నటి హేమ విషయంలో తప్పు చేశా.. తమన్నా క్షమాపణలు!
టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కామెడీ టైమింగ్తో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ. ఈ సీనియర్ యాక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో హీరోలకు అక్కగా, వదినగా, తల్లిగా, కామెడీ పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా కుటుంబ కథా సినిమాలు, వినోదాత్మక సినిమాల్లో హేమకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే గత కొంతకాలంగా ఆమె పేరు సినిమాల కంటే వివాదాల్లోనే ఎక్కువగా వినిపించింది. ముఖ్యంగా డ్రగ్స్ కేసు ఆరోపణలు హేమ కెరీర్పై తీవ్ర ప్రభావం చూపించాయని సినీ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే.. తాజాగా తమన్నా సింహాద్రి (Tamanna Simhadri)సోషల్ మీడియా వేదికగా నటి హేమ(Hema)కు క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఇంతకీ ఏమైందంటే..?
ఏడాదిన్నర క్రితం బెంగళూరులో జరిగిన ఓ హైప్రొఫైల్ పార్టీకి సంబంధించి డ్రగ్స్ కేసు వార్తలు సంచలనం సృష్టించాయి. ఆ పార్టీలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారనే వార్తలతో పాటు, హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నారని ఆరోపణలు వెలువడ్డాయి. కొన్ని మీడియా సంస్థలు ఆమెపై తీవ్ర విమర్శలు చేయగా, సోషల్ మీడియాలో కూడా హేమపై నెగెటివ్ ప్రచారం జరిగింది. ఈ వ్యవహారం ఆమె ఇమేజ్కు పెద్ద దెబ్బతీసింది. అయితే అప్పట్లోనే హేమ తాను ఎలాంటి తప్పూ చేయలేదని బహిరంగంగా ప్రకటించారు. మీడియా ముందుకు వచ్చి తాను నిర్దోషినని, తనపై వస్తున్న ఆరోపణలు అసత్యమని స్పష్టం చేశారు.

ఇక కేసు విచారణ పూర్తయ్యాక బెంగుళూర్ హైకోర్టు కోర్టు నుంచి హేమకు క్లీన్ చిట్ రావడంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ప్రెస్ మీట్ పెట్టి "నేను తప్పు చేయలేదని మరోసారి నిరూపించుకున్నాను" అంటూ భావోద్వేగంగా స్పందించారు. ఈ వివాద సమయంలో పలువురు సినీ ప్రముఖులు కూడా హేమపై విమర్శలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అందులో ముఖ్యంగా బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి (Tamanna Simhadri) పేరు ఎక్కువగా వినిపించింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా సింహాద్రి అప్పట్లో హేమపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరిగింది. మీడియా వేదికగా కూడా ఆమె హేమను విమర్శించారని చెప్పబడింది.
ఇదే సమయంలో నటి కరాటే కళ్యాణ్ కూడా హేమపై విమర్శలు చేసినట్లు సమాచారం. దీంతో హేమ ఈ ఇద్దరిపై పరువు నష్టం దావా వేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా పెట్టినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఈ వివాదం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు ఈ కథలో కొత్త మలుపు చోటుచేసుకుంది. తాజాగా తమన్నా సింహాద్రి సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేసి హేమకు క్షమాపణలు కోరారు. "సారీ హేమక్కా.. అందరూ నీ మీద బురద చల్లుతున్నప్పుడు నేను నీ వైపు నిలబడాల్సింది. కానీ నేను కూడా వారితో కలిసిపోయి నీపై బురద చల్లాను. ఇప్పుడు నా తప్పు నాకు అర్థమైంది. నేను చేసిన దానికి పశ్చాత్తాప పడుతున్నాను. నన్ను క్షమించండి" అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొందరు నెటిజన్లు తమన్నా నిజాయితీగా తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పడం మంచిదని అభినందిస్తుండగా, మరికొందరు అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేసి ఇప్పుడు సారీ చెప్పడం వల్ల జరిగిన నష్టం తిరిగి వస్తుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు హేమ ఈ విషయంపై ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది. ఆమె క్షమిస్తారా? లేక న్యాయపరంగా ముందుకు వెళ్తారా? అన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. హేమ ఇప్పటివరకు ఈ వీడియోపై అధికారికంగా స్పందించలేదు. అయితే ఆమె గతంలో చెప్పినట్లుగా తన గౌరవం దెబ్బతిన్నదనే భావనతో ఉంటే ఈ అంశం మళ్లీ చర్చనీయాంశం కావచ్చు.
ఇదిలా ఉంటే.. తమన్నా సింహాద్రి ఇటీవల తనకు వివాహమై ఏడాది పూర్తైందంటూ భర్త ఫోటోను రివీల్ చేసిన ఆమె, ఇప్పుడు బేబీ బంప్తో ఉన్న ఫోటోను షేర్ చేసి తాను గర్భవతినని ప్రకటించారు. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా గుర్తింపు తెచ్చుకున్న తమన్నా, రాజకీయాల్లో కూడా పోటీ చేసి వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం ఆమె ప్రెగ్నెన్సీ ప్రకటనపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాను ప్రత్యేక చికిత్స ద్వారా గర్భవతిని అయ్యానని తమన్నా చెబుతుండగా, కొందరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరికొందరు ఇది ఫోటోషూట్ లేదా ప్రాంక్ అయి ఉండొచ్చని కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications




