Brahmamudi April 8th Episode : రుద్రాణి కంటపడ్డ రాజ్.. అపర్ణ ఆనందం.. దుగ్గిరాల ఫ్యామిలీకి షాకిచ్చిన యామిని
ఉదయాన్నే హారతి పల్లెం తీసుకుని దుగ్గిరాల ఫ్యామిలీని త్వరగా రెడీ అవ్వమని అంటుంది కావ్య. ఎందుకని కుటుంబ సభ్యులు అడగ్గా.. ఆయన త్వరగా తిరిగి రావాలని సీతారాముల కళ్యాణం చేయిస్తున్నట్లు చెబుతుంది కావ్య. రాజ్ లేకుండా గుడికి వెళితే బాగోదని నలుగురూ అడిగితే ఏం చెబుతావని రుద్రాణి ప్రశ్నించగా.. ఎవరు ఏం అడిగినా నేను చూసుకుంటానని అంటుంది కావ్య. ఆమె బలవంతం చేసేసరికి అందరూ గుడికి బయల్దేరతారు.
ఆలయంలో సీతారాముల కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేసిన పంతులు గారు రాజ్ ఎక్కడ అని దుగ్గిరాల ఫ్యామిలీని అడుగుతారు. ఆయన ఓ కారణం వల్ల గుడికి రాలేదని.. ఆయన వచ్చాక ఇద్దరం కలిసి రాములవారి దర్శనం చేసుకుంటామని చెబుతుంది కావ్య. అటు యామిని కూడా రాజ్ని అదే గుడికి తీసుకొస్తుంది. రాహుల్ని గుడికి రాకుండా ఆపడంతో తనకు పీటల మీద కూర్చొనే ఛాన్స్ పోయిందని స్వప్న బాధపడుతుంది. రాజ్ని తీసుకుని వస్తానన్న కావ్య అతని ఫోటో తీసుకుని రావడంతో అంతా షాక్ అవుతారు. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్గా నిలిచింది. ఇక ఏప్రిల్ 8వ తేదీ ఎపిసోడ్ 690లో ఏం జరిగిందంటే?

సీతారాముల కళ్యాణంలో మా వారు పాల్గొంటారు. వచ్చి నా పక్కన కూర్చొంటారు.. నేను ఇప్పుడే వెళ్లి తీసుకొస్తానని చెబుతుంది కావ్య. ఆమె మాటలకు దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కావ్య నిజంగానే రాజ్ను తీసుకొస్తుందా అని కుటుంబ సభ్యులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంటారు. ఇంతలో రాజ్ ఫోటోతో కావ్య రావడంతో అంతా షాక్ అవుతారు. మా వారు వచ్చారు ఇప్పుడు వెళ్లి నేను సీతారాముల కళ్యాణం జరిపించొచ్చు కదా అని కావ్య అంటుంది. దంపతులు కూర్చోవాలి కానీ ఇలా ఫోటోలు, ఫ్రేమ్లు పక్కన పెట్టుకుంటానంటే కుదరదని చెబుతుంది రుద్రాణి. మీరైనా ఈ పిచ్చిదానికి బ్రెయిన్ వాష్ చేయండి అంటూ పూజారికి చెబుతుంది. మీరు కనుక కంట్రోల్ చేయకపోతే మన సాంప్రదాయాలు, ఆచారాలను మంట కలిపేలా ఉన్నారని మండిపడుతుంది రుద్రాణి.
ఒక రోజు కూడా పూజ చేసి దేవుడి ముందు దీపం పెట్టని మీరు కూడా మన సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారా అని ప్రశ్నిస్తుంది కావ్య. రామాయణంలో ప్రజల క్షేమం కోసం రాముల వారు సీతాదేవి లేదని ఆమె బంగారు విగ్రహాన్ని పక్కన పెట్టుకుని యజ్ఞం పూర్తి చేశారని, ఇప్పుడు నా భర్త నాకు అందుబాటులో లేరు కాబట్టి తన ఫోటో పక్కనపెట్టి పూజ చేయకూడదా అని ప్రశ్నిస్తుంది కావ్య. ఈ నియమ నిబంధనలన్నీ మనం పెట్టుకున్నవేనని మనసులో ఏ మలీనం లేకుండా ఏ పూజ చేసినా, ఏ కార్యక్రమం చేసినా ఆ దేవుడు కరుణిస్తాడని చెబుతాడు పూజారి గారు. ఈ క్లారిటీ సరిపోతుందా లేకపోతే మన గ్రంథాల్నీ తీసుకొచ్చి చెప్పమంటారా అని అడుగుతుంది కావ్య.
కావ్య ఇచ్చిన స్ట్రోక్ దెబ్బకి రుద్రాణి బయటికి వెళ్లి అటు ఇటూ తిరుగుతుంది. ఇంతలో రాజ్ - యామిని కలిసి కళ్యాణం దగ్గరికి వస్తారు. మనం వచ్చేసరికి ఆలస్యమైందని , ఇప్పుడు సంబంధం లేనట్లుగా దూరంగా కూర్చొని చూడాల్సి వస్తుందని యామిని బాధపడుతుంది. నువ్వు కోరుకున్నది జరిగి తీరాలా? నీకెందుకు అంత పట్టుదల అని మండిపడతాడు రాజ్. ఉన్నదాంట్లోనే సర్దుకుపోవాలని చెప్పి చివరి వరుసలో కూర్చోబెడతాడు. కళ్యాణంలో కూర్చొంటే కళావతికి ఫోన్ చేయడం కష్టమని భావించిన రాజ్.. ముందే ఆమెతో మాట్లాడదామని అనుకుంటాడు. తాను ఇప్పుడే వచ్చేస్తానని యామినితో చెప్పి వెళ్లిపోతాడు.
టెన్షన్ పడుతున్న యామినిని ఏం జరిగిందని అడుగుతుంది వైదేహి. నాకు తెలియకుండా రాజ్కు ఫ్రెండ్స్ లేరని ఎవరితో మాట్లాడుతున్నాడోనని నాకు టెన్షన్గా ఉందని తల్లితో చెబుతుంది. బహుశా కావ్యతో మాట్లాడుతున్నాడేమోనని అనుమానం వ్యక్తం చేస్తుంది. వాటర్ బాటిల్ తీసుకుని వస్తున్న ప్రకాశంకు రాజ్ కనిపించడంతో అతను షాక్ అవుతాడు. కావ్య చెబుతున్నది నిజమే అన్నమాట.. రాజ్ బతికే ఉన్నాడని అనుకుంటాడు ప్రకాశం. పరిగెత్తుకుంటూ వస్తూ ప్రసాదాలు తీసుకొస్తున్న వ్యక్తిని ఢీకొట్టడంతో అతని ప్రసాదాలు పడిపోతాయి. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరగ్గా ధాన్యలక్ష్మీ వచ్చి సర్దిచెబుతుంది.
నేను ముఖ్యమైన విషయం చెప్పాలని వస్తుంటే ఇలా జరిగిందని ప్రకాశం తన భార్యతో చెబుతాడు. అది ఏంటని ధాన్యలక్ష్మీ అడగ్గా.. ప్రకాశం తన మతిమరుపు వల్ల రాజ్ను చూసిన విషయం మరిచిపోతాడు. ఇంతలో కావ్యకి ఫోన్ చేస్తాడు రాజ్. తాను మాట్లాడే పరిస్దితుల్లో లేనని చెబుతుంది కావ్య. ఆమెకు శ్రీరామనవమి శుభాకాంక్షలు చెబుతాడు. అయితే ఫోన్లో తాను వింటున్న సౌండ్స్ రావడంతో రాజ్కు అనుమానం వస్తుంది. నేను గుడిలో ఉన్నానని తర్వాత ఫోన్ చేస్తానని పెట్టేస్తుంది కావ్య. అయితే లోపలికి వస్తున్న రాజ్ని చూసి షాక్ అవుతుంది. ఇంట్లో వాళ్లు ఆయనని చూస్తే గతం గుర్తు చేస్తారని టెన్షన్ పడుతుంది.
ఇంతలో రుద్రాణి బయటి నుంచి వచ్చి రాజ్ను చూసి షాక్ అవుతుంది. అంటే కావ్య చెబుతున్నది నిజమేనని అనుకుంటుంది. రాజ్ బతికున్న విషయం తెలిసి కూడా అతనిని ఇంటికి ఎందుకు తీసుకురాలేదని అనుకుంటుంది. కావ్య ఏదో దాస్తోందని అదేంటో ఈరోజు తేలిపోవాలని చెబుతుంది. పూజారి దగ్గర ఉన్న మైక్ తీసుకుని ఆ రాముల వారు మీ కొడుకుని మీకు ఇచ్చేస్తున్నాడని అపర్ణతో అంటుంది. నేను రాజ్ను చూశానని.. కావ్య చెబుతున్న మాటల్ని నమ్మలేదని , కానీ ఆమె చెబుతున్నదే నిజమని చెబుతుంది రుద్రాణి.
ఆయన్ను మీరు ఎప్పుడు? ఎక్కడ? చూశారని ప్రశ్నిస్తుంది కావ్య. ఇప్పుడే ఇక్కడే చూశానని రుద్రాణి చెప్పడంతో పాటు వేలు పెట్టి చూపెడుతుంది . దీంతో అందరూ వెళ్లి రాజ్ను చూస్తారు. అపర్ణ కొడుకుని చూసి కంటతడి పెడుతుంది. ఇంటికి ఎందుకు రాలేదు? మాకు దూరంగా ఎందుకున్నావ్? అని ప్రశ్నిస్తుంది. ఇన్నిరోజుల తర్వాత మీ అమ్మని చూసి కూడా నీ కళ్లలో ఆనందం కనిపించడం లేదని అపర్ణ అడగటంతో ఎవరు మీరు అని ప్రశ్నిస్తాడు రాజ్. ఆ మాటలతో అపర్ణ సహా దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది.
రాజ్కు గతం గుర్తుచేసి తీసుకెళ్లిపోతారని భయపడ్డ యామిని ఈ గొడవలో కల్పించుకుంటుంది. ఎవరు మీరంతా? మా బావతో డిస్కషన్ ఏంటీ అని అడుగుతుంది. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారని మండిపడుతుంది. తన గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా నేను సహించనని అంటుంది. తను రాజ్ కాదు రామ్ అని , స్వయానా నా మేనత్త కొడుకని చెబుతుంది యామిని. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











