాలో న్యూయార్క్ తర్వాత అతిపెద్ద నగరంగా, సంపన్నులకు, సెలబ్రెటీలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే లాస్ ఏంజెల్స్ నగరం కార్చిచ్చు కారణంగా స్మశానాన్ని తలపిస్తోంది.

ఎటు చూసినా కాలిపోయిన ఇళ్లు, వాహనాలు, ఖరీదైన వస్తువులు, చెట్లే కనిపిస్తున్నాయి. కార్చిచ్చు ధాటికి సామాన్యులే కాదు.. సంపన్నులు, సినీ తారలు, ఇతర ప్రముఖులు ప్రాణ భయంతో అన్ని అక్కడే వదిలేసి పిల్లా పాపలతో సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఈ ప్రాంతంలోని మంటలు, పొగ అంతరిక్షం నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయంటే పరిస్ధితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు.
కాలిఫోర్నియాలో చోటు చేసుకున్న ఈ కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకు 20 మంది వరకు ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 2 లక్షల మందికి పైగా నిరాశ్రయులైనట్లుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు 35 వేల ఎకరాల విస్తీర్ణంలో మంటలు వ్యాపించినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. అయితే ఇంతటి ఉపద్రవం నుంచి తృటిలో తప్పించుకుంది భారత్కు చెందిన బుల్లితెర నటి రూపల్ త్యాగి. కొరియోగ్రాఫర్గా, నటిగా ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ హిందీ సీరియల్స్లో స్టార్గా వెలుగొందుతున్నారు. కసమ్ సే, దిల్ మిల్ గయే, శక్తి అస్తివా కే ఎసాస్ కీ, యంగ్ డ్రీమ్స్, రంజు కీ బేటియాన్ వంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇటీవల చదువుల నిమిత్తం అమెరికాలోని లాస్ ఏంజెల్స్కు వెళ్లిన రూపల్ కొద్ది నెలల పాటు అక్కడే ఉన్నారు. వచ్చిన పని పూర్తి కావడంతో ఇటీవలే భారత్కు తిరిగొచ్చిన రూపల్.. లాస్ ఏంజిల్స్ నగరం కాలి బూడిద కావడంతో షాకైంది. తాను ఇండియాకు వచ్చే ముందు విమానంలో పొగను చూశానని.. అయితే అది ఇక్కడ సర్వ సాధారణం కావడంతో పట్టించుకోలేదని రూపల్ అన్నారు. భారత్కు వచ్చే ముందు నేను ఏ రోడ్డు మీదుగా ప్రయాణించానో, అక్కడ ఇప్పుడు ఏం మిగల్లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి ప్రమాదం నుంచి భగవంతుడి ఆశీస్సుల వల్లే బతికిపోయానని రూపల్ తెలిపారు. క్లిష్ట పరిస్ధితుల్లో అమెరికాలోని నా మిత్రుల వెంట లేకపోయానని, వారంతా ఈ విషాదం నుంచి కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











